ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో శ్రీభ్రమరాంబికా దేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం వైభవంగా జరిగింది. లోకళ్యాణార్ధం అమ్మవారికి కుంభోత్సవం నిర్వహించారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలో తొలి విడత సాత్వికబలిగా కొబ్బరి, నిమ్మ, గుమ్మడికాయలు సమర్పించారు. సాయంత్రం ఆది దంపతులకు వెండి రథోత్సవం నిర్వహించారు. స్వామివారికి అన్నాభిషేకం చేశారు. అమ్మవారి ఆలయ సింహ మండపం వద్ద అన్నాన్ని రాశిగా పోసి.. ప్రదోశకాల పూజల అనంతరం మల్లికార్జున స్వామికి అన్నాభిషేకం చేస్తారు. ఆలయ ద్వారాలు మూసివేసిన అనంతరం ఆలయ ఉద్యోగి స్త్రీ వేషధారణలో భ్రమరాంబాదేవికి కుంభహారతి సమర్పించారు.. తర్వాత నవకాయ పిండివంటలతో మహానివేదన సమర్పించారు. కుంభోత్సవం నేపథ్యంలో ఆదిదంపతులను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
సాయంత్రం రెండో విడత సింహ మండపం వద్ద కొబ్బరికాయలు, గుమ్మడికాయలను సాత్విక బలిగా సమర్పించారు. కుంభహారతి సమయంలో భ్రమరాంబాదేవికి అధిక పరిమాణంలో పసుపు, కుంకుమలను సమర్పించి శాంతి ప్రక్రియను నిర్వహించారు. ఉత్సవం ముగిసిన తర్వాత భక్తులను అమ్మవారి భ్రమరాంబికా దేవి నిజరూప దర్శనానికి అనుమతి ఇచ్చారు. శ్రీశైల మహాక్షేత్రంలో నిర్వహించే కుంభోత్సవం క్షేత్ర రక్షణ కోసం ఏటా ఛైత్రమాసంలో పౌర్ణమి తర్వాత నిర్వహించడం ఆనవాయితీ. కాగా ఈ కుంభోత్సవం నేపథ్యంలో అమ్మవారి ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలను, స్వామివారి కళ్యాణోత్సవం, ఏకాంత సేవలను రద్దుచేశారు.కుంభోత్సవంలో ఆయా కైంకర్యాలన్నిటినీ ఆలయ ఈవో శ్రీనివాసరావు సూచనల మేరకు వైదిక కమిటీకి పరిపూర్ణంగా జరిపించాలని సూచించారు. క్షేత్రంలో జీవహింస నిషిద్ధం కారణంగా జంతు, పక్షి బలులు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు రద్దీ వల్ల క్యూ లైన్లలో తొక్కిసలాట లేకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. క్యూ లైన్ల నిర్వహణకు కూడా సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు.




Total views : 47742