ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు సీఎం రేవంత్రెడ్డి. డీలిమిటేషన్తో సౌత్ స్టేట్స్తో పాటు చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఈ నిర్ణయంతో బీజేపీకి తాత్కాలికంగా లాభం జరగవచ్చు కానీ..దీర్ఘకాలంలో దేశానికి నష్టమన్నారు సీఎం రేవంత్ రెడ్డి..ఈ మేరకు డీలిమిటేషన్ విషయంలో ప్రధాని మోదీకి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మహిళా రిజర్వేషన్లు, డిలిమిటేషన్ వేర్వేరు అంశాలని, మహిళా కోటాను వెంటనే అమలు చేస్తే స్వాగతిస్తామన్నారు. కానీ మహిళా రిజర్వేషన్లను ఒక ముసుగుగా ఉపయోగించి జనాభా ఆధారితంగా లోక్సభ స్థానాల డిలిమిటేషన్ను ముందుకు తీసుకురావడం సరికాదన్నారు. పార్టీ ప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనం ముఖ్యం అని డిలిమిటేషన్కు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలన్నారు సీఎం రేవంత్రెడ్డి. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై జాతీయ ఏకాభిప్రాయం అవసరం అని ఈ విషయంలో అన్ని పార్టీలతో చర్చించాలని సూచించారు.
Telangana
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ సంస్థల ఆగడాలకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. చిన్న చితకా సంస్థల నుంచి మొదలుపెట్టి… బడా బడా కన్స్ట్రక్షన్ కంపెనీల వరకూ అందరూ నిబంధనలను తుంగలో తొక్కేవారే. కొంచెం ఎక్కువ… కొంచం తక్కువ అనే తప్ప… ఉల్లంఘనలకు పాల్పడని వారంటూ లేరంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే అనేక బడా సంస్థల మోసాలను సీవీఆర్ న్యూస్ బట్టబయలు చేసింది. వంశీరామ్ బిల్డర్స్ నిర్మిస్తున్న మాన్హట్టన్ ప్రాజెక్టులోనూ ఇలాంటి అవకతవకలే బయటపడ్డాయి. ఖాజాగూడలోని నానక్ రామ్ గూడ రోడ్డులో దాదాపు 14 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న మాన్హట్టన్ మెగా ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వ భూములు, చెరువు కబ్జా చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్వే నెంబర్ 27 లో ఉన్న ప్రభుత్వ భూమిలోనే ఈ నిర్మాణాలు జరుగుతున్నాయని తెలుస్తోంది…
సోహిని బిల్డర్స్తో కలిసి ఈ మెగా వెంచర్ను వంశీరామ్ బిల్డర్స్ సంస్థ అభివృద్ధి చేస్తోంది. 27/2 సర్వే నంబర్లోని 14 ఎకరాల్లో ఈ వెంచర్ నిర్మిస్తుండగా… అందులో చాలా వరకు ప్రభుత్వ, చెరువు భూములున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మిగతా భూమి కూడా వివాదాల్లోనే ఉందని వారు చెబుతున్నారు. వంద సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో తమ తాత తండ్రులు ఇక్కడ వ్యవసాయం చేశారని… కానీ ఆ తర్వాతి కాలంలో కొంతమంది వ్యాపారవేత్తలు అధికారులతో కుమ్ముక్కై భూమిని అన్యాక్రాంతం చేశారని చెబుతున్నారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తమ గోడు ఎవరూ వినలేదని… కళ్లెదుటే భూములు పోతుంటే కడుపు రగిలిపోయి చూస్తున్నామని వారు చెబుతున్నారు. రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకున్న వంశీరామ్ యాజమాన్యం భూములను తమ ఆధీనంలోకి తెచ్చుకుని.. మాన్ హట్టన్ పేరుతో వెంచర్ నిర్మిస్తున్నారని చెబుతున్నారు…
మరోవైపు కోర్టులో కేసులు ఉన్నప్పటికీ వంశీరామ్ బిల్డర్స్…. వెంచర్ నిర్మాణాన్ని కొనసాగించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఐలాపూర్లో ఇదే రీతిలో ప్రభుత్వ భూములను కబ్జా చేసి కొందరు భవనాలను నిర్మించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించారని పలుమార్లు హెచ్చరించినా ఎవరూ వినిపించుకోలేదు. దాని పర్యవసానం అందరూ చూసిందే. హైడ్రా అధికారులు వాస్తవాలను గుర్తించి.. అక్రమ భవనాన్ని కూల్చేశారు. ఇప్పుడు వంశీరామ్ బిల్డర్స్కు కూడా భవిష్యత్తులో ఇదే పరిస్థితి ఎదురవుతుందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టు నుంచి ఎలాంటి క్లియరెన్సులు రాకముందే నిర్మాణాలు పూర్తి చేస్తే… భవిష్యత్తులో అవి ప్రభుత్వ భూములని తేలితే పరిస్థితి ఏంటని.. మాన్ హట్టన్ వెంచర్లో ఫ్లాట్లు కొన్నవారు ప్రశ్నిస్తున్నారు…
తనపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేయడమే కాకుండా, లాయర్ సుబ్బారావుపై సింగర్ మంగ్లీ ఎదురుదాడికి దిగారు. ఈ మేరకు ఇటీవల నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. లాయర్ సుబ్బారావు తనపై ఫిర్యాదు చేయడానికంటే ముందే, తానే నార్సింగి పోలీసులను ఆశ్రయించానని మంగ్లీ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నోట్ల కట్టల దృశ్యాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంగ్లీ తేల్చి చెప్పారు. ఆ డబ్బు తనది కాదు, ఆ వ్యవహారంతో తనకు సంబంధం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.లాయర్ సుబ్బారావు ఉద్దేశపూర్వకంగానే తనను బదనాం చేస్తున్నారని, తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంగ్లీ మండిపడ్డారు. వ్యక్తిగతంగా కావాలని తనను టార్గెట్ చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. నిరాధారమైన ఆరోపణలతో మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకునేది లేదని మంగ్లీ హెచ్చరించారు. ఒక మహిళగా, కళాకారిణిగా సమాజంలో తనకున్న గుర్తింపును దెబ్బతీయాలని చూస్తున్న వారిపై చట్టపరంగా ముందుకెళ్తానని ఆమె వెల్లడించారు
కాగా, మంగ్లీపై పంజాగుట్ట పోలీసుస్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. మైక్రో ఫైనాన్స్ పేరిట 10కోట్ల రూపాయల మేర మోసం చేసినట్లు మంగ్లీ, ఆమె సోదరుడితో మరో ముగ్గురిపై న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదు చేశారు. తనకు వారి నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో న్యాయవాది పేర్కొన్నారు. దీంతో బీఎన్ఎస్ సెక్షన్ 351(2), 352 కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతిపై పంజాగుట్ట పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. మైక్రో ఫైనాన్స్ పేరిట రూ.10 కోట్లు పెట్టుబడి మోసానికి సంబంధించిన వ్యవహారంలో బాధితుల తరపున వాదిస్తున్న న్యాయవాదిని బెదిరించారనే ఆరోపణలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఈ కేసులో మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ, ‘విరాటపర్వం’ చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల పేర్లు కూడా చేరడం గమనార్హం.
దాదాపు 100 మంది అమాయక బాధితుల నుంచి అధిక లాభాల ఆశచూపి కోట్లు రూపాయలు వసూలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. వ్యాపార పెట్టుబడుల పేరుతో ఈ సొమ్ము సేకరించినట్లుగా తెలుస్తోంది. అయితే, ఏళ్లు గడుస్తున్నా లాభాలు రాకపోవడమే కాకుండా, కనీసం అసలు డబ్బు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు న్యాయవాది సుబ్బారావును ఆశ్రయించారు. కాగా బాధితుల తరపున న్యాయవాది సుబ్బారావు ఈ నిధులను వెనక్కి ఇవ్వాలని నిలదీయగా, మంగ్లీ టీమ్ నుంచి ఆయనకు బెదిరింపులు మొదలయ్యాయి.
అయితే, మంగ్లీ, ఆమె సోదరుడు శివ, దర్శకుడు వేణు ఊడుగుల తనకు ఫోన్ చేసి తీవ్రంగా హెచ్చరించారని, తనను రోడ్డు ప్రమాదంలో చంపేస్తామని భయపెట్టారని సుబ్బారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును సీరియస్గా తీసుకున్న పంజాగుట్ట పోలీసులు BNS సెక్షన్ 351 (2), 352 కింద కేసు నమోదు చేశారు. మంగ్లీకి ఉన్న క్రేజ్ రీత్యా ఈ కేసు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో దర్శకుడు వేణు ఊడుగుల ప్రమేయం ఎంతవరకు ఉందనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అక్రమంగా నిధులు వసూలు చేశారా..లేక ఈ వ్యవహారం వెనుక ఇతర శక్తులు ఉన్నాయా? అనే విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది..
కార్పొరేట్ ఫైనాన్స్ కంపెనీల ధన దాహానికి దేశ గ్రామీణ అమాయకులే టార్గెట్లుగా మారుతున్నారా ? అప్పనంగా ప్రజల డబ్బులు కొట్టేసేందుకు ఫైనాన్స్ కంపెనీల తీరు మారడం లేదా ? ఒకప్పుడు చైన్ సిస్టం ద్వారా మరోసారి బిట్ కాయిన్ ద్వారా ఇంకోసారి రియల్ ఏస్టేట్ ద్వారా ఇలా రూపాలేదైన అమాయకులైన సామాన్యులే పావులవుతున్నారు. తాజాగా మరో కార్పొరేట్ కంపెనీ మాయాజాలంలో చిక్కి దిక్కుతోచని సామాన్యులు కొట్టుమిట్టాడుతున్నారు.
() కరీంనగర్ జిల్లా కేంద్రంలో సమావేశమైన వీరంతా యూనిక్ అనే ఓ ఫైనాన్స్ సంస్థ చేసిన గోల్మాల్ దందాలకు బలైన అమాయకులు. కష్టపడి సంపాదించి కూడబెట్టిన సొమ్మును భవిష్యత్తు కోసం పొదుపు చేయడం కోసం గుజరాత్ కు చెందిన యూనిక్ అనే కార్పొరేట్ సంస్థను నమ్మి దగాపడ్డ బాధితులు. గ్రూప్ ఆఫ్ కంపెనీ గా చెప్పుకుంటున్న ఈ సంస్థ దశాబ్ద కాలంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తమదైన శైలిలో గ్రామీణ పేద ప్రజల నుంచి డిపాజిట్ల రూపంలో డబ్బులను సేకరించి చేతులెత్తేసింది. తీసుకున్న డిపాజిట్లు రెట్టింపు ఇస్తామన్న యూనిక్ సంస్థ కనీసం సేకరించిన డబ్బును కూడా ఇవ్వడానికి సుముఖంగా లేదు. ఆయా గ్రామాల్లో పేరుందిన వారిని ఏజెంట్గా నియమించుకొని.. తమ సంస్థను కార్పోరేట్ సంస్థగా ప్రమోట్ చేస్తూ ప్రజల్లో నమ్మకాన్ని ఏర్పాటు చేసుకున్నది. తర్వాత కోట్లాది రూపాయల డబ్బులు సేకరించింది యూనిక్ సంస్థ. ప్రధానంగా డిపాజిట్ల రూపంలో అధిక వడ్డీని చూపెడుతూ ప్రజలను మోసం చేయడమే కాకుండా ఎక్కువ మొత్తంలో డబ్బులు సేకరించేందుకు ఏజెంట్లకు కమిషన్లు భారీగా ఇచ్చుకుంది. కమిషన్లకు ఆశపడ్డ ఏజెంట్లు గ్రామాల్లో ప్రతి గడపను తట్టారు. కూలీ నాలీ నుంచి మొదలుకొని మధ్యతరగతి ప్రజలను టార్గెట్గా చేసుకునే ఏజెంట్లు 100 రూపాయల నుంచి లక్షలాది రూపాయలు డిపాజిట్ల పేరుతో గుంజారు. ఇదంతా ఒక్కరోజో, నెలలో ఏడాదో చేసిన పని కాదు దాదాపు పది సంవత్సరాలుగా ఈ డిపాజిట్ల సేకరణ చేస్తూనే ఉన్నారు.చేసిన డిపాజిట్ లన్ని మెచ్యూరిటీ సమయానికి రెట్టింపు తో ఇస్తామని నమ్మబలికిన కంపెనీ డిపాజిట్లు మ్యాచురిటీ అయ్యేసరికి మొహం చాటేసింది.
ప్రజల మధ్య ఉన్న ఏజెంట్లు తమకు తెలిసిన వారి వద్ద నుండి సేకరించిన డబ్బును ఇవ్వాల్సిందిగా కంపెనీ చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. అయితే ఇదిగో.. అదిగో అంటూ ఏళ్లు దాటేస్తూ ఒకరి కూడా డిపాజిట్లు రిటర్న్ ఇవ్వకపోవడంతో ఇటు డిపాజిట్ దారుల్లో అటు ఏజెంట్లలో గుబులు మొదలైంది. దీంతో నేరుగా గుజరాత్ కంపెనీకి సంబంధించిన యజమానిని సంప్రదించారు. కేవలం ఏజెంట్లను మాత్రమే ఏర్పాటు చేసి వారి ద్వారానే డబ్బులు సేకరించింది. సేకరించిన డబ్బుంతా కూడా విదేశాలకు తరలించారని చెప్పి సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే పలుచోట్ల యాజమాన్యం పైన కేసులు ఫైల్ అయినప్పటికీ కరీంనగర్ లో బాధితులకు మాత్రం ఎలాంటి భరోసా రాకపోవడంతో రానున్న రోజుల్లో దీనిపై ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నారు. తమల్ని ఆదుకోవాలని.. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని.. యూనికాన్ కంపెనీ నుంచి తమ డబ్బును ఇప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు.
సిద్దిపేట జిల్లా నుంగనూర్ మండలం నర్మెట్ట గ్రామంలో జూనో జొలే బయో ఫుయిల్స్ కు మంత్రి శ్రీధర్ బాబు, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ హన్మంత రావు, తదితరులు పూజ చేశారు. ఆయిల్ ఫామ్ ప్రారంభమైన కొద్ది రోజులకే మరో ఫ్యాక్టరీ ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు శ్రీధర్బాబు. సీఎం రేవంత్ రాష్ట్రంలోని యువతకు ఉపాధి కావాలని ఎన్నో పరిశ్రమలు తీసుకువచ్చారు. ఫ్యాక్టరీలు రావడం వల్ల గ్రామాలు అభివృద్ధి చెంది యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. అప్పటి ప్రభుత్వమైనా ఇప్పటి ప్రభుత్వమైనా ప్రజలకు, యువత కు ఉపాధి కోసం ప్రయత్నం చేసాము.. చేస్తామన్నారు. అక్కడ ఎక్కడో యుద్ధం జరుగుతుంటే ఇక్కడ మన ఇంట్లో గ్యాస్ కొరత ఏర్పడుతుందని అందుకే ఇలాంటి పరిశ్రమలు స్థాపించడం వల్ల కొంత ఐనా మేలు జరుగుతుందన్నారు. డిసెంబర్ లోపు ఈ పరిశ్రమ నుంచి ఉత్పత్తి ప్రారంభం కావాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. ప్రభుత్వం తరపున ఏ అవసరం వచ్చినా మేము ఎప్పుడు ముందు ఉంటామన్నారు. మాకు బేషజాలు లేవు ఎక్కడ పరిశ్రమల పెట్టిన మేము సహాయం చేస్తామని శ్రీధర్బాబు హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ప్రస్తుత పరిస్థితి, గత ఎన్నికల్లో ఓటమి, సోదరి కవిత వైఖరిపై ఆయన ఆసక్తికరంగా స్పందించారు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా కవితను కేటీఆర్ విమర్శించారు. కవిత కన్నవారికి మేలు చేయకపోయినా ఫర్వాలేదని.. కానీ ఏడిపించొద్దంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కవిత వల్ల కన్నవారు, కుటుంబ సభ్యులు బాధపడుతున్నారని అన్నారు. జైలుకు వెళ్లొస్తే ముఖ్యమంత్రి అవుతారనుకోవడం వట్టి భ్రమేనని కేటీఆర్ అన్నారు. అలాగే బీఆర్ఎస్ తాజా పరిస్థితిపై కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్గా మారాక తాము తీవ్రంగా నష్టపోయామని… అందుకే మళ్లీ టీఆర్ఎస్గానే మారి ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. అలాగే గత పాలన సమయంలో కార్యకర్తలకు, నాయకులకు మధ్య దూరం చాలా పెరిగిందని… దాని వల్లే ఎన్నికల్లో ఓటమి చవి చూడాల్సి వచ్చిందని చెప్పారు. ఈ విషయంలో టీడీపీలో చాలా మంచి లక్షణం ఉందని.. ఆ పార్టీ అధినేత కార్యకర్తలతో దగ్గరగా ఉంటారని కేటీఆర్ కితాబిచ్చారు. అలాగే పొత్తుల అంశం తమకు ఎప్పుడూ కలిసి రాలేదని… అందుకే భవిష్యత్తులో ఎవరితోనూ.. ముఖ్యంగా BJP తో పొత్తు అసలే ఉండదని కేటీఆర్ చెప్పారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు 2027 లో పాదయాత్ర చేస్తానని… తారకరామారావు చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ పార్టీకి పేద ప్రజలకు సేవచేసే ఉదారత్వం ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరయ్యారు. రైతులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు బాగుండాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ అని ఆయన పేర్కొన్నారు. పార్టీ పరంగా పటాన్ చెరు నాయకత్వం ఎంతో సేవలు చేసింది, వారికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందన్నారు మంత్రి. విద్య, వైద్య రంగాలలో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే దృఢసంకల్పంతో పనిచేస్తున్నామన్నారు.
పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతాన్ని ఇందిరా గాందీ గుర్తించి ఎన్నో ప్రతిష్టాత్మక పరిశ్రమలను నెలకొల్పారని ఆయన కొనియాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కందిలో త్రిబుల్ ఐటిని నెలకొల్పారని మంత్రి గుర్తు చేశారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలలో భారీగా నగదు గల్లంతైన ఘటన కలకలం రేపింది. ఎస్ ఆర్ నగర్ రూట్ పరిధిలో ఎస్బీఐ ఏటీఎంలలో నగదు గల్లంతైనట్లు సీఎంఎస్ సెక్యూరిటీ సంస్థ గుర్తించింది. ఎస్బీఐ ఏటీఎంలలో సీఎంఎస్ సెక్యూరిటీ సంస్థ నగదు ఫిల్ చేస్తుంది . ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ ఫిర్యాదు చేసింది. కోటి 20 లక్షల 98 వేల 500 రూపాయల నగదు గల్లంతైనట్లు ఫిర్యాదు చేసింది. ఏటీఎంలలో నగదు లోడింగ్ సమయంలో అవకతవకలు జరిగినట్లు సీఎంఎస్ గుర్తించినట్లు తెలుస్తోంది. సిబ్బంది చేతివాటమా? లేక మరేదైనా కారణమా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
బనగానపల్లెలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై అఘాయిత్యానికి యత్నించిన నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని CMR ఫంక్షన్ హాల్ సమీపంలో 13 సంవత్సరాల బాలిక ఓ బాలిక, కూలి పనులకు వెళ్లిన తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి తమ్ముడు తో కలిసి తిరిగి ఇంటికి వస్తోంది. అప్పుడే సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో స్విమ్మింగ్ పూల్ కి వెళ్లి వస్తున్న రవితేజ అనే యువకుడు బాలికను గమనించాడు. “చేపలు పడదాం రా.. ఆడుకుందాం రా” అంటూ ఆ బాలికను నమ్మించి సమీపంలోని బ్రిడ్జి కిందకు బలవంతంగా లాక్కెళ్లాడు.బ్రిడ్జి కింద బాలికపై అఘాయిత్యానికి యత్నించిన నిందితుడు, ఆమె ప్రతిఘటించడంతో విచక్షణ కోల్పోయి ప్రవర్తించాడు. బాలిక దవడపై పళ్ళతో బలంగా కొరికి తీవ్రంగా గాయపరిచాడు. ఆ సమయంలో బ్రిడ్జిపై ఉన్న బాలిక తమ్ముడు సోదరి అరుపులు విని గట్టిగా కేకలు వేశాడు. దీంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే బ్రిడ్జి కిందకు చేరుకుని బాలికను రక్షించారు.కామాంధుడు రవితేజను పట్టుకున్న స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి బనగానపల్లె పోలీసులకు అప్పగించారు. తీవ్ర రక్తగాయాలైన బాలికను వెంటనే బనగానపల్లె ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక అక్కడ చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై రవితేజపై పోక్సో మరియు అటెంప్ట్ టు రేప్ కేసులు నమోదు చేసినట్లు సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
ములుగు జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మేడారంలో జరిగిన ప్రమాద ఘటనను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం సరికాదని ఆమె హితవు పలికారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రజల మనోభావాలను కించపరిస్తే సహించేది లేదని ఆమె స్పష్టం చేశారు. అంగన్వాడీలకు సెల్ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు. అది కేవలం తప్పుడు ప్రచారం మాత్రమేనని, అందులో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేశారు. అసత్య ఆరోపణలతో బురదజల్లే ప్రయత్నం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే నేతలను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక, ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఆధారాలు లేకుండా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు.



Total views : 38425