ప్రజల్లోకి వెళ్లేందుకు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి సభలు నిర్వహిస్తున్నామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్రెడ్డి. ఫిబ్రవరి 2వ తేదీన ఇంద్రవెళ్లిలో సభ ఉందని నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికలు ఇంకా 60 రోజులలో జరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు గాంధీభవన్లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిందని తెలంగాణలో కూడా రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని సూచించారు.