తెలుగు చలన చిత్ర పరిశ్రమ నేడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది, హాలీవుడ్ స్థాయికి ఎదిగిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లుగా నిలిచిపోయిన సినీ అవార్డులను తిరిగి పునరుద్ధరించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి భట్టి విక్రమార్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కళాకారులను గౌరవించుకోవడం ప్రభుత్వ బాధ్యతని ఆయన పేర్కొన్నారు. సత్య హరిశ్చంద్ర వంటి పౌరాణిక చిత్రాల నుంచి నేటి ఆధునిక చిత్రాల వరకు తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సందేశాత్మక చిత్రాలు వచ్చాయని భట్టి విక్రమార్క అన్నారు. ఇవి కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా, సమాజంలో గొప్ప మార్పులకు నాంది పలికాయని కొనియాడారు. అవార్డుల ఎంపికలో ఎక్కడా రాజీ పడకుండా, అత్యంత పారదర్శకంగా విజేతలను నిష్పక్షపాతంగా ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరుతో ఈ అవార్డులను నిర్వహించడం గర్వకారణమని, సామాజిక మార్పు కోసం తన జీవితాన్ని ధారపోసిన మహానుభావుడు గద్దర్ అని కొనియాడారు. గద్దర్ వ్యక్తి కాదు వ్యవస్థ.. తెలంగాణ ఆటని, పాటని, ఆత్మని ప్రపంచానికి తెలియజెప్పిన గొప్ప కళాకారుడని అన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన సినీ ప్రముఖులకు, కళాకారులకు మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తెలుగు చిత్ర పరిశ్రమ హాలీవుడ్ స్థాయికి చేరింది.
110
previous post



Total views : 33575