ఆంధ్రప్రదేశ్, కర్నాటక ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో సీఎంలు చంద్రబాబు, సిద్దరామయ్య ఈ మేరకు తమ నిర్ణయాన్ని ప్రకటించారు. ఆస్ట్రేలియాలో 16ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించడంపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది..ఇదే స్ఫూర్తితో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నారులు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించాయి. 13-16 ఏళ్లలోపు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా నిషేధం విధించనున్నట్లు ఇద్దరు ముఖ్యమంత్రులు అసెంబ్లీలో వెల్లడించారు.టెక్నాలజీని వాడుకుంటే ఆయుధంగా పనిచేస్తుందని, బానిసైతే జీవితాలు నాశనమవుతాయని చంద్రబాబు హితవు చెప్పారు.
పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. 13 -16 ఏళ్ల లోపు వారికి సంబంధించి సోషల్మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని సూచన వచ్చిందన్న ఆయన. ఆ వయసు లోపు వారికి సోషల్ మీడియా అందుబాటులో లేకుండా చేసే కార్యక్రమానికి 90 రోజుల్లో శ్రీకారం చుడతామని హామీ ఇచ్చారు.13-16 ఏళ్లలోపు వారికి సంబంధించి ఏం చేయాలన్నదానిపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సోషల్మీడియా వల్ల మన పిల్లలు నష్టపోకూడదన్న చంద్రబాబు.. సోషల్ మీడియాను కట్టడి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. spot
మొబైల్ వాడకం వల్ల పిల్లల్లో తలెత్తుతున్న ప్రతికూల భావాలను నివారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో 16ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించడంపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించిందని ఆయన గుర్తుచేస్తూ.. భారత్లో ఈ దిశగా నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రంగా కర్ణాటక నిలిచిందన్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పటికే సోషల్ మీడియా వినియోగంపై స్పందించిందన్నారు. కాగా. పిల్లల్లో సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించాలనే అంశంపై కర్ణాటక ప్రభుత్వం గత కొంతకాలంగా చర్చలు జరుపుతోంది. సీఎం ఇటీవల ప్రభుత్వ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్లర్లతో జరిపిన చర్చల్లో ఈ అంశాన్ని లేవనెత్తారు. పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్కు సంబంధించి వారి నుంచి అభిప్రాయాలు కోరారు. ఈ క్రమంలోనే తాజాగా కర్నాటక సీఎం సిద్దరామయ్యా ప్రకటన చేశారు.