సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ సచివాలయంలో ప్రారంభమైంది. రాష్ట్ర పాలనలో కీలకమైన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, మంత్రులు, జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సదస్సు ప్రారంభంలో ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు దక్కించుకున్నందుకు ముఖ్యమంత్రికి మంత్రులు, అధికారులు స్టాండింగ్ ఓవేషన్తో ఘనంగా అభినందనలు తెలిపారు. ఇది తన ఒక్కడి విజయం కాదని, గ్రామ స్థాయి అధికారి నుంచి మంత్రుల వరకు అందరి సమష్టి కృషి ఫలితమని సీఎం పేర్కొన్నారు.
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి మరింత ఊతమిచ్చే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఆటోమొబైల్, డేటా సెంటర్, పునరుత్పాదక విద్యుత్ రంగాల్లో భారీ పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి – ఎస్ఐపీబీ సమావేశంలో రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయని ప్రభుత్వం తెలిపింది.
తిరుపతిలో రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ బుల్లెట్ మోటార్సైకిళ్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్న నిర్ణయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తం రూ.2 లక్షల 964 కోట్ల 10 లక్షల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.మరోవైపు విశాఖపట్నంలో రిలయన్స్ సంస్థ 1 లక్షా 8 వేల 10 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుండగా.. ఇది ఐటీ,డిజిటల్ రంగాల అభివృద్ధికి ఊతమివ్వనుంది. అదేవిధంగా శ్రీ సత్యసాయి జిల్లాలో రిలయన్స్ ఆధ్వర్యంలో 51 వేల కోట్ల రూపాయలతో సోలార్ పవర్ ప్లాంట్తో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను ఏర్పాటు చేయనున్నారు.
నాడు బుల్లెట్ నడిపాను.. నేడు ఏపీకి రాయల్ ఎన్ఫీల్డ్ను తీసుకొచ్చాను” అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కాలేజీ రోజులను గుర్తుచేసుకున్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో భాగంగా ఏపీలో పెట్టుబడుల వెల్లువపై మాట్లాడిన ఆయన, రాయల్ ఎన్ఫీల్డ్ ప్లాంట్ రాకను ఒక చారిత్రక విజయంగా అభివర్ణించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు పండుగ వాతావరణం నెలకొందని.. ఒకప్పుడు తమిళనాడుకే పరిమితమైన రాయల్ ఎన్ఫీల్డ్, ఇప్పుడు మన సత్యవేడుకు వస్తుందని ఆయన సగర్వంగా ప్రకటించారు.






Total views : 143629