సామాజిక న్యాయమే తన ఎజెండా అని జగనన్న మరోసారి నిరూపించుకున్నారని జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సిఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శుక్రవారం సాయంత్రం నరసన్నపేటలో టెక్కలి, ఇచ్చాపురం నియోజకవర్గ సమన్యయకర్తలు దువ్వాడ శ్రీనివాస్, పిరియా విజయ, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ లతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎల్లప్పుడూ నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అని అంకితభావంతో వారి సంక్షేమం కోసం తపిస్తున్నారని పేర్కొన్నారు. రాజ్యాధికారంలో కూడా వారందరికీ పెద్దపీట వేయాలనే సంకల్పంతోనే ముందుకెళ్తున్నారన్నారు. జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు, పార్లమెంటు నియోజకవర్గానికి సమన్వయకర్తలుగా బీసీలనే నియమించి బీసీల పట్ల తన ఔదార్యాన్ని చాటుకున్నారని తెలిపారు. మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఇదేవిధంగా సిఎం జగన్ సామాజిక సమతూకాన్ని పాటించనున్నారన్నారు. ఎల్లప్పుడూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలను ఉపయోగించుకుని అందలాలెక్కే చంద్రబాబునాయుడు తన అవసరం తీరాక వారిని తొక్కేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ వారందరికీ న్యాయం జరుగుతుందన్నారు. పార్టీ నిర్దేశాలకు అనుగుణంగా కలిసికట్టుగా పనిచేసి శతశాతం ఫలితాలు సాధిస్తామన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ నేటి వరకూ ప్రజలకోసం రూ 4 లక్షల కోట్లకు పైగా సంక్షేమ పథకాల కింద ప్రజలకు అందించామన్నారు. ప్రతి ఇంటా అభివృద్ధి జరిగిందన్నారు. సీఎం జగన్ చేసిన అభివృద్ధి ఏమిటో అంతా కళ్ళముందే అందరికీ కనిపిస్తోందని పేర్కొన్నారు. 175 అసెంబ్లీ స్థానాల్లో, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో కచ్చితంగా వైసీపీ విజయం సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
వైఎస్సార్సీపీ
ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైఎస్సార్సీపీ రెండవసారి నియోజకవర్గాల ఇన్చార్జిల పేర్లను ప్రకటించింది. ఇందులో ప్రధానంగా యువతకు ప్రాధాన్యత ఇస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గ అభ్యర్థిగా తుడా చైర్మన్ మోహిత్ రెడ్డిని ప్రకటించారు. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రస్తుత ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి ఇప్పటికే గడపగడపకు మన కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యారు. 2019 ఎన్నికల తర్వాత నుంచి కూడా ప్రజల మధ్యలోనే ఉండి ప్రజలకు కావలసిన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నామని, కరోనా సమయంలో అయితే ఒక అడుగు ముందుకు వేసి ప్రతి ఇంటిని ఆదుకున్నమని అన్నారు మోహిత్ రెడ్డి. ఈసారి చంద్రగిరి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని కచ్చితంగా వైసీపీ జెండా ఎగుర వేస్తామని చంద్రగిరి ఇంచార్జ్ మోహిత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.