Sunday, March 15, 2026
News Navigation

Breaking

Sunday, March 15, 2026
Home Sports నెదర్లాండ్స్‌పై విజయం సాధించిన టీమిండియా

నెదర్లాండ్స్‌పై విజయం సాధించిన టీమిండియా

by CVR NEWS

టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత జట్టు తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. గ్రూప్-ఏలో భాగంగా తన చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 17 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో శివమ్ దుబే ఈ మ్యాచ్‌లో హీరోగా నిలిచాడు. బ్యాటింగ్‌లో అద్భుత అర్ధశతకం సాధించడంతో పాటు బౌలింగ్‌లోనూ కీలక వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. గ్రూప్-ఏలో భారత్ వరుసగా నాలుగు మ్యాచ్ లు గెలిచి, ఓటమన్నదే లేకుండా సూపర్-8లోకి అడుగుపెట్టనుంది.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నెదర్లాండ్స్ తో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆదిలోనే అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయినప్పటికీ, ఇషాన్ కిషన్ వేగంగా ఆడాడు. ఆ తర్వాత తిలక్ వర్మ , కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిలకడగా రాణించారు. అయితే, అసలు సిసలు విధ్వంసం సృష్టించింది శివమ్ దూబేనే. కేవలం 31 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. చివర్లో హార్దిక్ పాండ్యా కూడా రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోరు సాధించింది. నెదర్లాండ్స్ బౌలర్లలో లోగాన్ వాన్ బీక్ 3, ఆర్యన్ దత్ 2 వికెట్లు తీశారు.

194 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ గట్టిగానే పోరాడింది. బాస్ డి లీడ్ , కోలిన్ అకెర్‌మాన్ , జాక్ లయన్-కాచెట్ రాణించారు. అయితే, భారత బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీసి ఒత్తిడి పెంచారు. ముఖ్యంగా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కేవలం 14 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి నెదర్లాండ్స్ పతనాన్ని శాసించాడు. శివమ్ దూబే బంతితోనూ రాణించి 2 వికెట్లు తీయగా, బుమ్రాకు ఒక వికెట్ దక్కింది. దీంతో నెదర్లాండ్స్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఈ విజయంతో భారత్ గ్రూప్ దశను అజేయంగా ముగించింది. తద్వారా 4 మ్యాచ్ ల్లో 4 విజయాలతో గ్రూప్-ఏలో టాపర్ గా నిలిచింది. సూపర్-8లో గ్రూప్-1లో ఉన్న భారత్… ఫిబ్రవరి 22న దక్షిణాఫ్రికాతో, ఫిబ్రవరి 26న జింబాబ్వేతో, మార్చి 1న వెస్టిండీస్ తో తలపడనుంది.

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.