అమెరికాలోని కాలిఫోర్నియాలో భారతీయ జువెలరీ స్టోర్లో భారీ దోపిడీ జరిగింది. గతేడాది జరిగిన ఘటనకు సంబందించిన సర్వైలెన్స్ ఫుటేజ్ను యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ తాజాగా విడుదల చేసింది. దీంతో ఈ భారీ దోపిడీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భారత సంతతికి చెందిన వర్మ కుటుంబం నడుపుతున్న నగల దుకాణంలో జరిగింది ఈ ఘటన. దాదాపు 20 మందికి పైగా ముసుగులు ధరించిన దుండగులు షాపులోకి చొరబడి..కేవలం 70 సెకన్ల వ్యవధిలోనే 1.7 మిలియన్ డాలర్లు..అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.16 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలను దోచుకెళ్లారు.
2025 జూన్ 18న కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్లో ఉన్న ‘కుమార్ జువెలర్స్లో ఈ దోపిడీ జరిగింది. చేతుల్లో సుత్తులు, ఇతర పరికరాలతో షోరూంలోని డిస్ప్లే కేస్లను పగలగొట్టి, అందులో ఉన్న నగలను దోచుకెళ్లారు. సెక్యూరిటీ గార్డుకు గన్ గురిపెట్టి బెదిరించి పక్కా ప్రణాళికతో ఈ దోపిడీకి పాల్పడ్డారు. కేవలం 70 సెకన్లలోనే తమ పని పూర్తి చేసుకొని పరారయ్యారు. షాపులోని దాదాపు 75 నుంచి 80 శాతం విలువైన ఆభరణాలను దుండగులు దోచుకెళ్లినట్లు తెలిపింది వర్మ కుటుంబం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి కీలక పురోగతి సాధించారు. ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ నలుగురు నిందితులపై అభియోగాలు నమోదు చేసింది. నేరం రుజువైతే వీరికి గరిష్టంగా 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ దోపిడీలో పాల్గొన్న మిగతా నిందితుల కోసం దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు అధికారులు. గతేడాది జరిగిన దోపిడీ వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో, అమెరికాలో భారతీయ వ్యాపారుల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది.




Total views : 47778