ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి 14 రోజుల రిమాండ్ విధించారు ఏసీబీ న్యాయమూర్తి. ఈ నెల 21 వరకు ఆమెకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో ఆమెను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతిని ఏసీబీ అధికారులు నిన్న అరెస్టు చేశారు. తాడేపల్లి, ఉండవల్లి సహా 4 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించగా భారీగా అక్రమాస్తులు వెలుగు చూశాయి. ఆంతో ఆమెను అరెస్టు చేసి రాత్రి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి ఈ నెల 21 వరకు రిమాండ్ విధించారు. అనంతరం ఆమెను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.
శాంతికి సంబంధించి విజయవాడ, తాడేపల్లి సహా మొత్తం 3 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. విలువైన డాక్యుమెంట్స్, బ్యాంక్ లాకర్లు, నగదు, ఇతర ఆస్తులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. విశాఖ ఎండాడలో లగ్జరీ ఫ్లాట్, తాడేపల్లి కుంచనపల్లిలో జీ+2 భవనం, 770 గ్రాముల బంగారు నగలు, 3 కిలోల వెండి, అలాగే 1.15 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో 3 లక్షల రూపాయలను గుర్తించారు. అంతేకాకుండా వోక్స్వ్యాగన్ పోలో కారు, ఓ బైక్ను కూడా గుర్తించారు.
అక్రమాల ఆరోపణలతో 2024 జులై నుంచి 2026 మార్చి వరకు సస్పెన్షన్లో ఉన్న శాంతి, ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంది. ఐతే గత ప్రభుత్వం అండతో శాంతి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులకు అందిన ఫిర్యాదులతో సోదాలు నిర్వహించగా భారీ ఎత్తున అక్రమాస్తులు బయటపడ్డాయి. దీంతో ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.




Total views : 33614