పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారత ఇంధన రంగాన్ని కుదిపేస్తున్నాయి. ఇరాన్ యుద్ధ ప్రభావంతో దేశీయంగా ఎల్పీజీ కొరత తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. గ్యాస్ నిల్వలు పక్కదారి పట్టకుండా ఉండేందుకు చమురు శుద్ధి సంస్థలపై అత్యవసర సేవల నిర్వహణ చట్టం ఎస్మా ప్రయోగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశీయ అవసరాల దృష్ట్యా ఎల్పీజీ ఉత్పత్తిని గరిష్ట స్థాయికి పెంచాలని ఆయిల్ రిఫైనరీలను పెట్రోలియం శాఖ ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న నిల్వలను కేవలం డొమెస్టిక్ గ్యాస్ , ఎరువుల ఫ్యాక్టరీలు, పవర్ ప్లాంట్లకే తొలి ప్రాధాన్యతగా కేటాయించాలని నిర్ణయించింది. అత్యవసర పరిస్థితుల్లో సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఈ ముందస్తు చర్యలు చేపట్టింది. మరోవైపు, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం కమర్షియల్ గ్యాస్ వినియోగదారులపై పిడుగులా పడింది. ఎల్పీజీ కొరత సాకుతో హోటళ్లు, రెస్టారెంట్లకు కమర్షియల్ సిలిండర్ల సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయడంతో యజమానులు ఆందోళన బాట పట్టారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఇప్పటికే సరఫరా నిలిచిపోయింది. దీనిపై చెన్నై హోటల్స్ అసోసియేషన్ నేరుగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. “ఆహార రంగం నిరంతర సేవలు అందించే రంగం. ఆసుపత్రులు, ఐటీ పార్కులు, హాస్టళ్లు, రైలు ప్రయాణికులకు ఆహారం అందించడం ఇప్పుడు కష్టతరంగా మారింది. ఇప్పటికే బుక్ అయిన స్టార్ హోటల్స్, బ్యాంక్వెట్ హాల్స్ ఈ నిర్ణయంతో కుప్పకూలే ప్రమాదం ఉంది. వెంటనే ఎల్పీజీని అత్యవసర సేవగా గుర్తించి సరఫరాను పునరుద్ధరించండి” అని వారు విజ్ఞప్తి చేశారు.
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారత ఇంధన రంగాన్ని కుదిపేస్తున్నాయి.
135





Total views : 47738