ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన వీడియో తొలగింపుపై ఎట్టకేలకు మెటా సంస్థ దిగొచ్చింది. ఈ మేరకు మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్.. ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పారు. CSAM, డీప్ఫేక్ కంటెంట్ వ్యాప్తిపై విచారం వ్యక్తం చేసిన మెటా.. కొన్ని రకాల కంటెంట్ను బూస్ట్ చేయడానికి భారీగా డబ్బులు తీసుకున్నట్టు ఒప్పుకుంది. అంతే కాకుండా తమ ఫ్లాట్ఫామ్ నిర్వహణలో జరిగిన పొరపాట్లను కూడా అంగీకరించింది.
ప్రధాని మోదీకి సంబంధించిన జులై 23 నాటి వీడియోను తొలగించడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని మెటాను పార్లమెంటరీ కమిటీ ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకోవడం సహా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మూడు రోజుల అల్టిమేటం జారీ చేసింది. ఈ మేరకు దిగొచ్చిన మెటా.. మోదీని క్షమాపణలు చెప్పింది.
ఆగస్టు 5న మెటా చీఫ్ గ్లోబల్ అఫైర్స్ ఆఫీసర్ జోయెల్ కప్లాన్ నేతృత్వంలోని గ్లోబల్ ప్రతినిధుల బృందం కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ (MeitY) అధికారులతో సమావేశమైంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో మెటా ప్లాట్ఫారమ్లలో హానికర కంటెంట్ నియంత్రణ, కంటెంట్ పంపిణీ విధానం, వినియోగదారుల భద్రత వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు తెలిసింది.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మెటాకు కీలక సూచనలు చేసింది. సోషల్ మీడియా మధ్యవర్తిగా మాత్రమే కాకుండా, ఏ కంటెంట్ను ఎవరికీ ఎలా చూపించాలనే విషయంలో కూడా మెటా చురుకుగా నిర్ణయాలు తీసుకుంటోందని అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. అలాంటి పరిస్థితుల్లో సమాచార సాంకేతిక చట్టం–2000 కింద మధ్యవర్తులకు లభించే సేఫ్ హార్బర్ రక్షణలు మెటాకు వర్తిస్తాయా అనే అంశంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని ప్రభుత్వ అధికారులు స్పష్టం చేసినట్లు వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై కూడా సంస్థ ప్రతినిధులు విచారం వ్యక్తం చేస్తూ, ప్లాట్ఫారమ్ నిర్వహణలో జరిగిన తప్పిదాలపై క్షమాపణలు తెలిపినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఇటీవలి కాలంలో మెటాపై పలు వివాదాలు తలెత్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వీడియో తాత్కాలికంగా తొలగించబడిన ఘటనపై ప్రభుత్వ వర్గాలు ప్రశ్నలు లేవనెత్తాయి. మరోవైపు, మెటా ప్లాట్ఫారమ్లలో బాలల లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన ప్రకటనలు ఉన్నాయనే మీడియా కథనాల నేపథ్యంలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కూడా విచారణ ప్రారంభించింది.
అయితే, ప్రభుత్వం చేసిన తాజా వ్యాఖ్యలు, సమావేశంలో జరిగిన చర్చలపై మెటా ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ పరిణామాలు భారతదేశంలో సోషల్ మీడియా సంస్థల బాధ్యతలు, వినియోగదారుల భద్రత, హానికర కంటెంట్ నియంత్రణపై మరింత చర్చకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రధాని మోదీకి క్షమాపణ చెప్పిన జుకర్బర్గ్.
2.2K
previous post