పోలవరం ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల పరిస్థితులను తెలుసుకునేందుకు సీడబ్ల్యూసీ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు.పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలంలో పోలవరం ముంపుకు గురయ్యే ప్రాంతాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తెలంగాణలో పోలవరం ప్రాజెక్టు కారణంగా ప్రభావితమవుతున్న గ్రామాలు, ముంపు పరిస్థితులపై సమగ్ర సమాచారం సేకరించారు.ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశమైన సీడబ్ల్యూసీ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్యులు ముంపు ప్రాంతాల వివరాలు, పునరావాస చర్యలు, రక్షణ పనులపై ఆరా తీశారు.ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్లో తీసుకోవాల్సిన చర్యలపై కూడా అధికారులు చర్చించినట్లు తెలుస్తోంది.
Telangana
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణ భూమి పుత్రుల జాగీరేనని, ఈ నేల కోసం పోరాడిన ప్రజల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం అని స్పష్టం చేశారు.తెలంగాణ ఉద్యమం వేలాది మంది త్యాగాలు, పోరాటాల ఫలితంగా సాధించుకున్న రాష్ట్రం అని పేర్కొన్న కేటీఆర్.. ప్రాంతీయవాదాన్ని ఉగ్రవాదంతో పోల్చడం సరైన వ్యాఖ్య కాదన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు చేసిన ఉద్యమం కూడా ప్రాంతీయ భావనలో భాగమే కాదా అని ప్రశ్నించారు.ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ నాయకుడైనా దేశంలో ఎక్కడైనా పోటీ చేసే హక్కు రాజ్యాంగం కల్పించిందని, జనసేనను తెలంగాణలో ఎవరూ అడ్డుకోవడం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. 2018, 2023 ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేసిందని గుర్తు చేశారు.పవన్ కళ్యాణ్ను ఉప ముఖ్యమంత్రిగా, నటుడిగా గౌరవిస్తామని, కానీ తెలంగాణ ప్రజల మనోభావాలు, ఉద్యమ చరిత్ర, త్యాగాలను గౌరవిస్తూ మాట్లాడాలని సూచించారు.
దేశవ్యాప్తంగా ఓటరు జాబితాను ప్రక్షాళన చేసేందుకు భారత ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ మూడో దశ ప్రక్రియను తెలంగాణ రాష్ట్రంలో పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఈఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి భారత ఎన్నికల సంఘం సీనియర్ అధికారులు ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్, ఉప కార్యదర్శి సంజయ్ కుమార్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అధికారులనుద్దేశించి ప్రసంగిస్తూ అసెంబ్లీ నియోజకవర్గాల వివరాలు, ఎస్ఐఆర్ కోసం నియమించిన సిబ్బంది, ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాల గురించి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 68.30శాతం మ్యాపింగ్ పూర్తయిందని ఆయన తెలిపారు.
భారత ఎన్నికల సంఘం అధికారులు ఎస్ఐఆర్ పై సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో భారత రాజ్యాంగంలోని సంబంధిత నిబంధనలు, ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950, ఓటర్ల నమోదు నియమాలు-1960 గురించి వివరించారు. అలాగే ఎస్ఐఆర్ ప్రాముఖ్యతను వివరించి, ఈ ప్రక్రియలోని ముఖ్య దశలను, ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ, క్లెయిమ్లు, అభ్యంతరాల దాఖలు, నోటీసుల జారీ, వాటి పరిష్కారం, తుది ఓటరు జాబితా ప్రచురణ తదితర అంశాలపై సమగ్రంగా వివరించారు. గణన ఫారాలను నింపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఈసీఐ అధికారులు సూచించారు. అధికారిక పోర్టల్ ద్వారా ఆన్లైన్లో గణన ఫారాల సమర్పణను విస్తృతంగా ప్రచారం చేయాలని, ఓటర్లకు ఎస్ఐఆర్ గురించి త్వరితగతిన సమాచారం అందించే ‘బుక్ ఎ కాల్’ సదుపాయాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు.
తెలంగాణకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. నేడు, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు మరియు దక్షిణ తెలంగాణ జిల్లాలపై ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండనుందని పేర్కొంది. ముఖంగా ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట,
మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ‘ఆరెంజ్’ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో వర్షాలతో పాటు బలమైన ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొంది. మరోవైపు, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు రేపటిలోగా కేరళ, తమిళనాడు తీరాలను తాకనున్న నేపథ్యంలో మంగళవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు రికార్డయ్యాయి. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో రాత్రంతా భారీ వాన కురిసింది. భారీ వర్ష సూచన నేపథ్యంలో రైతులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భారతీయ జనతా పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషించిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదని బండి సంజయ్ మండిపడ్డారు. “గడిచిన పదేళ్ల కాలంలో కేసీఆర్ కుటుంబం తెలంగాణను పూర్తిగా దోచుకుందని, తెలంగాణ సిద్ధించిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా దిగజారిపోయిందన్నారు. నాడు బీఆర్ఎస్ దోచుకుంటే.. నేడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని దోచుకుంటోందని బండి సంజయ్ ఆరోపించారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అప్పుడే తీవ్ర అసహ్యం మొదలైందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి వల్లే 14 వందల మంది అమాయక యువకులు బలిదానం చేసుకోవాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల సమస్యలు పట్టడం లేదని, రాష్ట్రంలో ధాన్యానికి మద్దతు ధర కల్పించడంలోనూ, ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా సాగించడంలోనూ ప్రభుత్వానికి అస్సలు శ్రద్ధ లేదని విమర్శించారు.
రాష్ట్ర ప్రజలు ఇప్పటివరకు అన్ని రాజకీయ పార్టీలకు పాలించే అవకాశం ఇచ్చారని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లి, నిజమైన ప్రజాస్వామ్య పాలను అందించే సత్తా కేవలం బీజేపీకే ఉందన్నారు. ఈసారి రాష్ట్రంలో మార్పు కోసం, అవినీతి రహిత పాలన కోసం ప్రజలందరూ భారతీయ జనతా పార్టీకి ఒక్క అవకాశం ఇచ్చి అధికారంలోకి తీసుకురావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర 12వ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం.. పరేడ్ గ్రౌండ్స్ లో సీఎం మాట్లాడారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ ప్రసంగం మొదలు పెట్టిన సీఎం.. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాల సక్సెస్ గురించి వివరించారు. తెలంగాణ కలను సాకారం చేసిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు, కృషి చేసిన సోనియాగాంధీకి ధన్యవాదాలు తెలిపారు. పుట్టుకనీది, చావునీది.. బతుకంతా దేశానిది అన్న కాళోజీ మాటలను గుర్తు చేసుకున్నారు. కాళోజీ స్ఫూర్తితో అధికారం చేపట్టిన నాటి నుంచీ రాష్ట్ర హితం కోసమే శ్రమిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు.
పేదలకు సొంతిళ్లు సాకారం అనేది మాటల్లో చెప్పలేనిది. పేదలను అద్దె ఇళ్ల బాధల నుంచి విముక్తి చేయాలని నిర్ణయించాం. 13 నెలల కాలంలో 1.25 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాం. రూ.22 వేల కోట్లతో పేదల ఇళ్ల కోసం ఖర్చు చేస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ 3.50 లక్షల ఇళ్లను మంజూరు చేశాం. ఈసారి క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తాం. పేదలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్కార్డులు ఇచ్చాం.’’ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన పోలీసు అధికారులకు విశిష్టసేవా పురస్కారాలను ప్రదానం చేశారు.
గత పదేళ్ల తెలంగాణ ప్రయాణాన్ని ప్రస్తావించిన ముఖ్యమంత్రి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు సమిష్టి కృషి అవసరమని పిలుపునిచ్చారు.అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణను మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజల సహకారంతో సుస్థిర అభివృద్ధి, పారదర్శక పాలన దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన వెల్లడించారు. ప్రతి పేద ప్రజలకు సన్న బియ్యం అందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
రాష్ట్రంలోని వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని వెల్లడించారు. వృద్ధాశ్రమాల్లో నివసిస్తున్న పెద్దలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, వారి ఆరోగ్యం, భద్రత, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.సమాజానికి సేవ చేసిన పెద్దలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు అమలు చేస్తుందని స్పష్టం చేశారు. ఒంటరిగా జీవిస్తున్న వృద్ధులకు అండగా నిలవడంతో పాటు, వారికి అవసరమైన అన్ని సేవలను అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పెద్దపల్లి జిల్లా నిమ్మనపల్లి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓవర్లోడ్ మట్టి లారీల రవాణాతో విసిగిపోయిన స్థానిక గ్రామస్తులు రోడ్డుపైకి వచ్చి లారీలను అడ్డుకున్నారు. నిమ్మనపల్లి సర్పంచ్ రమేష్ ఆధ్వర్యంలో గ్రామస్తులంతా ఏకమై మట్టి రవాణా వాహనాలను నిలిపివేసి భారీ ధర్నాకు దిగారు.
జిల్లాలోని కొదురుపాక చెరువు నుండి రాఘవపూర్ ఇటుక బట్టీలకు రాత్రింబవళ్లు వందలాది లారీల్లో మట్టిని తరలిస్తున్నారు. ఈ భారీ వాహనాల ఓవర్లోడ్ కారణంగా గ్రామంలోని అంతర్గత రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయని స్థానికులు మండిపడుతున్నారు. లారీలు వెళ్లేటప్పుడు లేస్తున్న విపరీతమైన దుమ్ము వల్ల ఇండ్లల్లో ఉండలేకపోతున్నామని, శ్వాసకోశ సమస్యలతో పిల్లలు, వృద్ధులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత కొద్దిరోజులుగా ఈ అక్రమ, ఓవర్లోడ్ రవాణాను నిలిపివేయాలని ఆందోళనలు చేస్తున్నప్పటికీ.. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని సర్పంచ్ రమేష్ ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ మట్టి రవాణాను అరికట్టాలని, ఓవర్లోడ్ వాహనాలకు భారీ జరిమానాలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణలో తనను అడుగుపెట్టనివ్వమని, తిరగనివ్వమని హెచ్చరికలు చేస్తున్న వారిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ వారి అయ్య జాగీరా అంటూ మండిపడ్డారు. ఎవరు ఏం అన్నా తన గుండెల్లో తెలంగాణ ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణపై తనకు ప్రేమ ఈ రోజు వచ్చింది కాదని.. ఎప్పటినుంచో ఉందని తేల్చి చెప్పారు. హైదరాబాద్ , జూబ్లీహిల్స్లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. దేశంలో అంతర్భాగం తెలంగాణ అని స్పష్టం చేశారు. తెలంగాణను వ్యతిరేకించిన వారే.. పదవుల్లో ఉన్నారని.. ఎమ్మెల్యేలు అయ్యారన్న పవన్ కల్యాణ్..ఆంధ్రప్రదేశ్లోనే కాదు.. ఇక్కడ ఏమైనా చేస్తే తాను సీఎం అయిపోతానా? అని ప్రశ్నించారు. తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. తెలంగాణలో పోటీ చేస్తామని ఆయన కుండ బద్దలు కొట్టారు.
న్యాయవాదులు తమ వృత్తిపరమైన విధులను నిర్భయంగా, స్వతంత్రంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం చారిత్రక అడుగు వేసింది. న్యాయవాదులతో పాటు వారి కుటుంబ సభ్యులకు పూర్తిస్థాయి భద్రత కల్పించే ఉద్దేశ్యంతో రూపొందించిన తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం 2026 అధికారికంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ జీవో ఎంఎస్ నంబర్ 41 ద్వారా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ చట్టం ద్వారా కోర్టు అనుమతి లేకుండా లాయర్లను అరెస్టు చేయకుండా అత్యంత కీలకమైన రక్షణలు కల్పించారు.
కొత్త చట్టంలో లాయర్లకు ఊరటనిచ్చే ప్రధాన అంశం అరెస్టుల నుంచి రక్షణ. ఇకపై పోలీసులు ఏ న్యాయవాదినైనా అరెస్టు చేయాలంటే ముందుగా న్యాయస్థానం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేశారు. దీనివల్ల న్యాయవాదులపై జరిగే అక్రమ అరెస్టులు, కక్షసాధింపు చర్యలకు, వేధింపులకు శాశ్వతంగా చెక్ పడనుంది. అలాగే, ఉద్దేశపూర్వకంగా న్యాయవాదులపై తప్పుడు కేసులు బనాయించే వ్యక్తులకు సైతం మూడేళ్ల జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా విధించేలా చట్టంలో నిబంధనలు పొందుపరిచారు.
న్యాయవాదులు లేదా వారి కుటుంబ సభ్యులపై దాడులు చేసినా, బెదిరింపులకు గురిచేసినా, బహిరంగంగా దుర్భాషలాడినా ఈ చట్టం కింద కఠినంగా శిక్షిస్తారు. ఈ తరహా నేరాలకు పాల్పడినట్లు మొదటిసారి రుజువైతే ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.25 వేల వరకు జరిమానా విధిస్తారు. ఒకవేళ నేరం పునరావృతమైతే ఆ శిక్ష మరింత కఠినంగా ఉంటుంది. జైలు శిక్షను ఒకటి నుంచి ఏడేళ్ల వరకు పొడిగిస్తారు. అలాగే జరిమానాను సైతం రూ.50 వేల నుంచి గరిష్టంగా లక్ష రూపాయల వరకు విధిస్తారు.
గతంలో ప్రముఖ న్యాయవాద దంపతులు వామన్ రావు, నాగమణి దారుణ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ, వివిధ న్యాయవాద సంఘాల సుదీర్ఘ పోరాటాలు, విజ్ఞప్తుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 30న శాసనసభలో ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. తాజా చట్టం ప్రకారం.. తమకు ప్రాణహాని ఉందని భావించే ఏ న్యాయవాదికైనా ప్రభుత్వం తక్షణమే పోలీసు భద్రత కల్పిస్తుంది. లాయర్ల సమస్యల సత్వర పరిష్కారం కోసం రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో ప్రత్యేకంగా గ్రీవెన్స్ రిడ్రెస్సల్ కమిటీల ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. సమాజంలో చట్టాన్ని, ధర్మాన్ని కాపాడే న్యాయవాదులపై దాడులు జరిగితే.. అది మొత్తం న్యాయవ్యవస్థపై దాడి చేసినట్లేనని భావించి ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది. దేశంలోనే ఇలాంటి ప్రత్యేక చట్టాన్ని అమలు చేస్తున్న కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటిగా నిలిచింది.
హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో పోలీసు స్టేషన్ లో తప్పుడు ఫిర్యాదిచ్చి భయపెట్టాడు. ఫిర్యాదు వెనక్కి తీసుకుంటానంటూ.. అర్థరాత్రి వేళ దంపతులతో కాళ్లు మొక్కించుకున్నాడు.. ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బిహార్ కు చెందిన లీలావతి, ఆమె భర్త ఉప్పల్ లక్ష్మీనారాయణ కాలనీలో ఉంటూ.. సమీపంలో ఉన్న ఓ అట్టల కంపెనీలో పనిచేస్తున్నారు. లీలావతి ఇద్దరు పిల్లలు, మరికొంత మందితో కలిసి కాలనీలోని రోడ్డు పై క్రికెట్ ఆడారు. అదే కాలనీలో ఉండే మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ నాయకుడు రాత్రి వేళ ఆటలేంటంటూ దూషిస్తూ లీలావతి, ఆమె భర్తపై దాడి చేశాడు. అంతేకాదు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాత్రివేళల్లో పెట్రోలింగ్ నిర్వహించే పోలీసులు వచ్చి వారిని పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు. బాధితులుఇచ్చిన ఫిర్యాదు తీసుకోకుండా లీలావతి కుటుంబం తన బంగారు గొలుసు దొంగిలించారంటూ వారిపైనే ఫిర్యాదుచేశాడు. భయపడిపోయిన ఆ దంపతులు కేసు పెట్టవద్దని సదరు నేతను బతిమిలాడుకున్నారు. పోలీసుల సాక్షిగా నాయకుడు కాళ్లు మొక్కడంతో ఫిర్యాదు ను వెనక్కి తీసుకున్నాడు. ఈ సంఘటన కు సంబంధించిన వీడియోలు వైరల్ అవ్వటంతో ఈ ఘటన వెలుగుచూసింది.




Total views : 92029