ఏపీ రాజధానిపై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం-2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..ఆమోదముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమోదం అనంతరం కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారిక గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీంతో అమరావతి చట్టబద్ధంగా ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా మారింది.
అమరావతిని రాజధానిగా గుర్తించాలని మార్చి 28న ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానం మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఏప్రిల్ 1న లోక్సభ, ఏప్రిల్ 2న రాజ్యసభ ఈ బిల్లును ఆమోదించాయి. ఈ సవరణతో 2014 పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)లో మార్పులు చేసి “కొత్త రాజధాని ఉంటుంది” అనే పదం స్థానంలో “అమరావతి కొత్త రాజధానిగా ఉంటుంది” అని చేర్చారు. దీనిపై మంత్రి లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఇది చారిత్రాత్మక రోజు. రాష్ట్రపతి ఆమోదంతో రాజధాని కల అధికారికంగా సాకారమైంది. రాష్ట్ర భవిష్యత్తు కోసం మద్దతుగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీకి, బిల్లుకు మద్దతిచ్చిన ఎంపీలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి మార్గం సుగమం చేసిన అమరావతి రైతుల ఓర్పు, త్యాగాలకు ప్రత్యేక వందనాలని ఆయన ట్వీట్ చేశారు. ఈ నిర్ణయంతో రాజధాని మార్పుపై భవిష్యత్తులో ఎలాంటి సవరణ చేయాలన్నా అది పార్లమెంటు పరిధిలోనే ఉంటుంది.




Total views : 47741