తెలుగు రాష్ట్రాల్లో మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం దుమారం రేపుతోంది. మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ వ్యవహారంలో వ్యాపారవేత్తలు, రియల్టర్లు, రాజకీయనేతలు ఇన్వాల్వ్ కావడంతో రాజకీయంగా తీవ్ర చర్చలకు దారితీసింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తో పాటు మొత్తం 11 మంది ఈ పార్టీలో పాల్గొనగా వారిలో పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఆరుగురికి డ్రగ్ పాజిటివ్ రావడంతో సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై స్పందించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రజాప్రతినిధులకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీసీసీ చీఫ్ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సమాజంలో మాదకద్రవ్యాల వాడకం పెరగడం అత్యంత దురదృష్టకరమని, దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. డ్రగ్స్ వాడకాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ఖండిస్తుందని, ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా ఎవరైనా సరే కఠిన శిక్షలు అనుభవించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. తాను ఏ విధమైన పరీక్షకైనా, ఏ సమయమైనా సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా కేటీఆర్ పునరుద్ఘాటించారు.
మరోవైపు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతి చిన్న విషయంలోనూ తన పేరును డ్రగ్స్ వివాదాల్లోకి లాగడంపై కేటీఆర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రతీసారి ఆధారాలు లేకుండా తన పేరును ప్రస్తావిస్తే ఇకపై ఉపేక్షించేది లేదని. చట్టపరంగా కఠినంగా స్పందిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే పలుమార్లు తాను పరీక్షలకు సిద్ధమని చెప్పినప్పటికీ, కావాలనే బురదజల్లే రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా తమ మద్దతు ఉంటుందని, కానీ వ్యక్తిత్వ హననానికి పాల్పడితే మాత్రం సహించబోమని కేటీఆర్ తేల్చి చెప్పారు.





Total views : 47739