తృణమూల్ కాంగ్రెస్పై మోదీ తీవ్ర విమర్శలు చేశారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే, గత 15 ఏళ్ల టీఎంసీ పాలనలో జరిగిన అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. బీజేపీ వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని టీఎంసీ భయాందోళనలు సృష్టిస్తోందని, ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా నిలిపివేయబోమని స్పష్టం చేశారు. కేవలం తృణమూల్ నేతల అవినీతి, దోపిడీ దుకాణాలను మాత్రమే మూసివేస్తామని అన్నారు.తాము అధికారంలోకి వస్తే, కొత్త ముఖ్యమంత్రి నేతృత్వంలోని తొలి కేబినెట్ సమావేశంలోనే రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు తీర్మానం చేస్తామని మోదీ ప్రకటించారు. ఇన్నాళ్లూ ఈ పథకాన్ని అమలు చేయకుండా తృణమూల్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసిందని, బీజేపీ ప్రభుత్వంతో ఆ రోజులు ముగిసిపోతాయని తెలిపారు.అంతేగాక కొత్త ప్రభుత్వం చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, వారికి నకిలీ గుర్తింపు పత్రాలు సృష్టించి ఇక్కడ స్థిరపడటానికి సహాయం చేసిన వారిని కూడా వదిలిపెట్టబోమని మోదీ హెచ్చరించారు.
పశ్చిమ బెంగాల్లో తన ప్రచార సభలకు వస్తున్న జనాన్ని, వారి ఉత్సాహాన్ని తన సొంత రాష్ట్రమైన గుజరాత్లో కూడా ఎన్నడూ చూడలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తూర్పు బర్ధమాన్ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంత భారీ సభను గుజరాత్లో కూడా ఏర్పాటు చేయలేకపోయేవారమని, మే 4 తర్వాత రాష్ట్రంలో మార్పులు రాబోతున్నాయనడానికి ఈ సభలే నిదర్శనమని అన్నారు.
National
మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. హింగోలి జిల్లాను కేంద్రంగా చేసుకుని వచ్చిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. ఉదయం సుమారు 8:45 గంటల సమయంలో భూమి కంపించడంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు మొదలయ్యాయని అధికారులు తెలిపారు. హింగోలితో పాటు పొరుగున ఉన్న నాందేడ్, పర్భానీ, వాషిమ్, ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో కూడా భూకంప ప్రకంపనలు స్పష్టంగా కనిపించాయి. నాందేడ్ నగరంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని, ఇళ్లలోని సామాన్లు కిందపడ్డాయని స్థానికులు తెలిపారు. అ ఈ భూకంపం వల్ల ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదని అధికారులు ధ్రువీకరించారు. గత ఏడాది జూలైలో కూడా ఇదే ప్రాంతంలో 4.5 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పాత భవనాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం సూచించింది.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్కు చేరుకుంది. అగ్రనేతలంతా బెంగాల్ గడ్డపైనే మోహరించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. కేంద్ర హోంమంత్రి, అమిత్ షా సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈసారి ఎలాగైనా బెంగాల్ గడ్డపై కాషాయ జెండాను ఎగురవేయాలనే లక్ష్యంతో మహిళా ఓటర్లపై గురి పెట్టింది బీజేపీ. వారిని ఆకట్టుకునేందుకు పలు సంక్షేమ పథకాలను ప్రకటించింది. బెంగాల్లో బీజేపీని గెలిపిస్తే .. మహిళలకు ప్రతినెలా 3వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఆరు నెలల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తామని ప్రకటించింది.
వచ్చే ఐదేళ్లలో కోటి కొత్త ఉద్యోగాలను సృష్టిస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొంది. నిరుద్యోగ యువతకు , మహిళలకు నెలకు 3 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించింది. మహిళల భద్రత కోసం ప్రత్యేక పోలీస్ బెటాలియన్లను ఏర్పాటు చేయడంతో పాటు .. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. గోవుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని .. చొరబాటుదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని మేనిఫెస్టోలో స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం సిఫార్సులను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
దేశంలో పెరుగుతున్న డిజిటల్ చెల్లింపుల మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రతిపాదనలు చేసింది..
దేశంలో పెరుగుతున్న డిజిటల్ చెల్లింపుల మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రతిపాదనలు చేసింది. రూ.10,000కు పైబడిన ఆన్లైన్ లావాదేవీలను ఒక గంట పాటు హోల్డ్ లో ఉంచే విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ మేరకు ఒక చర్చా పత్రాన్ని విడుదల చేసి, ప్రజల నుంచి అభిప్రాయాలను కోరింది. ఈ ప్రతిపాదన ప్రకారం, ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు రూ.10,000 కంటే ఎక్కువ మొత్తంలో డబ్బు పంపితే, ఆ లావాదేవీ వెంటనే పూర్తికాదు. బదులుగా, పంపిన వారి వద్ద గంట పాటు నిలిచిపోతుంది. ఈ సమయంలో, డబ్బు పంపిన వ్యక్తికి తన లావాదేవీని రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. లావాదేవీ అనుమానాస్పదంగా అనిపిస్తే, బ్యాంకు మరోసారి నిర్ధారణ కోరుతుంది. వ్యాపార చెల్లింపులు, ఈ-మాండేట్లు, నాచ్ లావాదేవీలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు.
2025 నాటికి దేశంలో డిజిటల్ మోసాల విలువ రూ.22,930 కోట్లకు చేరడంతో ఆర్బీఐ ఈ చర్యలకు ఉపక్రమించింది. మొత్తం మోసాల విలువలో సుమారు 98.5 శాతం.. రూ.10,000కు పైబడిన లావాదేవీల ద్వారానే జరుగుతున్నాయని ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసింది. సోషల్ ఇంజినీరింగ్ ద్వారా బాధితులపై ఒత్తిడి తెచ్చి మోసగాళ్లు డబ్బు బదిలీ చేయిస్తున్నారని, ఈ గంట సమయం ఆలస్యం వల్ల బాధితులకు ఆలోచించుకునే అవకాశం దొరుకుతుందని ఆర్బీఐ పేర్కొంది. ఇదే చర్చా పత్రంలో ఆర్బీఐ మరికొన్ని ప్రతిపాదనలను కూడా చేర్చింది. 70 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు రూ.50,000కు మించి చేసే లావాదేవీలకు వారు నామినేట్ చేసిన ‘విశ్వసనీయ వ్యక్తి’ ఆమోదం తప్పనిసరి చేయాలని సూచించింది. ఖాతాల్లోకి వచ్చే పెద్ద మొత్తాల జమలపై సమీక్ష, అలాగే అన్ని డిజిటల్ చెల్లింపులను ఒకేసారి నిలిపివేసే ‘కిల్ స్విచ్’ వంటివి ఇతర ప్రతిపాదనల్లో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలపై మే 8వ తేదీలోగా అభిప్రాయాలు తెలియజేయాలని వాటాదారులను ఆర్బీఐ కోరింది. వచ్చిన స్పందనల ఆధారంగా మార్గదర్శకాలను జారీ చేయనుంది.
పశ్చిమ బెంగాల్ పై హామీల వర్షాన్నికురిపించారు ప్రధాని మోదీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా హల్దియాలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బెంగాల్కు ఆరు గ్యారెంటీలను ప్రకటించారు మోదీ. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న భయాందోళన వాతావరణాన్ని తొలగించి, చట్టబద్ధమైన పాలనపై ప్రజలకు మళ్లీ నమ్మకం కలిగిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక, రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం, అధికారులు ప్రజలకు పూర్తి స్థాయిలో జవాబుదారీగా ఉంటారని గ్యారంటీ ఇచ్చారు. మమత హయాంలో జరిగిన ప్రతి కుంభకోణం, అవినీతి, మహిళలపై జరిగిన అకృత్యాలకు సంబంధించిన ఫైళ్లను మళ్లీ తెరిచి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. అవినీతికి పాల్పడిన వారు ఎవరైనా సరే చట్టం నుండి తప్పించుకోలేరని, వారిని జైలుకు పంపుతామని మోదీ గ్యారంటీ ఇచ్చారు. ఇక రాజ్యాంగం కల్పించిన హక్కులను శరణార్థులందరికీ అందజేస్తామని, అదే సమయంలో దేశంలోకి అక్రమంగా వచ్చిన చొరబాటుదారులను ఏరివేస్తామని స్పష్టం చేశారు. అలాగే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 7వ వేతన సంఘం సిఫార్సులను అమలు చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త వింత చోటుచేసుకుంది. ఓటు వేయడానికి వెళ్తున్న ఓటర్లకు ఓ అందమైన భామ చేతులు జోడించి స్వాగతం పలుకుతోంది. అయితే ఆమె మనిషి కాదు.. ఒక హ్యూమనాయిడ్ రోబో.. సంప్రదాయ చీరకట్టులో మెరిసిపోతున్న ఈ నీల రోబో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రజాస్వామ్య పండుగలో ఓటర్లను భాగస్వాములను చేసేందుకు ఎన్నికల సంఘం ఈ ప్రయోగాన్ని చేపట్టింది. హ్యూమనాయిడ్ రోబో పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓటు వేయడానికి వస్తున్న వారికి చేతులు జోడించి నమస్కరిస్తూ.. వారందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
కేవలం నమస్కరించడమే కాదు.. ఓటు వేయడానికి వచ్చినందుకు ధన్యవాదాలు.. మీ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోండి అంటూ స్ఫూర్తిదాయక సందేశాలు ఇస్తోంది నీల. ఈ వినూత్న స్వాగతాన్ని చూసి ఓటర్లు ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా యువ ఓటర్లు ఈ రోబోతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్నారు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. సాధారణంగా పోలింగ్ కేంద్రం అంటే సీరియస్ వాతావరణం ఉంటుంది. కానీ, ఈసారి ఓటర్లలో ఉత్సాహం నింపేందుకు, ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఉదయం నుంచే భారీగా తరలివస్తున్న ఓటర్లు.. నీల రోబో ఇస్తున్న సందేశాలతో ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. టెక్నాలజీని ప్రజాస్వామ్యంతో ముడిపెట్టిన ఈ తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. సినీ నటుడు విజయ్ పార్టీ టీవీకేకు తొలి షాక్ తగిలింది. పోటీ చేయకుండానే ఒక స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఆ పార్టీ అభ్యర్థి దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురి కావడమే దీనికి కారణం. ఎడప్పాడి శాసనసభ స్థానానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్కు ప్రపోజర్ల సంతకాలు సరిపోలేదు. దీంతో ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఈ నియోజకవర్గం నుంచి విజయ్ పార్టీ తరపున బరిలోకి దిగిన అరుణ్ కుమార్ నామినేషన్ను అధికారులు పరిశీలించారు. అయితే, నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న ప్రపోజర్ల వివరాలు ధ్రువీకరించలేకపోవడంతో రిటర్నింగ్ అధికారి ఆ దరఖాస్తును తిరస్కరించారు. ప్రధాన అభ్యర్థితో పాటు ఆ పార్టీ వేసిన ప్రత్యామ్నాయ అభ్యర్థి నామినేషన్ కూడా ఇదే కారణంతో తిరస్కరణకు గురి కావడం గమనార్హం. మాజీ సీఎం, ఏఐఏడీఎంకే కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి వరుసగా ఆరోసారి విజయం సాధించేందుకు సిద్ధమయ్యారు. అధికార పార్టీ డీఎంకే నుంచి సి కాశీ బరిలోకి దిగారు. వీరిద్దరి నామినేషన్లు ఆమోదం పొందాయి. ఈ నెల 23న తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి.
దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు పెరిగినా ఆ భారం రైతులపై పడకుండా కేంద్రమే భరించేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్ సీజన్ లో పీ అండ్ కే ఎరువుల రాయితీకి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్రవేసింది. ఇవాళ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో సెంట్రల్ కెబినెట్ సమావేశం జరింగింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించిన మంత్రిమండలి నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి అశ్వనీకుమార్ వైష్ణవ్ మీడియాకు వెల్లడిస్తూ పీ అండ్ కే ఎరువులకు రూ. 41,543 కోట్ల రాయితీకి కేబినెట్ ఆమోద ముద్రవేసిందని పేర్కొన్నారు. అలాగే రూ. 13 వేల కోట్లతోయజపుర మెట్రో ప్రాజెక్టు రెండో దశకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించారు.
భారతదేశ ఇంధన రంగంలో మరో కీలక మైలురాయిగా నిలవనున్న రాజస్థాన్ రిఫైనరీ ప్రాజెక్టుపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వివరాలు వెల్లడించారు. హెచ్పీసీఎల్ రాజస్థాన్ రిఫైనరీ లిమిటెడ్ ప్రాజెక్టుకు సంబంధించిన ఈక్విటీ భాగస్వామ్యం మరియు ప్రాజెక్టు వ్యయ సవరణలపై స్పష్టతనిచ్చారు.ఈ రిఫైనరీలో వాణిజ్య కార్యకలాపాలు జూలై 2026 నుండి కార్యాకలాపాలు ప్రారంభించబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటికే భారత్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రిఫైనర్గా అవతరించిందని మన ప్రస్తుత రిఫైనింగ్ సామర్థ్యం ఏడాదికి 258 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా అదనంగా మరో 9 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం పేరుగుతుందని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి భారత పార్లమెంటులో చరిత్ర సృష్టించారు. భారతదేశపు తొలి బహిరంగ క్వీర్ స్వలింగ సంపర్క పార్లమెంటు సభ్యురాలిగా నిలిచారు. తాజాగా టీఎంసీ తరఫున రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆమె LGBTQ సమాజానికి ప్రాతినిధ్యాన్ని పెంచే ముఖ్యమైన ఘట్టంగా ఇది చరిత్రలో నిలిచింది. దీంతో మేనకా గురుస్వామిపై ఇప్పుడు దేశవ్యాప్త చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరీ మేనకా గురుస్వామి ? స్వలింగ సంపర్కురాలిగా -క్వీర్ బహిరంగంగా ప్రకటించుకున్న 51 ఏళ్ల సుప్రీంకోర్టు లాయర్ మేనకా గురుస్వామిని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తాజాగా రాజ్యసభకు ఎంపిక చేసింది. దీంతో ఆమె నిన్న రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఇదో ప్రగతిశీల నిర్ణయంగా ప్రశంసలు అందుకుంటోంది. ఎంపీగా ప్రమాణం తర్వాత తాను సమానత్వం, సౌభ్రాతృత్వం, వివక్షారహిత సమాజం కోసం నిలబడతానని గురుస్వామి సగర్వంగా ప్రకటించారు.
1974లో హైదరాబాద్లో జన్మించిన మేనకా గురుస్వామికి అద్భుతమైన విద్యా నేపథ్యం, సుప్రసిద్ధ న్యాయవాద వృత్తి నేపథ్యం ఉంది. మేనక తండ్రి మోహన్ గురుస్వామి ఆర్థిక మంత్రిత్వ శాఖకు మాజీ సలహాదారు. తల్లి మీరా గురుస్వామి, ఒక ప్రకటనల నిపుణురాలు. 1997లో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా నుండి మేనక బ్యాచిలర్ ఆఫ్ లాస్ డిగ్రీని పొందారు. 1998లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళే ముందు, అప్పటి భారత అటార్నీ జనరల్ అశోక్ దేశాయ్తో కొంతకాలం పనిచేశారు. 2000లో ఆక్స్ఫర్డ్ నుండి బ్యాచిలర్ ఆఫ్ సివిల్ లా, 2001లో హార్వర్డ్ లా స్కూల్ నుండి మాస్టర్ ఆఫ్ లాస్ డిగ్రీలను సాధించారు. భారత్, పాకిస్తాన్, నేపాల్లలో రాజ్యాంగానికి సంబంధించిన అంశాలపై సిద్ధాంతవ్యాసానికి 2015లో ఆక్స్ఫర్డ్ నుండి డి.ఫిల్ పట్టా పొందారు.
2018లో సెక్షన్ 377ను రద్దు చేయడానికి దారితీసిన కేసులో సుప్రీంకోర్టులో వాదించిన న్యాయవాదులలో మేనకా గురుస్వామి కూడా ఒకరు. సెక్షన్ 377ను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని ఉద్వేగభరితంగా వాదించినప్పుడు గురుస్వామి, స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే వలసవాద చట్టం పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందని బలంగా వాదించారు. గురుస్వామి వాదించిన ఇతర కేసులలో విద్యా హక్కు చట్టం కేసు ఒకటి. ప్రైవేట్ అన్-ఎయిడెడ్ పాఠశాలలు బలహీన వర్గాల పిల్లలకు తమ సీట్లలో 25 శాతం కేటాయించి ఉచిత విద్యను అందించాలని కోరే నిబంధన రాజ్యాంగబద్ధతను ఆమె వాదించారు. సుప్రీంకోర్టులో నందిని సుందర్ వర్సెస్ ఛత్తీస్గఢ్ రాష్ట్ర కేసులో గురుస్వామి కీలక వాదనలు వినిపించారు. మావోయిస్టులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం మద్దతు ఇచ్చిన ప్రైవేట్ మిలీషియా అయిన సల్వా జుడుమ్కు వ్యతిరేకంగా ఆమె వాదించారు. 2012లో మణిపూర్లో సాయుధ బలగాలచే 1,528 మంది ప్రజల అదనపు న్యాయ హత్యలకు సంబంధించిన కేసులో గురుస్వామిని సుప్రీంకోర్టు కోర్టు సలహాదారుగా నియమించింది. ఈ సంఘటనలపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆమె కోర్టుకు సలహా ఇచ్చారు.
పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు. కఠోర శ్రమ తోడైతే రికార్డులు మీ వెంటే వస్తాయి..
పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు. కఠోర శ్రమ తోడైతే రికార్డులు మీ వెంటే వస్తాయి. దీనిని అక్షరాలా నిజం చేసి చూపించింది మధ్యప్రదేశ్కు చెందిన నందిని అగర్వాల్. కేవలం 19 ఏళ్ల 8 నెలల 18 రోజుల వయసులోనే కఠినమైన సీఏ పరీక్షను క్లియర్ చేసి, ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన చార్టర్డ్ అకౌంటెంట్గా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. మధ్యప్రదేశ్లోని మొరేనా వంటి చిన్న పట్టణం నుంచి వచ్చిన నందిని, చదువులో మొదటి నుంచి టాపర్. 13 ఏళ్లకే 10వ తరగతి, 15 ఏళ్లకే ఇంటర్ పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక 2021లో జరిగిన సీఏ ఫైనల్స్లో దాదాపు 83 వేల మందితో పోటీ పడి, 800 మార్కులకు గానూ 614 మార్కులు సాధించి ఆలిండియా ఫస్ట్ ర్యాంకును కైవసం చేసుకుంది.
నందిని సాధించిన ఈ విజయంలో ఆమె కుటుంబం పాత్ర మరువలేనిది. నందిని టాపర్గా నిలిచిన అదే ఏడాది, ఆమె అన్నయ్య సచిన్ కూడా సీఏ ఫైనల్స్లో 18వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. ఒకే ఇంట్లో ఇద్దరు తోబుట్టువులు దేశస్థాయి ర్యాంకులతో సీఏలు కావడంతో ఆ కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. నందినిలో ఈ కసి ఈనాటిది కాదు. 11వ తరగతి చదువుతున్నప్పుడు తన స్కూల్కు వచ్చిన ఒక గిన్నిస్ రికార్డు గ్రహీతను చూసి స్ఫూర్తి పొందింది. ఎలాగైనా తాను కూడా ఒక అరుదైన రికార్డు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అప్పటి నుంచి నిద్రలేని రాత్రులు గడిపి, మొండి పట్టుదలతో చదివి అనుకున్నది సాధించింది.
ప్రస్తుతం నందిని కేవలం సీఏ మాత్రమే కాదు.. ప్రముఖ సంస్థ పీడబ్ల్యూసీలో అనుభవం గడించి, సోషల్ మీడియాలో ఇన్ ఫ్లుయెన్సర్గా కూడా రాణిస్తోంది. ఆరు లక్షల మంది ఫాలోవర్లతో ఆర్థిక అంశాలపై అవగాహన కల్పిస్తోంది. ఖర్చు చేసే ముందే ఇన్వెస్ట్ చేయాలంటూ యువతకు ఫైనాన్షియల్ పాఠాలు చెబుతోంది. ఒక సాధారణ మధ్యాహ్నం వచ్చిన ఈమెయిల్ తన జీవితాన్ని మలుపు తిప్పిందని నందిని ఆనందంగా చెబుతోంది. వయసు అనేది కేవలం అంకె మాత్రమేనని, ఆశయం గొప్పదైతే ఏదీ అడ్డంకి కాదని నిరూపించిన నందిని అగర్వాల్.. నేటి యువతకు నిజమైన రోల్ మోడల్గా నిలిచింది.




Total views : 38444