Tuesday, June 16, 2026
News Navigation
Tuesday, June 16, 2026
News Navigation

Breaking

Tuesday, June 16, 2026
Home Latest News రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..

రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..

by CVR NEWS
రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు

రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు.

ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి… ఇది సాధారణ గ్రామం కాదు. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి వనవాసం చేసిన పవిత్ర భూమిగా భక్తులు విశ్వసించే ఆధ్యాత్మిక క్షేత్రం. ఇక్కడ కొలువుదీరిన సీతా లక్ష్మణ సమేత శ్రీ రఘునాథ స్వామి ఆలయం ఎన్నో శతాబ్దాల చరిత్రను తనలో దాచుకుంది. సీతమ్మ దాహం తీర్చేందుకు శ్రీరాముడు బాణం సంధించి పాతాళ గంగను వెలికితీశాడని స్థానిక పురాణం చెబుతోంది. ఆలయం ఎదుట ఉన్న బావిలో ఇప్పటికీ ఆ బాణం గుర్తులు కనిపిస్తాయని భక్తులు నమ్ముతారు. అలాగే సీతమ్మ నార చీరలు ఆరవేసినట్లు చెప్పబడే దోనబండ, రాముడి పాదముద్రలు వంటి ఎన్నో పురాణ చిహ్నాలు ఈ క్షేత్రంలో మరింత ఆకర్షణగా నిలుస్తున్నాయి . కాకతీయుల కాలంలో నిర్మించబడిన ఈ ఆలయానికి రాజులు వేల ఎకరాల భూములను దానంగా ఇచ్చారు. కానీ నేడు అదే దేవాదాయ భూములు అక్రమాల అడ్డాగా మారాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భక్తి, చరిత్ర, రాజకీయాలు కలిసిపోయిన ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.

శ్రీ రఘునాథ స్వామి ఆలయానికి ఒకప్పుడు రాజులు దానంగా ఇచ్చిన 3,355 ఎకరాల భూములు ఇప్పుడు వివాదాలకు కేంద్రబిందువయ్యాయి. అందులో దాదాపు 2,800 ఎకరాల సాగుభూమి ప్రస్తుతం రైతుల ఆధీనంలో ఉంది. ఈ భూముల్లో కోకో, ఆయిల్ ఫామ్ వంటి వాణిజ్య పంటలు పండుతున్నాయి. బహిరంగ మార్కెట్లో ఒక్కో ఎకరం 60 నుంచి 70 లక్షల రూపాయల వరకు విలువ పలుకుతున్నా… ఆలయానికి మాత్రం సరైన ఆదాయం రావడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1990లో కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ భూములను సాగు చేస్తున్న రైతులు ఎకరాకు ఏడాదికి ఒక క్వింటా వేరుశనగ చొప్పున కౌలు చెల్లించాలి. కానీ ఆ తీర్పు అమలుకాక దశాబ్దాలు గడిచిపోయాయి. ప్రస్తుతం సుమారు 1,050 మంది రైతులు సాగు చేస్తున్న ఈ భూములపై చెల్లించాల్సిన కౌలు బకాయిలు 10 కోట్ల రూపాయలు దాటిపోయినట్లు తెలుస్తోంది. కోట్ల విలువైన దేవాదాయ ఆస్తులు ఉన్నప్పటికీ స్వామివారి ఆలయం మాత్రం ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది.

దేవుడి ఆస్తులపై జరుగుతున్న అక్రమాలపై ఇప్పుడు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు వ్యక్తులు కేవలం 100 రూపాయల స్టాంపు పేపర్లపై స్వామివారి భూములను విక్రయిస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొందరు రెవెన్యూ అధికారుల సహకారంతో నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు కూడా సృష్టించుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2015లో ప్రభుత్వం ఈ భూములన్నీ దేవాదాయ శాఖకే చెందినవని స్పష్టం చేస్తూ స్వామివారి పేరుతో పాసుపుస్తకాలు జారీ చేసింది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారలేదని భక్తులు అంటున్నారు. కోట్లాది రూపాయల విలువైన భూములు ఉన్నప్పటికీ ఆలయంలో జరిగే వార్షిక కళ్యాణం, రథోత్సవాలకు కూడా నిధుల కొరత వెంటాడుతుంది . కౌలు వసూలు చేయడానికి అధికారులు ప్రయత్నించినా రాజకీయ ఒత్తిళ్లు అడ్డంకిగా మారుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. నోటీసులు జారీ చేయడమే తప్ప భూముల రక్షణలో చర్యలు కనిపించడం లేదని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.

శ్రీ రఘునాథ స్వామి ఆలయ భూముల వ్యవహారం ఇప్పుడు కేవలం ఆస్తి వివాదం మాత్రమే కాదు… ప్రభుత్వ వ్యవస్థల పనితీరుపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది. దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే అక్రమాలు పెరిగిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అసలు ఎవరు సాగు చేస్తున్నారు? ఎవరి చేతుల్లోకి భూములు మారాయి? ఎంత భూమి అక్రమంగా విక్రయించబడింది? అనే అంశాలపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. దీంతో ప్రభుత్వం వెంటనే సమగ్ర సర్వే నిర్వహించాలని భక్తులు, హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పాతాళ గంగ, దోనబండ, రాముడి పాదముద్రలు వంటి పురాణ చిహ్నాలతో ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం ఇప్పుడు తన ఆస్తులను కాపాడుకునే పోరాటం చేస్తోంది. కోట్ల విలువైన భూములు స్వామివారికి తిరిగి దక్కాలంటే కఠిన చర్యలు తప్పనిసరి అని స్థానికులు అంటున్నారు. మరి ప్రభుత్వం స్పందించి దేవాదాయ భూములను రక్షిస్తుందా? లేక అక్రమాల వలయంలోనే ఈ పురాతన క్షేత్రం నలిగిపోతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Advertisements

You may also like

Our Visitor

023974
Total views : 143660

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.