పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యం.. తాజాగా లెబనాన్ భూభాగంలోకి మరింత లోపలికి చొచ్చుకుపోయింది. ఇజ్రాయెల్ బలగాలు ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దు నుంచి సుమారు 6 కిలోమీటర్ల మేర ముందుకు వెళ్లి, దక్షిణ లెబనాన్ పట్టణమైన ఖియామ్ లోకి ప్రవేశించినట్లు లెబనీస్ మీడియా వెల్లడించింది. ప్రస్తుతం ఖియామ్ పట్టణంలో ఇజ్రాయెల్ సైన్యం నిరంతర ఆర్టిలరీ షెల్లింగ్తో భీకర దాడులకు పాల్పడుతోందని, శత్రు బలగాలు పట్టణంలోకి ప్రవేశించాయని స్థానిక మీడియా నివేదించింది. ఒకవైపు వైమానిక దాడులు చేస్తూనే, దానికి సమాంతరంగా ఇజ్రాయెల్ దళాలు సరిహద్దు ప్రాంతం గుండా ఈ దాడులకు దిగినట్లు లెబనీస్ సైనిక వర్గాలు తెలిపాయి.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ వీడ్కోలు కార్యక్రమం వాయిదా పడింది. అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ఐదో రోజుకు చేరుకోవడం, దాడుల తీవ్రత పెరగడంతో భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గత వారంలో జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఖమేనీ అంత్యక్రియలు ఆయన స్వస్థలమైన మషాద్ నగరంలో నిర్వహించనున్నారు. అక్కడి ప్రసిద్ధ ఇమామ్ రజా మసీదు ప్రాంగణంలోనే ఖమేనీ తండ్రి సమాధి కూడా ఉంది. 40 రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని ఇరాన్ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారు అయిన సౌదీ అరామ్కో కు చెందిన అతిపెద్ద రిఫైనరీ రాస్ తనురా పై ఇరాన్ మరోసారి డ్రోన్ దాడి చేసింది. ఈ విషయాన్ని సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి కూడా ధృవీకరించారు. అయితే, ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ దాడి వల్ల ఎలాంటి ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. ఇరాన్ తయారీ షాహెద్ సూసైడ్ డ్రోన్లతో జరిగిన దాడి కారణంగా అరామ్కో రిఫైనరీని తాత్కాలికంగా మూసివేశారు. తాజాగా జరిగిన దాడితో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఫస్ట్ అటాక్ తర్వాత అరామ్కో ఇప్పటికే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ , ప్రోపేన్, బ్యూటేన్ ఎగుమతులను కొన్ని వారాల పాటు నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది.మ రోవైపు హార్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా ప్రమాదకరంగా మారడంతో, సౌదీ అరేబియా తన ఎగుమతులను రెడ్ సీ మీదుగా తరలించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది.
మిడిల్ ఈస్ట్లో పెరుగుతున్న యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఇవాళ 1.4 శాతం పెరిగి బ్యారెల్కు 82.53 డాలర్లకు చేరింది..ఇరాన్తో యుద్ధం వేళ అమెరికా వద్ద ఉన్న క్షిపణి, ఆయుధ నిల్వలు తగ్గుతున్నట్లు తాజాగా పలు నివేదికలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయుధ ఉత్పత్తిని త్వరితగతిన పెంచే అంశంపై చర్చలు జరపడానికి రక్షణరంగ కాంట్రాక్టర్లను, ఇతర ఉన్నతాధికారులను అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్కు ఆహ్వానించినట్టు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.ఇరాన్తో కొనసాగుతోన్న యుద్ధంలో భారీగా క్షిపణులను వినియోగించడంతో.. తగ్గిపోతున్న ఆయుధాగారాన్ని తిరిగి నింపడానికి అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ చర్యలు తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇందుకు పెద్ద మొత్తంలో ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా వేశాయి. 2022లో రష్యా ఉక్రెయిన్పై దాడి చేసినప్పటి నుంచి అగ్రరాజ్యం ఉక్రెయిన్కు భారీగా సైనిక సహాయం అందిస్తుండడంతో.. ఆ దేశం వద్ద ఉన్న నిల్వలు తగ్గినట్టు తెలుస్తోంది. మరో 10 రోజులు ఇలాగే దాడులు కొనసాగిస్తే అవి పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉందని పెంటగాన్ పేర్కొన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు ఎమర్జెన్సీ మీటింగ్కు సిద్ధమయ్యారు.




Total views : 47748