దేశ రాజకీయాల్లో నేడు అత్యంత కీలక ఘట్టం చోటుచేసుకోబోతోంది. లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు కీలక బిల్లులపై నేడు ఓటింగ్ జరగనుంది. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులపై సభలో హోరాహోరీ చర్చ సాగుతోంది. అయితే రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో.. కేంద్రానికి అవసరమైన ఆ ‘మ్యాజిక్ ఫిగర్’ అందుతుందా? విపక్షాల మద్దతు లేకుండా ఈ బిల్లులు గట్టెక్కడం సాధ్యమేనా? అసలు లోక్సభలో బలాబలాలు ఎలా ఉన్నాయి? దీనిపై సీవీఆర్ న్యూస్ స్పెషల్ రిపోర్ట్..
ఢిల్లీ వేదికగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గురువారం కేంద్రం లోక్సభలో మూడు సంచలన బిల్లులను ప్రవేశపెట్టింది. డీలిమిటేషన్ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, రాజ్యాంగ సవరణ బిల్లు…. మహిళా కోటాపై పార్టీలన్నీ సానుకూలంగా ఉన్నా.. డీలిమిటేషన్ అంశంపై మాత్రం అధికార, ప్రతిపక్షాల మధ్య యుద్ధం నడుస్తోంది. నేడు లోక్సభలో ఈ బిల్లులపై ఓటింగ్ జరగనుండగా.. శనివారం రాజ్యసభ ముందుకు ఇవి వెళ్లనున్నాయి. అయితే ఇప్పుడు అందరి దృష్టి లోక్సభలోని ‘నెంబర్ గేమ్’ పైనే ఉంది.
ప్రస్తుతం లోక్ సభలో మొత్తం 540 ఉన్నారు. అయితే, ప్రస్తుత బిల్లుకు రాజ్యాంగ సవరణ జరగాలంటే… అందుకు కావాల్సిన 2/3 మెజార్టీ అంటే 360 మంది ఎంపీల మద్దతు అవసరం ఉంటుంది. సభలో NDA కూటమిలో… బీజేపీకి 240 మంది సభ్యులు ఉన్నారు. అలాగే, టీడీపీ 16 మంది…. జేడీయూ 12 మంది…. వీరందరితో కలిసి మొత్తం ఎంపీల సంఖ్య 293 ఉంటుంది. ఇక, విపక్షం INDIA కూటమి బలంగా ఇలా ఉంది…. కాంగ్రెస్ కు 98 మంది ఎంపీలు ఉన్నారు. సమాజ్వాదీ పార్టీ 37 మంది…. టీఎంసీ 28 మంది… డీఎంకే 22 మంది ఎంపీలు ఉన్నారు. ఇండియా కూటమి మొత్తం బలం 233 మంది సభ్యులు.. ఇక, ఇతరులు అంటే… వైసీపీ, ఎంఐఎం, స్వతంత్రులు సభలో 14 మంది ఎంపీలు ఉన్నారు.
రాజ్యాంగ సవరణ బిల్లు నెగ్గాలంటే సభలో ఉన్న సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది మద్దతు తప్పనిసరి. అంటే 540 మంది హాజరైతే 360 మంది ఓట్లు కావాలి. కానీ ఎన్డీయేకు ఉన్నది కేవలం 293 మంది మాత్రమే. అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే 67 మంది తక్కువ. విపక్షాల మద్దతు లేకుండా ఈ బిల్లు పాస్ అవ్వడం అసాధ్యం. ఒకవేళ ప్రతిపక్ష సభ్యులు గైర్హాజరైతే మ్యాజిక్ ఫిగర్ తగ్గే అవకాశం ఉంది. ఉదాహరణకు 20 మంది సభ్యులు సభకు రాకుంటే.. మెజార్టీ మార్కు 347కు తగ్గుతుంది. ఎస్పీ, టీఎంసీ, డీఎంకే వంటి పార్టీల్లో ఏవైనా రెండు పార్టీలు ఓటింగ్కు దూరంగా ఉంటేనే కేంద్రానికి ఊరట లభిస్తుంది.
మరోవైపు రాజ్యసభలో మాత్రం కేంద్రానికి పెద్దగా ఇబ్బందులు లేవు. అక్కడ 163 మంది మద్దతు అవసరం కాగా.. ఎన్డీయేకు 141 మంది బలం ఉంది. వైసీపీ, బీజేడీ, బీఆర్ఎస్ వంటి పార్టీల మద్దతుతో అక్కడ నెగ్గడం సులభమే. కానీ ముందు లోక్సభ గండం గడవాలి. బిల్లును నెగ్గించుకోవడానికి సరిపడా సంఖ్యా బలం లేదని సాక్షాత్తూ అధికార పార్టీ ఎంపీలే అంగీకరిస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక, కేంద్ర ప్రభుత్వం ఈ చదరంగంలో పైచేయి సాధిస్తుందా? లేక విపక్షాలు బిల్లును అడ్డుకుంటాయా? మరికొద్ది గంటల్లోనే పార్లమెంట్లో క్లారిటీ రానుంది.




Total views : 81440