దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంలో ఫ్యాక్టరీస్ అండ్ బాయిలర్స్ శాఖకు చెందిన అధికారుల పాత్ర, విధుల నిర్వహణలో జరిగిన లోపాలపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం సమర్పించిన సిఫార్సుల మేరకు ఈ చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విచారణకు బి. ఉమామహేశ్వరరావును విచారణాధికారిగా నియమించగా, జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ మోహన్రావును ప్రెజెంటింగ్ అధికారిగా నియమించింది. విచారణను నిష్పాక్షికంగా నిర్వహించి, సంబంధిత అధికారుల బాధ్యతలు, విధుల్లో నిర్లక్ష్యం, నిబంధనల అమలులో జరిగిన లోపాలు, పర్యవేక్షణలో వైఫల్యాలపై సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించింది. ఈ శాఖాపరమైన విచారణను మూడు నెలల్లో పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై తదుపరి శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసు నేపథ్యంలో ఇప్పటికే సిట్ విస్తృతంగా దర్యాప్తు నిర్వహించింది. ఆ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా సంబంధిత అధికారుల పాత్రపై కూడా విచారణ అవసరమని సిఫార్సు చేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తిరుమల ప్రసాదం నాణ్యత, భక్తుల విశ్వాసాన్ని పరిరక్షించే దిశగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ శాఖాపరమైన విచారణకు ప్రాధాన్యత ఏర్పడింది.
తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.
201
previous post