ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా సైన్స్. టెక్నాలజీ, ఇన్నోవేషన్ శాఖ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సచివాలయం వేదికగా చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో మొత్తం 55 అజెండా అంశాలపై మంత్రిమండలి చర్చించింది. అనంతరం పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, చీరాల, తిరుపతి, సత్యసాయి జిల్లాలలో పర్యాటక ప్రాజెక్టులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అలాగే సోలార్, హైడ్రో, హైబ్రిడ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు పచ్చజెండా ఊపింది.
ఇక కేబినెట్ భేటీలో భాగంగా విశాఖపట్నంలో రూ.2,387 కోట్లతో సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. వివిధ సంస్థలకు భూకేటాయింపులపై మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. కొల్లేరు అభయారణ్య సరిహద్దుల ఖరారుపై కేంద్ర ప్రభుత్వానికి పంపే ప్రతిపాదనలకు కూడా ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించే ప్రతిపాదనకు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ధ్రువీకరణ పత్రాలు ఉన్న దివ్యాంగులకు బస్సులలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లను ఫిబ్రవరి 28వ తేదీన పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఆరోజు అసెంబ్లీకి సెలవు ఇవ్వనున్నారు.