ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు నిర్మితమవుతున్న గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ఇప్పుడు ప్రారంభానికి సిద్ధమవుతోంది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ పనులు చివరి దశకు చేరుకోవడంతో ఆ ప్రాంత ప్రజల్లో ఆశలు మరింత పెరిగాయి. ఇప్పటికే ఖమ్మం జిల్లా వైరా నుంచి దేవరపల్లి వరకు రాకపోకలకు అనుమతులు ఇవ్వడం ద్వారా హైవే ఉపయోగంలోకి వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అధికారుల సమాచారం ప్రకారం, వచ్చే నెలలో ప్రధానమంత్రి వర్చువల్గా ఈ హైవేను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య తొలి ఫోర్ లేన్ యాక్సెస్ కంట్రోల్డ్ నేషనల్ హైవేగా ఈ రహదారి ప్రత్యేకతను సంతరించుకుంది. అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన ఈ హైవేపై ప్రతి రెండు కిలోమీటర్లకు ఒకసారి 360 డిగ్రీల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా భద్రతను మరింత బలోపేతం చేస్తున్నారు. రాత్రి వేళల్లో సోలార్ లైటింగ్ వ్యవస్థతో ప్రయాణికులకు సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ హైవే అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి రాజమండ్రి, వైజాగ్ వరకు దూరం గణనీయంగా తగ్గి, రవాణా వ్యవస్థలో కొత్త మార్పుకు నాంది పలకనుంది.
2022లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ పనులు ప్రస్తుతం చివరి దశకు చేరుకుని, వైరా నుంచి దేవరపల్లి వరకు వాహన రాకపోకలకు అనుమతులు ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి రాజమండ్రి, వైజాగ్ వెళ్లాలంటే విజయవాడ మీదుగా సుమారు 670 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వచ్చేది. దీని వల్ల 12 గంటల సమయం పట్టేది. కానీ ఇప్పుడు ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే అందుబాటులోకి రావడంతో దూరం 580 కిలోమీటర్లలోపే తగ్గి , ప్రయాణ సమయం కేవలం 8 గంటలకు తగ్గనుంది. ఖమ్మం నుంచి రాజమండ్రి చేరుకోవడానికి ప్రస్తుతం 4 గంటలు పట్టగా, కొత్త హైవేతో అది 2 గంటల్లోనే సాధ్యమవుతుంది. ఈ మార్పు ప్రయాణికులకు సమయంతో పాటు ఇంధన ఆదా కూడా అవుతుంది .
అత్యాధునిక సదుపాయాలతో రూపొందించిన ఈ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భద్రత, సౌకర్యాలకు ప్రాధాన్యతనిస్తూ నిర్మించబడింది. రహదారి పొడవునా సీసీ కెమెరాలు, స్పీడ్ గన్స్, సోలార్ లైటింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచారు. ప్రతి 20 కిలోమీటర్లకు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, ప్రతి 5 కిలోమీటర్లకు అత్యవసర మార్గాలు కల్పించారు. ప్రారంభంలో 15 రోజుల పాటు టోల్ ఫీజు లేకుండా వాహనదారులకు అనుమతి ఇవ్వనున్నారు. అనంతరం నిబంధనల ప్రకారం టోల్ వసూలు చేస్తారు. ఈ హైవే వల్ల తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ మధ్య రవాణా మరింత వేగవంతం అవుతుండగా, ఖమ్మం జిల్లా ఆర్థికాభివృద్ధికి కొత్త అవకాశాలు తెరుచుకుంటున్నాయి. భవిష్యత్తులో ఈ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించేలా ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేయడం విశేషం.





Total views : 81434