అసెంబ్లీలో స్పీకర్ అంటే నిస్పక్షపాతంగా వ్యవహరించారు. అధికార, విపక్షాలన్న భేదభావం లేకుండా అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి, అందరి హక్కులను కాపాడాలి. కానీ దురదృష్టవశాత్తూ.. కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. అయితే కర్ణాటక స్పీకర్ U.T.ఖాదర్ మాత్రం ఈ విషయంలో అందరికీ ఆదర్శంగా నిలిచారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రుల నుంచి, అధికారుల నుంచి సరైన సమాధానాలు రావడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు..
నిజానికి కొంతకాలంగా ఈ అంశంపై సీరియస్గా ఉన్న ఆయన… ఎప్పటికప్పుడు అధికారపక్షాన్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. సభ్యులు వందల సంఖ్యలో ప్రశ్నలు అడిగితే.. పదుల సంఖ్యలో కూడా సమాధానాలు రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం అధికారపక్షం బాధ్యత అని గుర్తు చేస్తూనే ఉన్నారు. అయినా పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. ఇదే సమయంలో హోం మంత్రి పరమేశ్వర మాత్రం ఏదో ఘనకార్యం చేసినట్లు… 230 ప్రశ్నలకు గానూ, ఎనభై నాలుగింటికి సమాధానం ఇచ్చాం అని ఘనంగా చెప్పుకున్నారు. దీనిపై విపక్ష నేత ఆర్. అశోక్ తీవ్ర స్థాయిలో సెటైర్లు వేశారు. దీంతో స్పీకర్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సభ నిర్వహించేది మంత్రుల కోసం కాదు… సభ్యుల కోసమే అని చెప్పారు. పదేపదే చెబుతున్నా మంత్రులు, అధికారులేం చేస్తున్నారని నిలదీశారు. అధికారులు, మంత్రులు సమావేశమై ఈ సమస్యను పరిష్కరించేంత వరకు సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ఖాదర్ పీఠం నుంచి లేచి వెళ్లిపోయారు. దీంతో ఖంగుతిన్న ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు స్పీకర్ ఛాంబర్కు వెళ్లి నచ్చ చెప్పారు. సీఎస్ను పిలిచి.. నిర్లక్ష్యం వహించిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీరియస్గా ఆదేశాలిచ్చారు…




Total views : 78940