మన్యం జిల్లాలో గిరిజనుల జీవన పరిస్థితులు ఇంకా మారలేదు. జియ్యమ్మవలస మండలం పరిధిలోని చాపరాయిగూడ, బాపన్నగూడ, దీసరిగూడ గ్రామాల ప్రజలు ఇప్పటికీ మౌలిక సదుపాయాల కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల వారు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆసుపత్రికి చేరుకోవడం పెద్ద సవాలుగా మారింది. డోలీ మోతలతోనే రోగులను రెండు కిలోమీటర్ల దూరం మోసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. అత్యవసర పరిస్థితుల్లో సమయానికి వైద్యం అందక ప్రాణాలు సైతం ప్రమాదంలో పడుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరాలు మారుతున్నా తమ తలరాతలు మారడం లేదని గిరిజనులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
ఈ గ్రామాల్లో గర్భిణీలు, బాలింతలు పడుతున్న ఇబ్బందులు మరింత విషమంగా ఉన్నాయి. ప్రసవ సమయం దగ్గరపడితే ఆసుపత్రికి తీసుకెళ్లడం కుటుంబ సభ్యులకు పెద్ద పరీక్షగా మారుతోంది. రహదారి లేకపోవడంతో డోలీ మోతలే ఏకైక మార్గంగా మారాయి. పసిపిల్లలను అంగన్వాడి కేంద్రాలకు తీసుకెళ్లాలన్నా రెండు కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి ఉంది. పిటి మండ గ్రామం చేరుకునే వరకు చిన్నారులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఉన్నా, అవి అందుబాటులోకి రాకపోవడం వల్ల గిరిజనుల జీవితం ఇంతకంతకూ కష్టాల్లోకి జారిపోతోంది. మౌలిక వసతులు లేకపోవడం వారి రోజువారీ జీవితాన్ని మరింత క్లిష్టంగా మార్చుతోంది.
ప్రభుత్వాలు మారుతున్నా గిరిజన గ్రామాల పరిస్థితుల్లో మార్పు కనిపించడంలేదు. రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల తాగునీటి సమస్య కూడా తీవ్రంగా మారింది. బోర్ వేయాలన్నా యంత్రాలు గ్రామానికి చేరుకోలేని పరిస్థితి నెలకొంది. అభివృద్ధి పేరుతో ఇచ్చే హామీలు మాటలకే పరిమితమవుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రహదారి ఇంకా కలగానే మిగిలిపోయింది. కనీస సదుపాయాలు కూడా అందని ఈ మూడు గ్రామాల ప్రజలు ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికైనా తమ కష్టాలు తీర్చాలని గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు.





Total views : 74851