లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. సుమారు 13 గంటల పాటు జరిగిన సుదీర్ఘ చర్చ అనంతరం, తీవ్ర గందరగోళం మధ్య తాత్కాలిక స్పీకర్ జగదాంబికా పాల్ నిర్వహించిన మూజువాణి ఓటుతో ఈ తీర్మానాన్ని తిరస్కరించారు. స్పీకర్ ఓం బిర్లా పక్షపాతంతో, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి 118 మంది విపక్ష ఎంపీలు మద్దతు తెలిపారు. అయితే చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్షాల ఆరోపణలను తీవ్రంగా తిప్పికొట్టారు. స్పీకర్ స్థానం అత్యంత పవిత్రమైందని, ఆయన నిర్ణయాలను సుప్రీంకోర్టులో సైతం ప్రశ్నించలేమని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో, నేటి కాంగ్రెస్ మిత్రపక్షాలైన సమాజ్వాదీ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలే స్పీకర్లపై అవిశ్వాసం పెట్టాయని గుర్తుచేశారు. ఆ సమయంలో స్పీకర్లు చైర్లోనే కూర్చోగా, ఈసారి ఓం బిర్లా మాత్రం తీర్మానంపై నిర్ణయం వెలువడే వరకు చైర్లో కూర్చోకుండా కొత్త పార్లమెంటరీ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారని ప్రశంసించారు.
మరోవైపు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఫైర్ అయ్యారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు రాహుల్ తరచూ విదేశీ పర్యటనలకు వెళ్తారని, బడ్జెట్, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక చర్చల్లో పాల్గొనడానికి ఎందుకు ఇష్టపడరని ప్రశ్నించారు. సమావేశాలు వచ్చినప్పుడల్లా ఆయన విదేశీ పర్యటనలు ప్లాన్ చేసుకుంటారని.. మరి విదేశాల నుంచి ఇక్కడ మాట్లాడతారా? అంటూ అమిత్షా సెటైర్లు వేశారు.





Total views : 47794