Sunday, June 14, 2026
News Navigation
Sunday, June 14, 2026
News Navigation

Breaking

Sunday, June 14, 2026
Home Andhra Pradesh ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది.

by CVR NEWS

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం తన ప్రాణాలనే త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని, అమరావతిలోని శాఖమూరులో ఆయన 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు తన ప్రాణాలను అర్పించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఆయన గౌరవార్థంగా ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించిందన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక.. అమరజీవి పొట్టి శ్రీరాములు అన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి మహనీయుడన్నారు.

పొట్టి శ్రీరాములు త్యాగం లేకపోతే ఈరోజు మనకు ప్రత్యేక రాష్ట్రం ఉండేది కాదన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగానే నవ్యాంధ్రను నిర్మిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. భావి తరాలకు ఆయన స్ఫూర్తి కలకాలం నిలిచిపోవాలనే ఉద్దేశంతోనే ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించామని చెప్పారు. అమరజీవి త్యాగాన్ని స్మరిస్తూ ప్రభుత్వం ప్రతి ఏడాది అధికారికంగా వేడుకలు నిర్వహిస్తుందని సీఎం ప్రకటించారు. కేవలం విగ్రహానికే పరిమితం కాకుండా, ఆయన ఆశయాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

స్మృతివనం అభివృద్ధి కేవలం విగ్రహానికే పరిమితం కాకుండా, రెండో దశలో మరిన్ని వసతులు కల్పించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా.. అత్యాధునిక మ్యూజియం, ఆడిటోరియం, యువత కోసం స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను నిర్మించనున్నారు. అమరజీవి త్యాగాన్ని స్మరించుకుంటూ, భావితరాలకు ఆయన ఆశయాలను చాటిచెప్పేలా ఈ స్మృతివనాన్ని తీర్చిదిద్దినట్లు ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మబలిదానం వల్లే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, ఆయన గౌరవార్థం అమరావతిలో ఈ భారీ విగ్రహాన్ని ప్రతిష్టించడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని సీఎం చంద్రబాబు కొనియాడారు.

అమరావతి రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసిన తొలి భారీ విగ్రహంగా ఇది రికార్డు సృష్టించింది. శాఖమూరులో సుమారు 6.8 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ అమరజీవి స్మృతివనం ఏర్పాటు చేశారు. పొట్టి శ్రీరాములు భారీ విగ్రహం కోసం 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్‌ను వినియోగించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, కేవలం 6 నెలల రికార్డు కాలంలోనే ప్రాజెక్టు మొదటి దశ పనులను పూర్తి చేయడం విశేషం.

 

Advertisements

You may also like

Our Visitor

023335
Total views : 141775

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.