సత్యమేవ జయతే. సత్యం ఎప్పటికీ విజయం సాధిస్తుంది. అక్రమాలు ఎక్కవ కాలం దాగవు. ఎప్పుడో ఒకప్పుడు బయటపడాల్సిందే. ఈ విషయం మైరాన్ హోమ్స్ విషయంలో మరోసారి రుజువైంది. ఎలాంటి అనుమతులు లేకుండానే బాచుపల్లిలో ప్రీలాంచ్ పేరుతో ఆఫర్లు ప్రకటించి 200 కోట్ల రూపాయల మేర కస్టమర్లకు కుచ్చు టోపీ పెట్టింది మైరాన్ హోమ్స్. ఈ మోసంపై సీవీఆర్ న్యూస్ వరుస కథనాలను ప్రసారం చేసింది. మైరాన్ మాల్ నిర్మిస్తున్న భూములు లిటిగేషన్లో ఉన్నాయంటూ ఆధారాలతో సహా బయటపెట్టింది. రెరా, HMDA నుంచి ఆ సంస్థకు ఎలాంటి అనుమతులు లేవని చెప్పింది. సీవీఆర్ న్యూస్ చెప్పిన విషయాలు అక్షర సత్యాలయ్యాయి. మైరాన్ హోమ్స్ కు రెరా నుంచి ఎలాంటి అనుమతులు లేవని.. అసలు వారు అనుమతి కోసం దరఖాస్తు కూడా చేసుకోలేదని.. రెరా సెక్రెటరీ శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. అనుమతి లేకుండా ప్రీలాంచ్ ఆఫర్ ఇవ్వడం, మార్కెటింగ్ చేయడం… రెరా చట్టంలోని 3,4 సెక్షన్ల ప్రకారం నేరమని కుండబద్దలు కొట్టారు. దీనిపై మీడియాలో వస్తున్న వరుస కథనాల నేపథ్యంలో సుమోటోగా కేసు నమోదు చేసినట్లు శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు….
మరోవైపు HMDA లో కూడా మైరాన్ హోమ్స్ బాచుపల్లి మాల్ కు ఎలాంటి అనుమతులు లభించలేదు. భూమి లిటిగేషన్లో ఉండడమే దీనికి కారణమని HMDA అధికారులు స్పష్టంగా చెబుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా మైరాన్ హోమ్స్ యథేచ్ఛగా ప్రీలాంచ్ కు దిగడం… ఏకంగా 200 కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టడంపై బాధితులు మండిపడుతున్నారు. అధికారుల అండ లేనిదే ఇదంతా జరుగుతుందా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. మైరాన్ హోమ్స్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.




Total views : 46149