అసెంబ్లీలో ప్రాంగణంలో శాసనమండలి భవనం పునర్నిర్మాణ పనులు చాలా వేగంగా నడుస్తున్నాయని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 8న ఉదయం 9.30 గంటలకు శాసన మండలి హల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని, సీఎం రేవంత్ రెడ్డి నూతన తెలంగాణ శాసన మండలిని ప్రారంభోత్సవం చేస్తారని తెలిపారు. హైదరాబాద్ లోని మండలి ఛాంబర్ లో ఆయన మీడియాతో చిట్ చాట్లో మాట్లాడారు. వచ్చే బడ్జెట్ సమావేశాలు అక్కడ నుంచి ప్రారంభం అవుతాయన్నారు. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అందరికీ సెంట్రల్ హాల్ నిర్మాణం జరుగుతుందని, దాదాపు 30 కోట్ల వ్యయంతో శాసన మండలి పనులు పూర్తి చేశారని గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. దాదాపు 99 శాతం పనులు అయిపోయాయని, ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమరావతికి వెళ్లిన తర్వాత ఆ భవనం ఖాళీగా ఉందని, దాన్ని అలాగే వదిలేస్తే బిల్డింగ్ శిథిలావస్థకు చేరుకునేలా ఉందన్నారు.
ఆ హెరిటేజ్ బిల్డింగ్ను కాపాడుకొని, అసెంబ్లీని సుందరంగా మార్చుకోవాలనే ఆలోచన చేశామని తెలిపారు. ఒకే చోట శాసనసభ, శాసన మండలి ఉండాలనే గొప్ప సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి పునర్నిర్మాణ పనులను ప్రారంభించారని, పార్లమెంట్ తరహాలో తెలంగాణ శాసనసభ ఉండబోతుందని గుత్తా చెప్పారు. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అధికారులకు, మంత్రులకు ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. బడ్జెట్ సెషన్స్ తర్వాత సెంట్రల్ హాల్ ఏర్పాటు చేస్తామని, ఈ పనులు పూర్తి కావడానికి ఏడాదిన్నర సమయం పట్టిందని, హెరిటేజ్ భవనం కావడంతో చాలా జాగ్రత్తగా పనులు చేయాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. మరో 40 నుంచి 50 సంవత్సరాల వరకు ఈ శాసన మండలి భవనానికి ఢోకా లేదన్నారు.
అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసే తెలంగాణ తల్లి విగ్రహం మార్చి 8 లోపు నిర్మాణం పూర్తి అయితే అదే రోజు విగ్రహ ఆవిష్కరణ చేస్తామని గుత్తా తెలిపారు. ఆదర్శ నగర్ లోని 9 ఎకరాల ల్యాండ్ లో కన్స్టిట్యూషన్ క్లబ్ నిర్మాణం చేపట్టబోతున్నట్లుగా ఆయన వివరించారు. మన రాష్ట్ర శాసన పరిషత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, మిగిలిన రాష్ట్రాలు కూడా మన తరహాలో సభ సమావేశ హాల్స్ నిర్మించుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం నిర్మాణం చేపట్టిందన్నారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ శాసన మండలిని, జూబ్లీహాల్ ను పునరుద్ధరణ చేసి ప్రభుత్వ కార్యక్రమాలకు వాడుకునే ఆలోచనలో సర్కార్ ఉందని గుత్తా తెలిపారు. డ్రైనేజ్, ఫ్లోరింగ్, ఎలక్ట్రిసిటీ, సీఎం ఛాంబర్, చైర్మన్, వైస్ చైర్మన్ ఛాంబర్, సెక్రటరీ ఆఫీస్, కౌన్సిల్ సెక్రెటరీయేట్, సభ్యులకు మీడియా పాయింట్, మీడియా కోసం మీడియాకు హాల్ను నిర్మించినట్లుగా గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.
ప్రస్తుత రాజకీయాల్లో ప్రశాంతంగా ఉన్నానని, అవకాశం ఇస్తే శాసన మండలిలో ఉంటానని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం అన్న వాళ్ళు సైలెంట్ అయ్యారని, ప్రజా పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికలు జమిలి ఎన్నికలని, నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది.. మహిళా రిజర్వేషన్లు వస్తాయి.. రాజకీయంగా చాలా మార్పులు వస్తాయని గుత్తా తెలిపారు. రిజర్వేషన్లు మారతాయని, తమ కుమారుడు గుత్తా అమిత్ రెడ్డికి ఎక్కడ అవకాశం వస్తే అక్కడి నుంచి పోటీలో ఉంటాడని ఆయన తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు అనేది చెప్పలేనని, ఖచ్చితంగా పోటీలో అమిత్ ఉంటాడని గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు.





Total views : 47770