నేపాల్ రాజకీయాల్లో కొత్త పార్టీ ప్రభంజనం సృష్టించింది. నేపాల్ ఎన్నికలు ఆ దేశ రాజకీయాలను సమూలంగా మార్చేశాయి. కేవలం మూడున్నరేళ్ల క్రితం ఆవిర్భవించిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆర్ఎస్పీ పార్లమెంట్ ఎన్నికల్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. దశాబ్దాలుగా తమను శాసిస్తున్న హేమాహేమీలను కాదని.. నవతరం వైపు మొగ్గు చూపారు నేపాలీలు. పాత పార్టీలను తుడిచిపెట్టిన బాలెన్ షా పార్టీ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్ విధానంలో 165 స్థానాలకు గాను 163 స్థానాల ఓట్ల లెక్కింపు పూర్తి కాగా, ఆర్ఎస్పీ ఏకంగా 125 సీట్లలో విజయభేరి మోగించింది. మొత్తం 275 స్థానాలు కలిగిన నేపాల్ ప్రతినిధుల సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో బాలెన్ నేతృత్వంలోని ఆర్ఎస్పీ అధికారం చేపట్టనుంది.
ఈ ఎన్నికల సునామీలో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ సహా ఎందరో రాజకీయ హేమాహేమీలు ఓటమి పాలయ్యారు. ఆర్ఎస్పీ ప్రధాని అభ్యర్థి, ఖాట్మండు మాజీ మేయర్ బాలెన్ షా.. ఓలీకి కంచుకోటగా భావించే ఝాపా-5 నియోజకవర్గంలో ఆయనపై ఘనవిజయం సాధించారు. నేపాల్ పార్లమెంటరీ చరిత్రలోనే ఏ అభ్యర్థికి రానన్ని అత్యధికంగా 68,348 ఓట్లను బాలెన్ షా దక్కించుకున్నది. మరోవైపు, నేపాలీ కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా భావించిన గగన్ థాపా కూడా ఆర్ఎస్పీ అభ్యర్థి చేతిలో ఓటమి చెందారు.ఎఫ్పీటీపీ విధానంలోనే కాకుండా, దామాషా ప్రాతినిధ్య పద్ధతిలోనూ ఆర్ఎస్పీ 48 శాతానికి పైగా ఓట్లతో ఆధిక్యంలో ఉంది. ఈ ట్రెండ్ కొనసాగితే, 275 మంది సభ్యులున్న ప్రతినిధుల సభలో ఆర్ఎస్పీ దాదాపు మూడింట రెండొంతుల మెజారిటీతో దాదాపు 184 సీట్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 1991 తర్వాత ఏ ఒక్క పార్టీ కూడా ఇంతటి భారీ మెజారిటీని సాధించలేదు.ఈ చారిత్రక తీర్పుతో నేపాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది.