తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో బీఆర్ఎస్ పార్టీ వైఖరితోపాటు… కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న నీట్ పేపర్ లీకేజీ అంశంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు మౌనం వహించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. నీట్ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంటే, బీఆర్ఎస్ మాత్రం ఆయనపై ఎందుకు నోరు మెదపడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ పాలనలో తీవ్ర వివాదాస్పదమైన గ్లోబరినా సంస్థ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ… వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తలకిందులు చేసిన ఆ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ నాయకులు చేపడుతున్న ధర్నాలపై స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతల ధర్నాకు బహుశా ప్రధాని నరేంద్ర మోదీ అనుమతి ఇచ్చారేమో, అందుకే రేపు బీఆర్ఎస్ నేతలు ఆందోళన బాట పట్టారు అని సెటైర్లు వేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని, తమ ప్రభుత్వంలో శాంతియుత ధర్నాలు, ఆందోళనలు చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం, సమస్యలు లేవని స్పష్టం చేశారు. ఇందిరా పార్క్ వద్ద మూతపడిన ధర్నా చౌక్ను తమ ప్రభుత్వమే పునరుద్ధరించిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.