కాళేశ్వరం ప్రాజెక్టు మళ్లీ రాజకీయ దుమారం రేపుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మళ్లీ చర్చకు తెరలేపింది. పోటా పోటీగా కాళేశ్వరం పర్యటనకు రెండు పార్టీలు సిద్ధం కావడంతో రాజకీయ ఉత్కంఠ రేపుతోంది. సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించేందుకు ఈ నెల 20న వెళ్తున్నారు. సీఎంతో పాటు మంత్రులు హాజరు కానుండడంతో పాటు భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. దీనికి రెండు రోజుల ముందే బీఆర్ఎస్ నేతలు పర్యటన ఉండడంతోపాటు అదే రోజు జగిత్యాలలో బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభలో కేసీఆర్ కూడా పాల్గొంటుండటంతో కాళేశ్వరం మళ్లీ రాజకీయ అస్త్రంగా మారింద. సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 20న భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. కాళేశ్వరానికి సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలిస్తారు. మేడిగడ్డ వద్ద అధికారులతో సమీక్షిస్తారు. అక్కడి నుంచి కాటారం మండలంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభ వేదికగా పలు కీలక అంశాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించనున్నారు. అదే రోజు రైతు భరోసా రెండో విడత నిధులను కూడా విడుదల చేయనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
కాళేశ్వరం బహిరంగ సభ ఏర్పాట్లను చూస్తున్నారు మంత్రి శ్రీధర్ బాబు. కాటారంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సీఎం బ్యారేజీలను పర్యవేక్షించి పలు పథకాలకు కూడా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనుండటంతో భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. బహిరంగ సభకు భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలతో పాటు ఉమ్మడి జిల్లాలకు చెందిన నేతలు కూడా హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జగిత్యాలలో అదేరోజు జరిగే బీఆర్ఎస్ సభకు కౌంటర్ గా పలు ఆరోపణలు చేసే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులకు సిద్ధమవుతున్న ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లను చేస్తుంది. సైటును పరిశీలించి అక్కడే సమీక్షించి పనులను వేగవంతం చేసే విధంగా సీఎం అధికారులను ఆదేశించనున్నారు.
మంథని మండలంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులపైన కూడా సీఎం మాట్లాడే అవకాశం ఉంది. కాళేశ్వరం వేదికగానే ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి పలు దఫాలు బ్యారేజీలను పరిశీలించారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ప్రకటించడంతో పాటు ప్రజల్లోకి తీసుకెళ్లి అధికారంలోకి వచ్చారు. జయంత్ ఘోష్ కమిషన్ ను నియమించి కాళేశ్వరం పై పూర్తి వివరాలు తీసుకొని చర్యలకు ఉపక్రమించారు. ఎన్నికల నినాదంగా మారి అధికారంలోకి తెచ్చిన కాంగ్రెస్ మరోదఫా ఆ ప్రాజెక్టు వేదికగానే ముందుకు పోతుంది. మంథని నియోజకవర్గంలో జరుగుతున్న ఈ సభను విజయవంతం చేసేందుకు మంత్రి శ్రీధర్ బాబు పూర్తిస్థాయిలో ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సభ విజయవంతం కోసం కృషి చేస్తున్నారు. అధికారులతో సమీక్షిస్తూనే పలు ఏర్పాట్లు చేస్తున్నారు.
జగిత్యాలలో ఈనెల 20న సభ నిర్వహిస్తున్న బీఆర్ఎస్ నేతలు సీఎం పర్యటనకు రెండు రోజుల ముందే కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వస్తున్నారు. బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ బ్యారేజీలను పరిశీలించనున్నారు. మోటారు పనుల పరిశీలనతో పాట పలు అంశాలపై దృష్టి పెట్టనున్నారు. సీఎం పర్యటనకు రెండు రోజుల ముందే పోటీగా పర్యటనకు వస్తుండటంతో ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు సమాయత్తం అవుతుండటంతో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. రెండు పార్టీల మధ్యన ఉద్రిక్తలు తలెత్తకుండా ఉండేందుకు ముందస్తుగానే ఏర్పాట్లను చేస్తున్నారు. పోలీసులు దృష్టి పెట్టి పనిచేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోటా పోటీగా వస్తుండటంతో రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టును తేవడంతోనే తెలంగాణ సస్యశ్యామలమైందని బీఆర్ఎస్ నేతలు ప్రకటిస్తుండగా భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.





Total views : 81444