పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్కు చేరుకుంది. అగ్రనేతలంతా బెంగాల్ గడ్డపైనే మోహరించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. కేంద్ర హోంమంత్రి, అమిత్ షా సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈసారి ఎలాగైనా బెంగాల్ గడ్డపై కాషాయ జెండాను ఎగురవేయాలనే లక్ష్యంతో మహిళా ఓటర్లపై గురి పెట్టింది బీజేపీ. వారిని ఆకట్టుకునేందుకు పలు సంక్షేమ పథకాలను ప్రకటించింది. బెంగాల్లో బీజేపీని గెలిపిస్తే .. మహిళలకు ప్రతినెలా 3వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఆరు నెలల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తామని ప్రకటించింది.
వచ్చే ఐదేళ్లలో కోటి కొత్త ఉద్యోగాలను సృష్టిస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొంది. నిరుద్యోగ యువతకు , మహిళలకు నెలకు 3 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించింది. మహిళల భద్రత కోసం ప్రత్యేక పోలీస్ బెటాలియన్లను ఏర్పాటు చేయడంతో పాటు .. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. గోవుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని .. చొరబాటుదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని మేనిఫెస్టోలో స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం సిఫార్సులను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.





Total views : 81434