ఇరాన్తో యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసిన అమెరికా, ఇప్పుడు ఆ దేశ అగ్ర నాయకత్వంపై ఫోకస్ పెట్టింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీతో పాటు పలువురు ఉన్నతాధికారుల ఆచూకీ తెలిపిన వారికి 10 మిలియన్ డాలర్లు..అంటే దాదాపు 92 కోట్లకు పైగా రివార్డు ఇస్తామని సంచలన ప్రకటన చేసింది. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ‘రివార్డ్స్ ఫర్ జస్టిస్’ కార్యక్రమం కింద ఈ ప్రకటనను విడుదల చేసింది. మోజ్తబా ఖమేనీతో పాటు రివల్యూషనరీ గార్డ్స్కు చెందిన కీలక సైనికాధికారుల పేర్లను కూడా ఈ జాబితాలో చేర్చింది. ఫిబ్రవరి 28న జరిగిన దాడిలోనే మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించగా, ఆయన కుమారుడు, ప్రస్తుత సుప్రీం లీడర్ మోజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు. ఈ దాడిలో ఆయన ముఖం గుర్తుపట్టలేనంతగా మారి ఉండొచ్చని, అందుకే ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి బహిరంగంగా కనిపించడం లేదని అమెరికా అనుమానిస్తోంది.
గత మూడు వారాలుగా ఇరాన్పై దాడులు చేస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇప్పటివరకు 15వేలకు పైగా లక్ష్యాలను ధ్వంసం చేశాయి. ఈ దాడుల వల్ల ఇరాన్ క్షిపణి సామర్థ్యం 90 శాతం, డ్రోన్ల శక్తి 95 శాతం క్షీణించినట్లు పెంటగాన్ తెలిపింది. ఇక ఇరాన్పై దాడులు మరింత భీకరంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు ట్రంప్. మరోవైపు, ఇరాన్ కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసివేయడంతో అంతర్జాతీయంగా చమురు సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో బ్యారెల్ చమురు ధర 100 డాలర్లు దాటి, ప్రపంచ మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఈ సంక్షోభం నేపథ్యంలో ఇరాన్ ప్రజలే తమ నాయకత్వాన్ని కూలదోస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు.



Total views : 47746