అగ్రరాజ్యం పరువు కోసం పోరాడింది. శత్రువుల గుండెకాయ లాంటి ఇస్ఫహాన్ ప్రావిన్స్లో చిక్కుకున్న తన ఎయిర్మ్యాన్ను కాపాడుకునేందుకు పెంటగాన్ ఏకంగా 4,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. యుద్ధ విమానాలు కూలాయి.. డ్రోన్లు ధ్వంసమయ్యాయి.. కానీ ఆపరేషన్ మాత్రం సక్సెస్ అయింది. ఇందు కోసం అమెరికా హాలీవుడ్ సినిమాను తలపించేలా ఈ హై-వోల్టేజ్ రెస్క్యూ మిషన్ నిర్వహించింది. ఇరాన్లోని ఇస్ఫహాన్ ప్రావిన్స్.. శత్రు సైన్యం నిరంతరం నిఘా పెట్టే ప్రాంతం. అక్కడ అమెరికాకు చెందిన అధునాతన F-15E స్ట్రైక్ ఈగిల్ జెట్ నేలకూలింది. ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్, వెపన్ స్పెషలిస్ట్ ఎయిర్క్రాఫ్ట్ నుంచి దూకేశారు. పైలట్ను వెంటనే రక్షించినప్పటికీ.. ఆయుధ స్పెషలిస్ట్ మాత్రం ఇరాన్ భూభాగంలో చిక్కుకుపోయాడు. చేతిలో కేవలం ఒక పిస్టల్.. చుట్టూ ప్రాణాలను వెతికే శత్రు సైన్యం. అతడిని పట్టిస్తే 66 వేల డాలర్ల బహుమతి ఇస్తామని ఇరాన్ ప్రకటించడంతో పరిస్థితి ఉత్కంఠగా మారింది.
పర్వతాల్లో నక్కిన అమెరికన్ ఎయిర్మ్యాన్ను వెతకడానికి అమెరికా సర్వశక్తులూ ఒడ్డింది. నిఘా డ్రోన్ల సహాయంతో సిగ్నల్ను పసిగట్టిన వెంటనే రంగంలోకి దిగాయి MC-130J కమాండో-2 విమానాలు, బ్లాక్ హాక్ హెలికాప్టర్లు. ఇరాన్ సైన్యం అతడిని పట్టుకోకుండా అమెరికా దళాలు బాంబుల వర్షం కురిపించాయి. అయితే ఈ క్రమంలో అమెరికా భారీ మూల్యమే చెల్లించుకుంది. సాంకేతిక లోపాలతో పనిచేయకుండా పోయిన వందల కోట్ల విలువైన రెండు సీ-130 కార్గో విమానాలను, శత్రువుల చేతికి చిక్కకుండా అమెరికా దళాలే స్వయంగా ధ్వంసం చేశాయి.
కేవలం విమానాలే కాదు.. 7.5 మిలియన్ డాలర్ల విలువైన రెండు MH-6 లిటిల్ బర్డ్ హెలికాప్టర్లను కూడా వదులుకోవాల్సి వచ్చింది. అటు ఇరాన్ సైన్యం కూడా పట్టు వదలకుండా అమెరికాకు చెందిన MQ-9 రీపర్ డ్రోన్లను కూల్చివేసినట్లు ప్రకటించింది. దాదాపు 4,500 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినా.. తన సైనికుడి ప్రాణం ముఖ్యం అని భావించిన అమెరికా, చివరకు అతడిని క్షేమంగా సరిహద్దులు దాటించింది. ఆధునిక యుద్ధ చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన, అత్యంత సవాలుతో కూడిన రెస్క్యూ ఆపరేషన్గా నిలిచిపోయింది. ఒక్క సైనికుడి కోసం అగ్రరాజ్యం చేసిన ఈ ఆపరేషన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అటు ఆస్తి నష్టం జరిగినా, ఇటు టార్గెట్ను సక్సెస్ఫుల్గా పూర్తి చేసి ఇరాన్కు అమెరికా గట్టి హెచ్చరికే పంపింది.





Total views : 47727