విజయవాడ ఉగ్రలింకుల కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకొచ్చాయి. విచారణలో కీలక విషయాలు వెల్లడించారు నిందితులు. భారత్ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చడమే తమ లక్ష్యమని, అందుకోసం యుద్ధం ప్రారంభించామని వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆల్ ఖైదా, ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కొనసాగిస్తున్నామని, ఈ మార్గాన్ని తమకు ఆఫ్ఘనిస్థాన్కు చెందిన అల్ హకీం షుకూర్ చూపించాడని వారు పోలీసు కస్టడీలో సంచలన విషయాలు చెప్పినట్టు సమాచారం. అలాగే “భారత జాతీయ జెండా స్థానంలో ఐసిస్ జెండాను ఎగురవేయాలన్న నినాదాలతో యువతలో ఉగ్రవాద భావజాలాన్ని నింపేందుకు ప్రయత్నించినట్టు తెలిపారు. ఇస్లాంను విశ్వసించని వారిపై సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేశామని..జిహాద్ కోసం ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నవారిని గుర్తించే పనిని తమకు అప్పగించినట్టు వెల్లడించారు. దేశంలోని స్లీపర్ సెల్స్ను త్వరలో పరిచయం చేస్తామని చెప్పారని..అంతలోనే తాము అరెస్టైనట్టు తెలిపారు.
సోషల్ మీడియా ద్వారా యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించి, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్లకు పంపి మిలిటెంట్ శిక్షణ ఇప్పించాలని షుకూర్ కుట్ర పన్నినట్టు తెలిపారు. ఇందుకోసం ‘బెన్ ఎక్స్ డాట్ కామ్’ పేరుతో సోషల్ గ్రూపును ఏర్పాటు చేసి, దేశంలోని పలు రాష్ట్రాల యువతకు గాలం వేశారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా ఉంచిన ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు గత నెలలో విజయవాడకు చెందిన మహమ్మద్ డానిష్, మహమ్మద్ రహంతుల్లా షరీఫ్, మీర్జా సోహైల్ బేగ్లను అరెస్టు చేయడంతో ఈ నెట్వర్క్ గుట్టురట్టయింది. వీరిచ్చిన సమాచారంతో 11 మందిని అరెస్టు చేశారు. తాజాగా ఏపీ సీఐడీ అధికారులు ఏడుగురిని కస్టడీలోకి తీసుకుని విచారించారు. కస్టడీ ముగియడంతో వారిని కోర్టులో హాజరుపరిచి, రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ విచారణలో మరో నాలుగు రాష్ట్రాల్లో ఈ నెట్వర్క్ లింకులు ఉన్నట్లు, కీలకంగా వ్యవహరిస్తున్న 42 మంది వివరాలను అధికారులు గుర్తించారు. వీరిలో కొందరికి 25 నుంచి 40 వరకు వేర్వేరు పేర్లతో సోషల్ మీడియా ఖాతాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా, NIA రంగంలోకి దిగింది. ఇప్పటికే ఏపీ పోలీసులకు సహకారం అందిస్తున్న NIA.. త్వరలోనే ఈ కేసును పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని దర్యాప్తు చేయనున్నట్లు సమాచారం.





Total views : 74832