తెలంగాణలో జరగనున్న జనగణన ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర సెన్సెస్ డైరెక్టర్ భారతీ హోలికేరి కీలక ఆదేశాలు జారీ చేశారు. మే 11 నుంచి జూన్ 9 వరకు జరగనున్న ఈ తొలి దశ గణనలో ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మే 11 నుండి జూన్ 9 వరకు మొదటి దశ జనగణన కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలో గృహాల జాబితా తయారీ, వివరాల సేకరణ కోసం అధికారులు ప్రతి ఇంటిని సందర్శిస్తారు. సర్వేలో 33 రకాల ప్రశ్నలుంటాయని, వాటికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలని ప్రజలకు సూచించారు. అయితే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా జనగణన ఎన్యుమరేటర్లకు వివరాలు చెప్పడానికి నిరాకరించినా లేదా తప్పుడు సమాచారం ఇచ్చినా, వారిపై రూ. 1000 జరిమానా విధిస్తామని భారతీ హోలికేరి స్పష్టం చేశారు. జనగణన చట్టం ప్రకారం ప్రభుత్వ అధికారులకు సరైన వివరాలు అందించడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఆమె గుర్తు చేశారు.
ఈ మొదటి దశలో ప్రధానంగా ఇళ్ల గణన, మౌలిక సదుపాయాల గురించి వివరాలు సేకరిస్తారు. ప్రజలు ఎటువంటి భయాందోళనలు చెందకుండా అధికారులకు సహకరించాలని, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు మరియు భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనకు ఈ స మాచారం ఎంతో కీలకమని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే, జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మే 11 నుండి ప్రారంభమయ్యే ఈ ప్రక్రియలో గణన సిబ్బందికి పూర్తి వివరాలు అందించి సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. కాగా రెండవ దశ జనగణన 2027 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు జరగనుంది.





Total views : 47733