అమెరికా – ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న అత్యంత కీలకమైన చర్చల్లో తొలి రౌండ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ చారిత్రాత్మకమైన చర్చలకు పాకిస్థాన్లోని ఇస్లామాబాద్ వేదికగా మారింది. ఈ త్రైపాక్షిక చర్చలలో అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్, స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ పాల్గొనగా.. ఇరాన్ తరఫున విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి, పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగర్ ఘాలిబాఫ్ ప్రాతినిధ్యం వహించారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్యవర్తిత్వంలో జరిగిన ఈ హై-లెవల్ సమావేశం, రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న అపనమ్మకాన్ని తొలగించి శాంతి మార్గాన్ని సుగమం చేసే ప్రయత్నంగా కనిపిస్తోంది.
ఈ చర్చలు సానుకూల వాతావరణంలో జరిగినట్లు సమాచారం అందుతోంది. ఇరాన్ సమర్పించిన 10-పాయింట్ ప్రపోజల్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘వర్కబుల్ బేసిస్’ గా అభివర్ణించడం గమనార్హం. ప్రధానంగా హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచి ఉంచడం, లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ఆపడం, అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలను తొలగించడం, ఇప్పటి వరకు ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం వంటి అంశాలపై విస్తృతంగా జరిగిన చర్చలు సక్సెస్ అయ్యినట్టు సమాచారం.
అయితే లెబనాన్ వ్యవహారంపై ఇజ్రాయెల్ వైఖరి భిన్నంగా ఉండటం ఈ చర్చల్లో సవాలుగా మారింది. మరోవైపు ఇవాళ రెండో రౌండ్ చర్చలు కొనసాగే అవకాశం ఉందని ఇరాన్ స్టేట్ టీవీ వెల్లడించింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ఈ చర్చలు శాశ్వత పరిష్కారాన్ని చూపుతాయా? లేదా ఇది తాత్కాలిక విరామం మాత్రమేనా? అన్నది రాబోయే రోజుల్లో వెలువడనున్న నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.





Total views : 81437