పోలవరం ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల పరిస్థితులను తెలుసుకునేందుకు సీడబ్ల్యూసీ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు.పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలంలో పోలవరం ముంపుకు గురయ్యే ప్రాంతాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తెలంగాణలో పోలవరం ప్రాజెక్టు కారణంగా ప్రభావితమవుతున్న గ్రామాలు, ముంపు పరిస్థితులపై సమగ్ర సమాచారం సేకరించారు.ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశమైన సీడబ్ల్యూసీ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్యులు ముంపు ప్రాంతాల వివరాలు, పునరావాస చర్యలు, రక్షణ పనులపై ఆరా తీశారు.ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్లో తీసుకోవాల్సిన చర్యలపై కూడా అధికారులు చర్చించినట్లు తెలుస్తోంది.
Latest News
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్ లో గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్.. డీకేతో ప్రమాణం చేయించారు. డీకేతో పాటు జీ.పరమేశ్వర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. సీఎంతో పాటు మొత్తం 13 మంది మంతృలుగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి భారత రాజ్యాంగంతో వచ్చిన డీకే శివకుమార్.. రాజ్యాంగ ప్రతిని చేతపట్టి.. పూజ్య గురువు గంగాధర్ ఆజ్య పేరున ప్రమాణం చేశారు. దీంతో కర్ణాటకకు 34వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. డిప్యూటీ సీఎంగా పరమేశ్వర ప్రమాణం చేశారు. అదే విధంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి కేహెచ్ మునియప్ప కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు తదితర ముఖ్య నేతలు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని సన్మానించారు డీకే శివకుమార్. అదే విధంగా మాజీ సీఎం సిద్ధరామయ్యను కూడా కండువాతో సన్మానించారు. అంతకు ముందు ఆధ్యాత్మిక మత గురువుల కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు
సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారంతో.. గత కొంత కాలంగా కర్ణాటక రాజకీయాల్లో కొనసాగుతున్న అనిశ్చిత్తి తొలగినట్లయింది. గత రెండేళ్లుగా సీఎం పదవి కోసం ప్రయత్నిస్తున్న డీకేను ఇన్నాళ్లుగా ఓదార్చుతూ వస్తున్న కాంగ్రెస్ అధిష్టానం.. ఎట్టకేలకు సిద్ధరామయ్యను తప్పుకోవాల్సిందిగా.. జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానించింది. అధిష్టానం ఆదేశాలతో సిద్ధరామయ్య తన సీఎం పదవికి రాజీనామా చేయడంతో డీకేకు మార్గం సుగమం అయ్యింది.
విజయ్ ఆంటోని చిత్రాలకు తెలుగులో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ డిఫరెంట్ కంటెంట్, భిన్న ప్రాజెక్టులతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూనే ఉంటారు. ‘బిచ్చగాడు’తో హీరోగా విజయ్ ఆంటోని, దర్శకుడిగా శశికి వచ్చిన ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. మళ్లీ ఇన్నేళ్ల గ్యాప్ తరువాత విజయ్ ఆంటోని హీరోగా, శశి దర్శకత్వంలో ‘వంద దేవుళ్ళు’ అనే చిత్రం రాబోతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు ఆడియెన్స్లో బజ్ను పెంచేశాయి. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ను ప్రకటించారు.
విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో.. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద రామంజనేయులు జవ్వాజి నిర్మించిన ఈ మూవీని జూన్ 19న విడుదల చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు.
రిలీజ్ డేట్ ప్రకటిస్తూ వదిలిన పోస్టర్ ఎంతో ఇంప్రెస్సివ్గా ఉంది. ఈ పోస్టర్లో హీరో, హీరోయిన్ కనిపిస్తున్న తీరు, సైకిల్ మీద సింపుల్గా వెళ్తున్న తీరు చూస్తుంటే ఇదొక పీరియాడిక్ డ్రామా అని అర్థం అవుతోంది.
ఫ్యామిలీ, ఎమోషన్స్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్తో ‘వంద దేవుళ్ళు’ సినిమాని రూపొందించారు. ఈ సినిమాకి ఎస్. బి. దర్శన్ కిర్లోష్ కెమెరామెన్గా, బాలాజీ శ్రీరామ్ సంగీత దర్శకుడిగా పని చేశారు. హరిష్ యువరాజ్ ఎడిటర్గా, భాష్య శ్రీ డైలాగ్ రైటర్గా వర్క్ చేశారు. ఇక ఈ మూవీని జూన్ 19న గ్రాండ్గా రిలీజ్ చేయబోతోన్నారు.
రష్యా పర్యటనలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పీడ్ పెంచారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మాస్కోలో ఆయన కీలక భేటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రష్యాకు చెందిన ప్రముఖ ‘స్బేర్ బ్యాంక్’ వైస్ ప్రెసిడెంట్ అల్బర్ట్ యెఫిమోవ్తో మంత్రి లోకేష్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో సాంకేతిక, ఆర్థిక రంగాల విస్తరణపై కీలక చర్చలు జరిపారు.స్బేర్ బ్యాంక్కు చెందిన ‘గిగావాట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్’ సేవలను భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విస్తరించాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. అలాగే సైబర్ నేరాల నియంత్రణకు గానూ ‘యాంటీ-ఫ్రాడ్ నెట్వర్క్’ కోసం సాంకేతిక సహకారం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు ఏపీలోని ఫార్మా, అగ్రి ఎక్స్పోర్టర్లకు వ్యవస్థీకృత రుణాలు అందించేలా చొరవ చూపాలని లోకేష్ కోరారు. ఏపీని టెక్నాలజీ హబ్గా మార్చేందుకు రష్యా బ్యాంకింగ్ దిగ్గజం సహకారం అందించాలని ఆయన ఆకాంక్షించారు.
తెలంగాణ సామాజిక నేపథ్యంలో నీటి సమస్యలు, కుల వివక్ష, అణగారిన వర్గాల జీవిత పోరాటాలను ప్రతిబింబించే కథాంశంతో తెరకెక్కుతున్న ‘సర్కారు బాయి’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య ముఖ్య అతిథులుగా పాల్గొని పోస్టర్ను ఆవిష్కరించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీరామ్ నిమ్మల, వర్షిక జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి లారా దర్శకత్వం వహిస్తుండగా, తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో 80 దశకంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ – “నీటి సమస్య అనేది కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాదు. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి కీలకమైన అంశాన్ని కథాంశంగా తీసుకుని సినిమా రూపొందించడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఈ సినిమాలో నటించిన హీరోయిన్కు మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్ముతున్నాను. చిత్ర యూనిట్కు నా హృదయపూర్వక అభినందనలు” అని అన్నారు.
తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ, “సర్కారు బాయి” కథాంశం చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతం ప్రేక్షకులు కంటెంట్కు ప్రాధాన్యత ఇస్తున్నారు. మంచి కథతో వచ్చే సినిమాలను ఆదరిస్తున్నారు. ఇలాంటి సబ్జెక్టులతో సినిమాలు నిర్మించే నిర్మాతలు ఉండటం పరిశ్రమకు గొప్ప విషయం. నా అభిమాన క్రికెటర్ లారా లాగానే దర్శకుడు లారా కూడా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.
హీరో శ్రీరామ్ నిమ్మల మాట్లాడుతూ, “తెలంగాణ సాయుధ పోరాటం, సామాజిక అంశాలతో కూడిన కథలంటే నాకు ఎంతో ఇష్టం. అలాంటి కథలో నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు లారా గారికి కృతజ్ఞతలు. నిర్మాత ప్రఫుల్ రాంరెడ్డి మాకు కుటుంబ పెద్దలాంటివారు. ఈ చిత్రంలో భాగస్వామి కావడం గర్వంగా ఉంది” అని అన్నారు.
హీరోయిన్ వర్షిక మాట్లాడుతూ, “నేను తెలుగమ్మాయిని. ఇలాంటి మంచి కథలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ కథ విన్న వెంటనే ఇది జాతీయ అవార్డు స్థాయి సినిమా అవుతుందనే నమ్మకం కలిగింది. ప్రేక్షకులందరూ ఈ చిత్రానికి మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
దర్శకుడు లారా మాట్లాడుతూ, “చరిత్రలో మరుగున పడిపోయిన ఓ భావోద్వేగ కథను ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ‘సర్కారు బాయి’ వద్ద అణగారిన వర్గాలకు నీళ్లు ఇవ్వకుండా జరిగిన అన్యాయాలు, వారు ఎదుర్కొన్న కష్టాలు, కన్నీటి గాథ ఈ చిత్రానికి మూలకథ. 1985లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలు, కుల వివక్ష, సామాజిక అసమానతలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. తెలంగాణలో జరిగిన ఓ హృదయ విదారక సంఘటనను తెరపై ఆవిష్కరిస్తున్నాం. ప్రేక్షకుల ఆదరణ కోరుకుంటున్నాం” అని తెలిపారు.
నిర్మాత తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి మాట్లాడుతూ, “నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. సమాజానికి సందేశాన్ని అందించే ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను తాకుతుందని నమ్ముతున్నాను. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తాం. ప్రముఖ నటీనటులతో ఎక్కడ రాజీ పడకుండా ఈ సినిమా నిర్మిస్తున్నాం. అవార్డులు సాధించే స్థాయి చిత్రంగా నిలుస్తుంది. అలాగే ఈ చిత్రంలో ప్రేక్షకులు కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలు ఉన్నాయి. మా చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
నటుడు చిట్టిబాబు మాట్లాడుతూ, “ఈ సినిమాలో నాకు మంచి పాత్ర దక్కింది. ‘సర్కారు బాయి’ అనే టైటిల్నే చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్. సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
నటుడు మోహన్ బైరాగి మాట్లాడుతూ, “ఉద్యమాల నుంచి వచ్చిన ఆలోచనలతో ఈ సినిమా రూపొందుతోంది. సామాజిక బాధ్యతతో తెరకెక్కుతున్న ఈ చిత్రం చరిత్రలో నిలిచిపోతుంది” అని పేర్కొన్నారు.
కో-ప్రొడ్యూసర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, “ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. పెద్ద విజయాన్ని అందుకుంటుందనే పూర్తి నమ్మకం ఉంది” అన్నారు.
ప్రజల సమస్యలను ప్రతిబింబించే కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో విశేష ఆదరణ పొందుతుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది.
నీటి హక్కు, సామాజిక సమానత్వం, కుల వివక్ష వ్యతిరేక పోరాటం వంటి అంశాలను హృద్యంగా ఆవిష్కరించనున్న ‘సర్కారు బాయి’ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
కోల్కతాలోని సురేంద్రనాథ్ కాలేజీ స్టూడెంట్ యూనియన్ రూమ్లో భారీగా నోట్ల కట్టలు లభ్యమవ్వడం తీవ్ర కలకలం రేపింది. వర్షాకాలం ముందస్తు సన్నాహాల్లో భాగంగా కాలేజీలో చేపట్టిన శుభ్రతా కార్యక్రమంలో ఈ నోట్ల కట్టల గుట్టు రట్టయింది. యూనియన్ గదిలోని ఒక పాత అల్మారాను తెరిచి చూడగా, అందులో రెండు సూట్కేసులు కనిపించాయి. ఆ సూట్కేసులను తెరిచిన సిబ్బంది, వాటిలో గుట్టలుగా ఉన్న 100, 500 కరెన్సీ నోట్లను చూసి షాక్కు గురయ్యారు.ఈ నోట్ల కట్టలు చాలా కాలంగా అక్కడ నిల్వ ఉండటం వల్ల వీటికి భారీగా చెదలు పట్టాయి. దాదాపు ఒక లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు విలువ చేసే నోట్లు పాడైపోయినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు.ఆయుధాలు, మద్యం సీసాలు: నోట్ల కట్టలతో పాటు అదే గదిలో ఒక రివాల్వర్, ఖాళీ మద్యం సీసాలు కూడా లభ్యమవ్వడం సంచలనంగా మారింది.
అనకాపల్లి జిల్లాలోని ప్రముఖ ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ ఘటన కలకలం రేపింది.నక్కపల్లి మండలం ఉపమాక వెంకన్న ఆలయంలో అర్ధరాత్రి సమయంలో రెండు హుండీలు అపహరించబడ్డాయని తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు ప్రారంభించారు.సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలిస్తున్న పోలీసులు, ఆలయ సిబ్బందిని కూడా విచారిస్తున్నారు. క్లూస్ టీమ్ కూడా రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తోంది.హుండీల్లో ఉన్న నగదు ఎంత అన్నది ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. అయితే సుమారు 30 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు నగదు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. బంగారం, వెండి కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.ఆరు సంవత్సరాలుగా హుండీ ఆదాయం తరలించకపోవడం కూడా గమనార్హంగా మారింది. ఆలయ భద్రతలో లోపమే ఈ చోరీకి కారణమని భక్తులు ఆరోపిస్తున్నారు.
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణ భూమి పుత్రుల జాగీరేనని, ఈ నేల కోసం పోరాడిన ప్రజల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం అని స్పష్టం చేశారు.తెలంగాణ ఉద్యమం వేలాది మంది త్యాగాలు, పోరాటాల ఫలితంగా సాధించుకున్న రాష్ట్రం అని పేర్కొన్న కేటీఆర్.. ప్రాంతీయవాదాన్ని ఉగ్రవాదంతో పోల్చడం సరైన వ్యాఖ్య కాదన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు చేసిన ఉద్యమం కూడా ప్రాంతీయ భావనలో భాగమే కాదా అని ప్రశ్నించారు.ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ నాయకుడైనా దేశంలో ఎక్కడైనా పోటీ చేసే హక్కు రాజ్యాంగం కల్పించిందని, జనసేనను తెలంగాణలో ఎవరూ అడ్డుకోవడం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. 2018, 2023 ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేసిందని గుర్తు చేశారు.పవన్ కళ్యాణ్ను ఉప ముఖ్యమంత్రిగా, నటుడిగా గౌరవిస్తామని, కానీ తెలంగాణ ప్రజల మనోభావాలు, ఉద్యమ చరిత్ర, త్యాగాలను గౌరవిస్తూ మాట్లాడాలని సూచించారు.
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 21 మంది సజీవ దహనమయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 35 మందిని కాపాడారు. మాలవీయనగర్లోని లెమన్ గ్రీన్ రెస్టారెంట్లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు షార్ట్ సర్క్యూటే కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స కోసం రూ.50 వేలు అందజేస్తామన్నారు.
భారత్కు అమెరికా ఊహించని షాక్ ఇచ్చింది. అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ కార్యాలయం విడుదల చేసిన తాజా నివేదికలో భారత్ను దోషుల జాబితాలో చేర్చింది. ట్రేడ్ యాక్ట్-1974లోని సెక్షన్-301 కింద నిర్వహించిన దర్యాప్తుల్లో భారత్ సహా 54 దేశాలు బలవంతపు శ్రమతో తయారయ్యే వస్తువుల దిగుమతులను అరికట్టడంలో తగిన చర్యలు తీసుకోవడం లేదని యూఎస్టిఆర్ పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే పలు ఉత్పత్తులపై 10 నుంచి 12.5 శాతం వరకు అదనపు సుంకాలు విధించాలని ప్రతిపాదించింది. ఇప్పటికే పరిమిత ఆంక్షలు అమలు చేస్తున్న దేశాలకు 10 శాతం టారిఫ్ ఉండగా.. భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్ వంటి దేశాలకు గరిష్టంగా 12.5 శాతం సుంకం విధించే అవకాశం ఉందని తెలిపింది.
టెక్స్టైల్స్, వస్త్ర ఉత్పత్తుల విషయంలో మాత్రం ప్రత్యేక కోటా విధానంతో కొంత ఉపశమనం కల్పించేందుకు అమెరికా సిద్ధమైంది. అయితే ఈ ప్రతిపాదిత సుంకాలు అమలైతే భారత ఉత్పత్తుల ధరలు అమెరికా మార్కెట్లో పెరిగే అవకాశం ఉంది. దీంతో ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. న్యూఢిల్లీలో భారత్-అమెరికా ఉన్నతాధికారులు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై కీలక చర్చలు జరుపుతున్న సమయంలోనే ఈ ప్రకటన వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతిపాదిత టారిఫ్లపై జులై తొలి వారం వరకు ప్రజాభిప్రాయ సేకరణ, సమీక్షలు నిర్వహించి.. అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నారు.



Total views : 92044