ధనాధన్ క్రికెట్ పండుగ ముగిసింది. కోట్లాది మంది భారతీయుల కల నెరవేరింది. నరేంద్ర మోడీ స్టేడియం సాక్షిగా టీమ్ఇండియా మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో న్యూజిలాండ్ను చిత్తు చేసిన సూర్యకుమార్ సేన, ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 ట్రోఫీని సగర్వంగా ముద్దాడింది. తద్వారా 2024లో సాధించిన టైటిల్ను నిలబెట్టుకుని, పొట్టి ఫార్మాట్లో తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 255 భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్, అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వగా, ఇషాన్ కిషన్ అర్థ శతకంతో చివర్లో హార్దిక్ పాండ్య, శివమ్ దూబే మెరుపులు మెరిపించారు. అనంతరం లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ను భారత బౌలర్లు కట్టడి చేశారు. జస్ప్రీత్ బుమ్రా తన పదునైన బంతులతో, అక్షర పటేల్ తన స్పిన్ మాయాజాలంతో కివీస్ నడ్డి విరవగా, కీలక సమయాల్లో వికెట్లు తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. 2024 తర్వాత వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ను గెలుచుకున్న జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది.
సూర్యకుమార్ యాదవ్ తన కెప్టెన్సీలో భారత్కు తొలి మేజర్ ఐసీసీ ట్రోఫీని అందించారు. ఫైనల్ మ్యాచ్లో యువ బ్యాటర్ అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ మెరుపు అర్ధశతకంతో ఆకట్టుకున్నారు.
ఈ విజయంపై దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. పలువురు ప్రముఖులు టీమ్ఇండియాకు అభినందనలు తెలిపారు. “ఇది భారత క్రికెట్ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం” అని క్రీడా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మరోసారి చరిత్రను తిరగరాసింది. గుజరాత్లోని అహ్మదాబాద్, నరేంద్ర మోడీ స్టేడియంలో లక్షలాది మంది అభిమానుల జయజయధ్వానాల మధ్య భారత్ ప్రపంచ క్రికెట్ శిఖరాన్ని అధిరోహించింది. ఆదివారం జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరులో న్యూజిలాండ్పై టీమిండియా ఘన విజయం సాధించి, విశ్వవిజేతగా నిలిచింది. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ భారత్కు దక్కడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. మొత్తంగా భారత్ మూడు టీ20 ప్రపంచకప్లు సాధించడం గమనార్హం.
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత ఓపెనర్ సంజూ శాంసన్ వీరోచిత ప్రదర్శన చేశారు. 46 బంతుల్లో 89 పరుగులు చేశారు. ఆ తర్వాత అభిషేక్, ఇషాన్ కిషన్ కూడా హాఫ్ సెంచరీలతో రాణించారు. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 256 పరుగుల భారీ స్కోరు సాధించింది. కివీస్ బౌలర్లలో నీషమ్ మూడు, రచిన్ రవీంద్ర, హెన్రీ ఒక వికెట్ తీశారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ తమ పదునైన బౌలింగ్తో ఆరంభంలోనే వికెట్లు తీశారు. ఒత్తిడిలో వరుసగా వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్, భారత బౌలింగ్ ధాటికి నిలవలేక ఓటమిని అంగీకరించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో సీఫెర్ట్ (52), కెప్టెన్ శాంట్నర్ (43) తప్ప ఎవరూ రాణించలేదు. మొత్తంగా 19 ఓవర్లలో 159 పరుగులు చేసి న్యూజిలాండ్ జట్టు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో బూమ్రా నాలుగు, అక్షర్ మూడు, వరుణ్, హార్దిక్, అభిషేక్ తలో వికెట్ తీశారు.
విజయం ఖరారైన క్షణంలో స్టేడియం మొత్తం బాణసంచా వెలుగులతో, ‘చక్ దే ఇండియా’ నినాదాలతో హోరెత్తిపోయింది. రోహిత్ శర్మ నుండి సారథ్య బాధ్యతలు స్నేహపూర్వకంగా అందుకున్న సూర్యకుమార్ యాదవ్, తన మొదటి మేజర్ టోర్నీలోనే జట్టును ఛాంపియన్గా నిలబెట్టి రికార్డు సృష్టించారు. “ఇది జట్టు సమిష్టి కృషి. ఆటగాళ్లకు ఇచ్చిన స్వేచ్ఛే ఈ రోజు మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టింది. ఈ కప్పు దేశ ప్రజలందరికీ అంకితం” అని గెలుపు అనంతరం భావోద్వేగంతో కెప్టెన్ సూర్య వ్యాఖ్యానించారు. ఈ విజయంతో భారత్ మూడోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకుని, పొట్టి ఫార్మాట్లో తమ ఆధిపత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది.
డిఫెండింగ్ ఛాంపియన్ టీమ్ఇండియా మూడోసారి ట్రోఫీని దక్కించుకొని చరిత్ర సృష్టించింది. మరే జట్టు కూడా మూడు టైటిళ్లను గెలుచుకోలేదు. ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ తర్వాత భారత్కు కప్ అందించిన సారథిగా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. ఆతిథ్య జట్టు స్వదేశంలో ట్రోఫీ గెలవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.



Total views : 33578