ప్రపంచ దేశాలకు పెద్ద ఊరట. గల్ఫ్ రీజియన్లో యుద్ధ మేఘాలు తాత్కాలికంగా తొలగిపోయాయి. ఇరాన్పై దాడులను రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. ముఖ్యంగా ఆకాశాన్నంటుతున్న చమురు ధరలు కుప్పకూలుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ఖాయమని భావించిన తరుణంలో అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ట్రూత్ సోషల్ వేదికగా.. ఇరాన్పై సైనిక దాడులను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, దీనికి ప్రతిగా ఇరాన్ హర్మూజ్ జలసంధిని తక్షణమే తెరవాలని ఆయన షరతు విధించారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు, ఇప్పుడు ఒక్కసారిగా 100 డాలర్ల దిగువకు పడిపోయాయి. ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం వాటా ఉన్న హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ముడి చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్ వంటి దేశాలకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం. ధరలు తగ్గడం వల్ల దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది. అయితే, ఈ శాంతి కేవలం తాత్కాలికమేనని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రెండు వారాల దౌత్య చర్చలు సఫలమైతేనే పరిస్థితి చక్కబడుతుందని, లేదంటే మళ్ళీ యుద్ధ భయాలు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ట్రంప్ తీసుకున్న ఈ రెండు వారాల విరామం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్లా పనిచేస్తోంది. మరి ఇరాన్ ఈ షరతులకు తలొగ్గుతుందా లేదా అన్నది వేచి చూడాలి.
Tag:




Total views : 33559