పశ్చిమాసియా ఘర్షణలతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. దాంతో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. తాజాగా బ్యారెల్ ముడిచమురు ధర 100 డాలర్ల మార్క్ దాటేసింది. నాలుగేళ్లలో ఒక బ్యారెల్ ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. అమెరికా చమురు ధరలకు బెంచ్మార్క్గా ఉన్న వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ధర 106.22 డాలర్లు పలికింది. శుక్రవారం మార్కెట్లు ముగిసినప్పుడు ఆ రేటు 90.90 డాలర్లుగా ఉండగా.. తాజాగా 16.9 శాతం పెరిగింది. షికాగో మెర్కంటైల్ ఎక్స్ఛేంజీలో ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 16.5 శాతం పెరిగి.. 107.97 డాలర్లకు ఎగబాకింది. గతవారం అమెరికా క్రూడ్ ధర 36 శాతం, బ్రెంట్ క్రూడ్ 26 శాతం పెరిగాయి. ఆ ఎఫెక్టే ట్రేడింగ్లో కనిపించింది.
ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం కొనసాగుతోంది. మరింత తీవ్రరూపం దాల్చింది. దాంతో పశ్చిమాసియాలో చమురు ఉత్పత్తి, షిప్పింగ్కు అంతరాయం కలుగుతోంది. మరోవైపు హర్మూజ్ జలసంధిని మూసివేశామని, నౌకలు దానిని దాటడానికి ప్రయత్నిస్తే నిప్పు పెడతామని ఇరాన్ హెచ్చరించింది. హర్మూజ్ ప్రపంచ ఇంధనానికి జీవనాడి వంటిది. కేవలం కొన్ని కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ జలసంధి నుంచి ప్రపంచం వాడే చమురులో ఐదోవంతు రవాణా అవుతోంది. ఇప్పుడు ఈ రవాణాకు ఆటంకం ఏర్పడింది. దీంతో క్రూడాయిల్ ధరలు భగ్గుమంటున్నాయి.




Total views : 33591