242
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. కోడూరు మండల కేంద్రంలోని ఎస్పీ కాలనీలో రహదారి శంకుస్థాపన సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు బండే శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వివాదం చెలరేగింది. ఎమ్మెల్యేపై బండే శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేస్తూ, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తనయుడు, అల్లుడి అండతో నియోజకవర్గంలో ఇసుక, బుసక అక్రమ తవ్వకాలు, మద్యం అధిక ధరలు, మరియు రేషన్ బియ్యం దందా సాగిస్తున్నారని విమర్శించారు. నీ అవినీతి సామ్రాజ్యాన్ని నిరూపిస్తా, బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ ఎమ్మెల్యేకు నేరుగా సవాల్ విసిరారు. ఒకే కూటమిలో ఉండి నేతలు ఇలా బాహాబాహీకి దిగడం స్థానికంగా కలకలం రేపుతోంది.



Total views : 47746