శంషాబాద్ మండలం బహదూర్గూడలో ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం భూసేకరణ అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. తమ భూములు కోల్పోతామనే ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులను పరామర్శించారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ . రైతులతో మాట్లాడిన ఆయన వారి సమస్యలను తెలుసుకున్నారు . భూసేకరణలో రైతుల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల హక్కులను పరిరక్షించేలా న్యాయమైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రైతులు తమ ఆందోళనలు, భూసేకరణపై ఉన్న సందేహాలను ఈటల రాజేందర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం రైతులతో చర్చించి పారదర్శకంగా ముందుకు సాగాలని, రైతుల ప్రయోజనాలు కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
Telangana
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మూఢనమ్మకాలపై అవగాహనా ర్యాలీ నిర్వహించారు అధికారులు. వరుస మరణాలతో తమ కాలనీవాసులకు కీడు సోకిందనే నమ్మకంతో కీడు వంటలకు వెళ్లారు. ఇలా చేస్తే తమకు కీడుపోయి మరణాలు తగ్గుతాయని భావించారు. దీనిపై తమకందిన సమాచారంతో ఆరోగ్యశాఖాధికారులు మూఢనమ్మకాలపై అవగాహన కల్పించారు. కాలనీవాసులకు రక్తపరీక్షలు నిర్వహించి మూఢనమ్మకాలను నమ్మొద్దని..ఏదైనా అనారోగ్య సమస్యలుంటే వైద్యులను సంప్రదించాలని కోరారు. స్థానిక ప్రజలకు మెగా హెల్త్ క్యాంపు నిర్వహించి ప్రజల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అవసరమైన వైద్య సూచనలు చేశారు. ప్రజల ఎటువంటి అపోహలు, మూఢనమ్మకాలను నమ్మవద్దని కోరారు.
జనగామ జిల్లా కలెక్టరేట్లో భారీ ఆర్థిక అక్రమాలు వెలుగుచూశాయి. కలెక్టరేట్ ఖాతా నుండి 37 లక్షల 85 వేల రూపాయల ప్రజాధనం పక్కదారి పట్టినట్లు అంతర్గత తనిఖీల్లో నిర్ధారణ కావడంతో అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఈ నేరానికి పాల్పడిన ముగ్గురు కలెక్టరేట్ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ, వారిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. ట్రెజరీ వెలుపల ఉన్న ఒక ప్రైవేటు బ్యాంకులోని కలెక్టరేట్ ఖాతా నుండి ఈ అక్రమాలు జరిగాయి. ఆఫీస్ ఫర్నిచర్, కంప్యూటర్లు కొనుగోలు చేసినట్లు నకిలీ బిల్లులు సృష్టించి, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒకే రోజున 37.85 లక్షల సొమ్మును దారి మళ్లించారు. అయితే, ఉన్నతాధికారులు భౌతికంగా తనిఖీ చేయగా కలెక్టరేట్లో ఒక్క కొత్త వస్తువు కూడా లభించకపోవడంతో అసలు రంగు బయటపడింది. ఈ వ్యవహారంపై జనగామ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు ఈ ఆర్థిక నేరంపై లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. ఇదే తరహాలో దిక్సూచి పుస్తకాల ముద్రణ పేరిట కూడా మరో 46 లక్షల 50 వేల దుర్వినియోగమైనట్లు జిల్లా యంత్రాంగం ఇప్పటికే గుర్తించింది. కలెక్టరేట్ నిధుల నుండి మొత్తంగా కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు అనుమానాలు వ్యక్తమవుతుండటంతో, అధికారులు పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు. దుర్వినియోగమైన ప్రజాధనంలో ప్రతి పైసాను బాధ్యుల నుండి తిరిగి రాబడతామని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది.
తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కేకే కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని తెలంగాణ ఉద్యమ విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది. ఓయూ ఆర్ట్స్ కళాశాల వేదికగా విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశంలో ప్రముఖ ఉద్యమ నాయకులు డాక్టర్ వేల్పుల కుమార్ సహా పలువురు జేఏసీ నాయకులు పాల్గొన్నారు. కేకే కమిటీకి ప్రభుత్వం ఇచ్చిన మూడు నెలల గడువు ముగుస్తున్న తరుణంలో, నివేదికను కాలపరిమితి లోపు వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కమిటీని ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తమకు గౌరవం, ప్రేమ ఉన్నప్పటికీ… నివేదిక వెల్లడిలో ఆలస్యం జరిగితే ప్రభుత్వంపై పోరాటానికైనా వెనకాడబోమని విద్యార్థి ఉద్యమకారులు స్పష్టం చేశారు.
యాదాద్రి టెంపుల్ బోర్డు మెంబర్ ఈశ్వరమ్మ యాదవ్పై జరిగిన అనుచిత వ్యాఖ్యల ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ఆమెను పరామర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ నాయకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ నేతలను తక్కువ చేసి మాట్లాడుతూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. బీసీలకే పెద్ద దిక్కుగా ఉన్న ఈశ్వరమ్మ యాదవ్పై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమని, దీనికి బాధ్యులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ యూత్ విభాగం అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డిపై తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి, పీసీసీ అధ్యక్షునికి, కాంగ్రెస్ అధిష్ఠానానికి ఆర్.కృష్ణయ్య సూచించారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ బీజేపీలో అసంతృప్తి బహిర్గతమైంది. తాజాగా ప్రకటించిన జిల్లా కార్యవర్గ కమిటీలో గజ్వేల్ నియోజకవర్గానికి తగిన ప్రాధాన్యత దక్కలేదంటూ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గజ్వేల్లో నిర్వహించిన నియోజకవర్గ కార్యవర్గ సమావేశంలో పలువురు నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. గత నాలుగు సంవత్సరాలుగా పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేసినా జిల్లా కమిటీలో గుర్తింపు లభించలేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి గణనీయమైన ఓట్లు సాధించడంలో తమ పాత్ర ఉందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఇకపై జిల్లా కమిటీతో కాకుండా నేరుగా రాష్ట్ర కమిటీతోనే కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. నియోజకవర్గానికి చెందిన 68 మంది సభ్యుల కమిటీ జాబితాను రాష్ట్ర నాయకత్వానికి పంపినట్లు తెలిపారు.
పార్లమెంట్ సమావేశాల్లో దేశ ప్రజల సమస్యలపై, తెలంగాణ పెండింగ్ హామీలపై సమగ్ర చర్చ జరగాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేసేలా ఉన్న డీలిమిటేషన్ బిల్లుపై పార్లమెంట్లో విస్తృత చర్చ జరగాలని.. నీట్ పేపర్ లీక్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక తెలంగాణ ప్రయోజనాల విషయంలో కూటమి ప్రభుత్వం ద్వంద్వ వైఖరి వీడాలన్న ఎంపీ.. రీజినల్ రింగ్ రోడ్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొందిగూడెంలో 32 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు.ప్రజల ఆశీర్వాదాలతో ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఆశ్రమ పాఠశాలలు, మెరుగైన వసతులతో హాస్టళ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
పేద ప్రజలకు విద్యతో పాటు సంక్షేమాన్ని అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు.పేదల సొంతింటి కల గత ప్రభుత్వంలో నెరవేరలేదని విమర్శించిన మంత్రి… ప్రస్తుత ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందన్నారు. పినపాక, భద్రాచలం నియోజకవర్గాలకు అదనంగా వెయ్యి ఇళ్లు కేటాయించామని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని హామీ ఇచ్చారు.ఏజెన్సీ ప్రాంతాల్లో భూముల రికార్డులను సమగ్రంగా పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ కమిషన్లు జరిగాయని ఆరోపిస్తూ గత ప్రభుత్వంపై మంత్రి విమర్శలు గుప్పించారు.డ్వాక్రా మహిళలకు 63 వేల కోట్ల రూపాయల రుణాలను సున్నా వడ్డీతో అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో ఓ ట్రైనీ ఐపీఎస్ అధికారిపై నమోదైన ఫిర్యాదు తీవ్ర కలకలం రేపుతోంది. ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపులు, బెదిరింపులు, అసభ్యకర సందేశాలు పంపినట్లు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వాట్సాప్లో అసభ్యకర మెసేజ్లు పంపడంతో పాటు దుర్భాషలాడారని, జులై 9న శారీరకంగా దాడికి పాల్పడి గొంతు నులిమేందుకు ప్రయత్నించారని బాధితురాలు ఆరోపించారు. అలాగే మెడపై కత్తి పెట్టి బెదిరించాడని, వ్యక్తిగత వీడియోను రికార్డు చేసి తన భర్తకు పంపాడని కూడా ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆరోపణలపై అధికారిక విచారణ కొనసాగుతోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని నూతన జిల్లా గ్రంథాలయంలో 10 లక్షల రూపాయల ఎంపీ లాడ్స్ రాజ్యసభ నిధులతో నిర్మించనున్న ప్రహరీ గోడ పనులకు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసాయం రఘురాం రెడ్డి పాల్గొన్నారు.ఎస్ఐఆర్ ప్రక్రియను సీరియస్గా తీసుకోవాలని, ఓటు హక్కును కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లల విద్యాభివృద్ధి, జిల్లా అభివృద్ధికి తాను కృషి చేస్తున్నానని తెలిపారు.అనంతరం గ్రంథాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వ విధానాలపై రేణుకా చౌదరి విమర్శలు చేశారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు చేస్తున్నప్పటికీ దేశ సమస్యలపై సరైన స్పందన లేదని ఆరోపించారు. విదేశాంగ విధానం దారుణంగా ఉందని, నేపాల్ వంటి దేశాలు కూడా భారత్ను బెదిరించే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు.పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలపై భారం పడిందని, గ్యాస్ సిలిండర్ల విషయంలో కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులు, గాంధీ కుటుంబంపై విమర్శలు చేస్తోందని ఆరోపించారు. త్వరలోనే కేంద్ర మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయని రేణుకా చౌదరి జోస్యం చెప్పారు.బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో రాత్రికి రాత్రే లక్షలాది ఓట్లు తొలగించారని ఆరోపించిన ఆమె… తెలంగాణలో కేంద్రం ప్రయత్నాలు ఫలించవని హెచ్చరించారు.





Total views : 219358