నాడు బడులను గాలికొదిలేస్తే..తాము భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నామంటూ గత పాలకుల నిర్లక్ష్యంపై నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి. ఓవైపు ఫ్యూచర్ సిటీ గడపలో ప్రపంచ దిగ్గజం అమెజాన్ ను కూర్చోబెడుతూ.. మరోవైపు పాలమూరు రైతన్నల సాగునీటి కష్టాలకు చెక్ పెట్టేలా రేవంత్ స్పీడ్ పెంచారు. అక్కడ ఫ్యూచర్ సిటీ.. ఇక్కడ ప్రగతి బాట.. 2034 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల తెలంగాణే తమ టార్గెట్ అంటూ సరికొత్త మైలురాళ్లను సెట్ చేశారు సీఎం.
ఫ్యూచర్ సిటీని ప్రపంచంలోనే అత్యాధునిక నగరంగా తీర్చిదిద్దాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ కొత్త డేటా సెంటర్కు సీఎం శంకుస్థాపన చేశారు. అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటు ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని, దీనివల్ల మరిన్ని పెట్టుబడులు, అంతర్జాతీయ పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చే అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. గతేడాది నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్కు 108 దేశాల నుంచి పరిశ్రమలు పాల్గొన్నాయని గుర్తు చేశారు. 2034 నాటికి తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమన్నారు. ఈ లక్ష్య సాధనకు భారీ పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు అవసరమని, అందుకే తెలంగాణ రైజింగ్ విధానాన్ని తీసుకొచ్చామని రేవంత్ తెలిపారు.
మరోవైపు గత ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు సీఎం సీఎం రేవంత్రెడ్డి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు చేరలేదని.. ఎక్కువ మంది ప్రైవేటుకు వెళ్లారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేకంగా దృష్టి సారించామని రేవంత్ చెప్పారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో బాలికల హైస్కూల్ భవనాల ప్రారంభం సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. విద్య ప్రాధాన్యతను గుర్తించే తాను విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్నానని తెలిపారు. రాజకీయ నాయకుల వల్ల కాకుండా విద్యార్థుల వల్లే తెలంగాణకు చట్టబద్ధత వచ్చిందని గుర్తుచేశారు. వారి త్యాగాలకు ప్రతిరూపంగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేయడమే తన ఆకాంక్ష అని సీఎం తెలిపారు.
ఇక మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో అమర్ రాజా గిగా సెల్ కారిడార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ప్రారంభించారు సీఎం రేవంత్. పాలమూరు రైతులకు త్వరలోనే శుభవార్త చెబుతామని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 90టీఎంసీల నీటి కేటాయింపు కోసం ప్రయత్నిస్తున్నామని..డిండి ప్రాజెక్టులో 30 టీఎంసీల కేటాయింపు కోసం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. దేశానికి తెలంగాణ నుంచి 5 శాతం జీడీపీ వెళ్తుందని.. 10 శాతం జీడీపీ అందించేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు.




Total views : 211859