అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దుప్పితూరు గ్రామం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. గ్రామ తరలింపు అంశంపై తీవ్ర విభేదాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు గ్రామస్తులు 2004లో భూసేకరణ సమయంలో తమ గ్రామాన్ని ఉద్దేశపూర్వకంగా వదిలేశారని ఆరోపిస్తూ, ఇప్పుడు 750 కుటుంబాలకు స్థలం కేటాయించి సరైన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో తమకు అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు అధికారులు మాత్రం అప్పటికే చెల్లింపులు పూర్తయ్యాయని, ప్రస్తుతం బ్రాండిక్స్ యాజమాన్యం తమ హక్కుల మేరకు గోడ నిర్మాణం చేపడుతోందని స్పష్టం చేస్తున్నారు. ఈ గోడ నిర్మాణాన్ని గ్రామస్తులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో అసలు నిజం ఏంటి? గ్రామస్తుల డిమాండ్లకు న్యాయం జరుగుతుందా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.దుప్పితూరు గ్రామ వివాదంపై ప్రజా ప్రతినిధులు కూడా స్పందిస్తున్నారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఈ సమస్యపై మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పరిష్కారం కనుగొనాలని సూచించారు
గ్రామస్తులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే స్థానికంగా పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. ఒకవైపు గోడ నిర్మాణ పనులు కొనసాగుతుండగా, మరోవైపు గ్రామస్తులు నిరసనలు తెలుపుతున్నారు. తమకు సరైన పునరావాసం, నష్టపరిహారం అందే వరకు వెనక్కి తగ్గేది లేదని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. ఈ వివాదం మరింత పెరగకుండా ఉండాలంటే అధికారులు, ప్రజా ప్రతినిధులు తక్షణమే జోక్యం చేసుకుని స్పష్టమైన పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది. దుప్పితూరు సమస్యకు ఎప్పుడు ముగింపు పడుతుందో అనేది ఉత్కంఠగా మారింది





Total views : 81456