ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ మరణం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాశంగా మారింది. శక్తివంతమైన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ) అని పిలవబడే రక్షణ దళం భద్రతా నిఘాలో ఉండే ఖమేనీ హత్య చేయడం అంతా ఈజీ పని కాదు. కానీ తాజాగా ఇజ్రాయెల్,అమెరికా సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఖమేనీ మరణించాడు. అయితే ఖమేనీ మృతి వెనుక ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్ ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. తమ దేశ ప్రభుత్వం ఖమేనీని ఎలిమినేట్ చేయాలని పెట్టుకున్న లక్ష్యం కోసం ఎవరూ ఊహించని రీతిలో అతడి కదలికలను పసిగట్టి దేశానికి చేరవేసింది. మొస్సాద్ ఇచ్చిన అత్యంత కచ్చితమైన సమాచారంతో రంగంలోకి దిగిన ఇజ్రాయెల్, అమెరికా దళాలు అంతే కచ్చితత్వంతో ఖమేనీపై ఎటాక్ చేసి చంపేశాయి. ప్రపంచంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా ఇజ్రాయెల్ మొస్సాద్ ఇట్టే పసిగడుతుందనే పేరుంది. ఖమేనీని అంతం చేయడంతో ప్రపంచంలో మరోసారి మొస్సాద్ పేరుపై జోరుగా చర్చ జరుగుతోంది. శత్రువు టార్గెట్ ఫిక్స్ అయితే వారిని స్మాష్ చేసేందుకు మొస్సాద్ ఎలాంటి ఎత్తుగడలు వేస్తుందో ఓ సారి చూద్దాం..
ఇరాన్ సుప్రీం నేతను ఎలాగైనా అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఇజ్రాయెల్కు ఇదంత తేలికగా సాధ్యం కాలేదు. ఇందుకోసం అనేక ఏళ్లు అనేక రకాలుగా మొస్సాద్ నిఘా కొనసాగించింది. చివరకు ట్రాఫిక్ కెమెరాల నెట్ వర్క్, మొబైల్ ఫోన్ సిస్టమ్స్ హ్యాక్ చేసి ఖమేనీ ప్రతి కదలికను ట్రాక్ చేసిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో కొన్ని ఏళ్ల పాటు ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్ కు పాల్పడిన మొస్సాద్ వాటి ఫుటేజ్ ను ఎన్ క్రిప్ట్ చేసి స్వదేశానికి పంపించింది. ఖమేనీ కార్యాలయంలో రోజువారీ కార్యకలాపాలు, ఆయన భద్రతా సిబ్బంది వాహనాల పార్కింగ్? ఖమేనీ ఎక్కడ ఉంటారు? ఆయన ఎవరెవరిని కలుస్తున్నారు? ఎవరితో ఎలా కమ్యూనికేట్ అవుతారు? ఏదైనా ఆపద సమయం వస్తే ఎక్కడికి వెళ్తారు అనే వివరాలన్ని క్షుణ్ణంగా పసిగట్టింది. ఆ సమచారం అంతా ఎప్పటికప్పుడు తమ దేశానికి చేరవేసింది. ఈ క్రమంలో ఏఐ టూల్స్, అర్గరిథమ్స్ ను కూడా ఉపయోగించిందని, ఇలా సేకరించిన పూర్తి సమాచారంతో ఫిబ్రవరి 28న ఎటాక్ చేసి చంపేసినట్లు ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది.
మొస్సాద్ తాను పెట్టుకున్న టార్గెట్ను పూర్తి చేసేందుకు ఎంత కసిగా ఉంటుందో అంతే ఓర్పుతో ఎగ్జిక్యూట్ చేస్తుందనడానికి ఈ సంస్థ 1978లో చేపట్టిన ఆపరేషన్ స్యాడ్ నెస్ బెస్ట్ ఎగ్జామ్ పుల్. 1976 లో ప్రత్యేక పాలస్తీనా కోసం పోరాడుతున్న పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా సంస్థ చీఫ్ హద్దాద్ నేతృత్వంలో ఎయిర్ ఫ్రాన్స్ హైజాక్ చేశారు. హైజాకర్లు విమానాన్ని టెల్ అవీవ్ నుంచి పారిస్కు ఆ తర్వాత లిబియా, ఉగాండాకు తరలించుకుపోయారు. ఇజ్రాయెల్ దీన్ని ‘ఆపరేషన్ థండర్బోల్ట్’తో తిప్పికొట్టింది. ఈ ఆపరేషన్ విజయవంతం అయినా ఈ మిషన్కు నేతృత్వం వహించిన లెఫ్టినెంట్ కర్నల్ యొనాతన్ నెతన్యాహు మృతి చెందారు. ఈయన ప్రస్తుత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు స్వయాన సోదరుడు. యొనాతన్ మృతికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్న మొస్సాద్ హద్దాద్ను టార్గెట్ గా పెట్టుకుంది. ఈ ఆపరేషన్ కు ‘ఏజెంట్ స్యాడ్ నెస్’ అని నామకరణం చేసింది. హద్దాద్ ఇల్లు, కార్యాలయంలోకి వెళ్లగలిగే ఓ వ్యక్తిని తమ ఉచ్చులోకి లాకుంది. అలా 1978 జనవరి 10న ఈ ఆపరేషన్ ద్వారా తన టార్గెట్ ను పూర్తి చేసింది. అయితే తమ ట్రాప్లోకి తీసుకున్న హద్దాద్ ఇంట్లోకి వెళ్లగలిగే వ్యక్తి చేత హద్దాద్ రోజూ ఇంట్లో వాడే టూత్ పేస్ట్ స్థానంలో ఇజ్రాయెల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బయోలాజికల్ రీసెర్చ్లో తయారు చేసిన స్పెషల్ టూత్ పేస్ట్ ను ఉంచేలా చేయగలిగింది. అంతే కాదు ఆ పేస్ట్ ను హద్దాద్ ఉపయోగించేలా ప్లాన్ చేశారు. విషపూరిత రసాయనాలతో చేసిన ఆ పేస్ట్ వినియోగించిన హద్దాద్ కొన్ని రోజుల్లోనే తీవ్ర అనారోగ్యానికి గురై చనిపోయారు.
2024లో లెబనాన్లోని హెజ్ బొల్ల మిలిటెంట్ సంస్థకు చెందిన వందలాది మంది తమ వద్ద ఉన్న పేజర్లు పేలి మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. ఈ పేలుళ్ల వెనుక కూడా మొస్సాద్ ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. పేజర్ అంటే రేడియో తరంగాల ద్వారా సంక్షిప్త సందేశాలను పంపే చిన్న, పోర్టబుల్ కమ్యూనికేషన్ పరికరం. సెల్ ఫోన్లు ప్రాచుర్యంలోకి రాకముందు ప్రపంచవ్యాప్తంగా పేజర్లను విస్తృతంగా వినియోగించేవారు.
మొస్సాద్ ఇప్పటివరకు హతమార్చిన మరికొంత మంది వివరాలు చూద్దాం. 2024లో హమాస్ సీనియర్ కమాండర్ ఆమన్ షొవదేపై గగనతల దాడి చేసి హతం చేసింది మొస్సాద్. ఆదే సంవత్సరం ఇజ్రాయెల్ పౌరులు, యూదులను లక్ష్యంగా చేసుకుని అంతర్జాతీయంగా ఉగ్రవాద కార్యకలాపాలు చేపడుతున్నారనే ఆరోపణలపై హదీ ముస్తఫా అనే వ్యక్తిని డ్రోన్ దాడితో హతమార్చింది.
2018లో హమాస్ ఆయుధ నిపుణుడు ఫదీ ముహమ్మద్ అల్ బాత్ష్ ఓ మసీదుకు వెళ్లేందుకు కౌలాలంపూర్లో ప్రయాణిస్తుండగా మోటారు సైక్లిస్టులుగా వచ్చినవారు కాల్పులు జరిపి హతమార్చారు.
2009లో హమాస్ రాజకీయ నేతల్లో కరడుగట్టినవాదిగా పేరొందిన మతపెద్ద నిజార్ రయ్యన్పై జరిపిన దాడిలో ఆయనతో పాటు ఇద్దరు భార్యలు, ఏడుగురు పిల్లలు హతమయ్యారు. 2004లో గాజా నగరంపై మాస్టర్ బాంబర్తో గగనతల దాడి జరిపి సైన్యంలో నంబరు-2గా ఉన్న అద్నాన్ అల్ ఘౌల్ ను హతం చేసింది మొస్సాద్. 2004లో కారుపై క్షిపణితో దాడిచేసి హమాస్ నేత అబ్దెల్ అజీజ్ అల్ రంటిస్సిని హత్య చేసింది. 2004లో హమాస్ ఆధ్యాత్మిక నేత అహ్మద్ యాసిన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్పై క్షిపణి దాడికి పాల్పడింది.
గురి తప్పకుండా లక్ష్యాలను ఛేదించడంలో నిష్ణాతులు ఉన్న మొస్సాద్ చరిత్రలో జరిగిన కొన్ని ప్రధాన వైఫల్యాలు కూడా ఉన్నాయి.
1951లో బాగ్దాద్ స్పై రింగ్ : ఇది మొస్సాద్ ప్రారంభ దశలో జరిగిన అతిపెద్ద వైఫల్యం. ఇరాక్లో ఇజ్రాయెల్ గూఢచారుల బృందం పట్టుబడటంతో, ఆ బృందానికి చెందిన పలువురు అధికారులు అరెస్టు అయ్యారు. ఇది ఇజ్రాయెల్కు తీవ్రమైన ఇబ్బందిని కలిగించింది. 1954లో ఆపరేషన్ సుసన్నా : ఈజిప్టులో పశ్చిమ దేశాల ఆస్తులపై బాంబు దాడులు చేసి, ఆ నిందను స్థానిక ఉగ్రవాదులపైకి నెట్టేందుకు చేసిన “ఫాల్స్ ఫ్లాగ్” కుట్ర ఇది. అయితే, ఒక బాంబు అనుకోకుండా ముందే పేలడంతో ఈ మొత్తం కుట్ర బయటపడింది. దీనివల్ల గూఢచారి బృందం అరెస్టు కావడమే కాకుండా, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది.
1973లో లిల్లీహామెర్ ఎఫైర్ : 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్ ఊచకోతకు ప్రతీకారంగా మొస్సాద్ చేపట్టిన ‘ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్’లో భాగంగా ఇది జరిగింది. నార్వేలో మొస్సాద్ ఏజెంట్లు తప్పుడు సమాచారంతో ఒక అమాయకపు మొరాకో వెయిటర్ను పొరపాటున హతమార్చారు. దీనివల్ల నార్వేలో ఆరుగురు ఏజెంట్లు పట్టుబడి జైలు శిక్ష అనుభవించారు.
1997లో ఖలీద్ మెషాల్ హత్యాయత్నం : జోర్డాన్లో హమాస్ నాయకుడు ఖలీద్ మెషాల్ను విషం ఇచ్చి చంపడానికి ప్రయత్నించిన మొస్సాద్ ఏజెంట్లు అక్కడే పట్టుబడ్డారు. దీనివల్ల ఇజ్రాయెల్ తీవ్ర దౌత్యపరమైన సంక్షోభాన్ని ఎదుర్కొంది. చివరకు తమ ఏజెంట్లను విడిపించుకోవడానికి ఇజ్రాయెల్ ఆ విషానికి విరుగుడును అందించాల్సి వచ్చింది, అంతేకాకుండా హమాస్ వ్యవస్థాపకుడు షేక్ అహ్మద్ యాసిన్ను జైలు నుంచి విడుదల చేయాల్సి వచ్చింది. 2004లో న్యూజిలాండ్ పాస్పోర్ట్ స్కాండల్ : న్యూజిలాండ్ పాస్పోర్టులను అక్రమంగా పొందడానికి ప్రయత్నించిన ఇద్దరు అనుమానిత మొస్సాద్ ఏజెంట్లు పట్టుబడ్డారు. ఇది ఇజ్రాయెల్, న్యూజిలాండ్ మధ్య ఏడాది పాటు దౌత్యపరమైన సంబంధాలను దెబ్బతీసింది. దీనిపై ఇజ్రాయెల్ ప్రభుత్వం అధికారికంగా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.





Total views : 47727