హైదరాబాద్లో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజేంద్రనగర్ ఎస్వోటీ బృందంతో కలిసి నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దర్యాప్తులో ప్రధాన నిందితుడు మహమ్మద్ ఫైజాన్ బక్షి నాగ్పూర్ నుంచి గంజాయిని తెప్పించి, సబ్ప్యాడలర్ సయ్యద్ సాదిక్ ద్వారా చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి నగరంలోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి 8.410 కిలోల ఎండు గంజాయి, మోటార్సైకిల్, డిజిటల్ తూకం మిషన్లు, సీలింగ్ మిషన్, ప్యాకింగ్ మెటీరియల్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అంతర్రాష్ట్ర గంజాయి సరఫరా నెట్వర్క్పై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
Crime
ఆంధ్రప్రదేశ్లో తీవ్ర సంచలనం సృష్టించిన ముంబై నటి కాదంబరి జెత్వాని కేసులో సీఐడీ దాఖలు చేసిన చార్జ్షీట్తో ఓ ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో సీఐడీ జరిపిన లోతైన విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైఎస్సార్సీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ను నటి కాదంబరి జెత్వాని బ్లాక్మెయిల్ చేసినట్లు సీఐడీ తన చార్జ్షీట్లో అధికారికంగా పేర్కొంది. సీఐడీ చార్జ్షీట్ ప్రకారం.. కుక్కల విద్యాసాగర్తో తనకు ఉన్న సన్నిహిత సంబంధాలకు సంబంధించిన ఫొటోలను చూపించి కాదంబరి జెత్వాని ఆయనను బెదిరింపులకు గురిచేసింది. ఈ ఫొటోలను బయటపెడతానంటూ బ్లాక్మెయిల్ చేసి, విద్యాసాగర్ నుంచి ఆమె రూ. 1.32 కోట్లు వసూలు చేసినట్లు సీఐడీ స్పష్టం చేసింది. ఈ బ్లాక్మెయిలింగ్, డబ్బు వసూళ్లకు సంబంధించిన పక్కా ఆధారాలను కూడా సీఐడీ తన చార్జ్షీట్లో పొందుపరిచింది. గతంలో ఈ కేసు రాజకీయంగా, పరిపాలనాపరంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. జెత్వాని ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా, ఈ కేసులో విచారణ సరిగా జరపలేదనే ఆరోపణలు ఎదుర్కొన్న ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది. అయితే, ఇప్పుడు సీఐడీ సమర్పించిన చార్జ్షీట్లో విద్యాసాగర్ను జెత్వాని బ్లాక్మెయిల్ చేసినట్లు స్పష్టమైన ఆధారాలతో పేర్కొనడంతో ఈ కేసు సరికొత్త మలుపు తిరిగింది. ఈ పరిణామం రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ సంచలనాలకు దారితీస్తుందో చూడాలి.
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా యూనిట్లో భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా..పలువురికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
రామోల్ ప్రాంతంలోని మెహమూద్పురాలో ఓ ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన బాణసంచా తయారీ కేంద్రంలో ఈ దుర్ఘటన జరిగింది. పేలుడు జరిగిన వెంటనే 9 మందిని ఎల్.జి. ఆసుపత్రికి తరలించగా, వారిలో నలుగురు అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్ర గాయాలతో చేరిన ఐదుగురిలో చికిత్స పొందుతూ మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. 95 శాతం కాలిన గాయాలతో వీరు మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మరో ఆరుగురిని అసర్వా సివిల్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఒకరు మరణించారు.
పేలుడు శబ్దం వినిపించిన వెంటనే సమీపంలోని రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమాచారమందుకొని అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
హైదరాబాద్లో అక్రమంగా విక్రయిస్తున్న నిద్రమాత్రలు, దగ్గు సిరప్ల గుట్టును పోలీసులు రట్టు చేశారు. హబీబ్నగర్లో హైదరాబాద్ సీసీఎస్ స్పెషల్ క్రైమ్ టీమ్, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో భారీగా మత్తు మందులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా.. మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు సీపీ క్రైమ్స్ శ్రీనివాస్ తెలిపారు. బీదర్ నుంచి భారీ మొత్తంలో ఈ మందులను హైదరాబాద్కు తరలించి, వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు.ఈ కేసులో మొహమ్మద్ సర్వార్ అలియాస్ రహీమ్, మొహమ్మద్ రబ్బానీ అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ మందులను ఎంతమందికి విక్రయించారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని, బీదర్లో కూడా నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు.
తమిళనాడు పెరంబలూర్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. చెన్నై-మధురై హైవేపై ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డారు 23 మంది ప్రయాణికులు.
ప్రైవేట్ స్లీపర్ బస్సులో ఎగసిపడిన మంటలు క్షణాల్లోనే బస్సు మొత్తం వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. పెరంబలూర్ జిల్లా మంగళమేడు సమీపంలో జరిగింది ఈ ఘటన. చెన్నై నుంచి మదురై వైపు వెళ్తున్న ప్రైవేట్ స్లీపర్ కోచ్ బస్సు..చెన్నై-తిరుచిరాపల్లి జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 23 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ముందు భాగం నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై..హైవే పక్కన బస్సును నిలిపివేసి, ప్రయాణికులను కిందకు దించేశాడు. ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే మంటలు బస్సంతటా వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పిందని, ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు. హైవేపై బస్సులో భారీగా మంటలు ఎగసిపడటంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేశారు.
పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో విషాదం నెలకొంది. స్కూల్ బస్సును రైలు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఓ స్కూల్ బస్సు కర్ణసుబర్ణ రైల్వే క్రాసింగ్ దగ్గర పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. రైలు స్కూల్ బస్సును ఢీకొట్టడంతో బస్సు పూర్తిగా ధ్వంసం అయిపోయింది.
లోపల ఉన్న విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు సహాయక చర్యలు మొదలెట్టారు. లోపల చిక్కుకుపోయిన విద్యార్థులను బయటకు తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కు తరలించారు. ‘ప్రమాదం జరిగిన సమయంలో రైలు గేట్లు తెరిచి ఉన్నాయని..బస్సు ట్రాక్ దాటుతుండగా ఒక్కసారిగా రైలు వచ్చి ఢీకొట్టిందంటున్నారు ప్రత్యక్ష సాక్షులు.
మంచిర్యాల జిల్లా మందమర్రి మార్కెట్లోని మహేశ్వర ట్రేడర్స్ నుంచి గోలేటికి అక్రమంగా తరలిస్తున్న నకిలీ జెమిని టీ పౌడర్ బాక్సులను పోలీసులు వాహన తనిఖీల్లో పట్టుకున్నారు. స్థానిక టోల్ గేట్ వద్ద సాధారణ వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ అక్రమ రవాణా ఉదంతం వెలుగులోకి వచ్చింది. పట్టుబడిన రెండు నకిలీ జెమిని చాయ్ పత్తి బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన నకిలీ టీ పొడిని పోలీసులు తదుపరి దర్యాప్తు కోసం ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించారు. నిబంధనలకు విరుద్ధంగా నకిలీ సరుకును సరఫరా చేస్తున్న సదరు మహేశ్వర ట్రేడర్స్ షాపు యజమానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతూ ఇలాంటి ఆహార కల్తీకి పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. మార్కెట్లో బ్రాండెడ్ ఉత్పత్తుల పేరుతో చలామణి అవుతున్న నకిలీ వస్తువుల పట్ల వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి లో పరువు హత్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బాధితుడి బంధువులు ఆగ్రహంతో ఉప్పరపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ఉప్పరపల్లి గ్రామానికి చెందిన సినపెల్లి భాస్కర్, నిఖిత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఇరువురు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందినవారు కావటంతో మూడేళ్ల క్రితం నికితకు వేరే యువకుడితో వివాహం జరిపించారు. నిఖిత కి పెళ్లి ఇష్టం లేకపోవడం తో ఇటీవల విడాకులు తీసుకుంది. అయితే తన కూతురి కాపురం కూలిపోవడానికి భాస్కరే కారణమని కక్ష పెంచుకున్నాడు నికిత తండ్రి. హైదరాబాద్ మాదాపూర్ హాస్టల్ లో ఉంటున్న భాస్కర్ ను నికిత తండ్రి, మరికొందరుకలిసి దాడి చేసి దారుణంగా హతమార్చారు. భాస్కర్ దారుణ హత్యకు గురయ్యాడనే వార్త ఉప్పరపల్లి గ్రామానికి చేరడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఆగ్రహంతో ఊగిపోయిన భాస్కర్ బంధువులు, దళిత సంఘాల నాయకులు ఉప్పరపల్లి లో రోడ్డు వద్ద ధర్నాకు దిగారు. పోలీసులు అవాంఛనీయ ఘటనలు ఏవీ జరగకుండా, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా గ్రామంలో భారీగా బలగాలను మోహరించారు.
అన్నమయ్య జిల్లా రాజంపేట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుల్లంపేట మండలం పుత్తనవారిపల్లె వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు మోటార్సైకిళ్లు ఢీకొనడంతో తీవ్ర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే బైక్పై ప్రయాణిస్తున్న సోంబత్తిన నారాయణ, లక్ష్మీదేవి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.మృతులు రాజంపేట మండలం గాలివారిపల్లె గ్రామానికి చెందిన దంపతులుగా పోలీసులు గుర్తించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకొని పంచనామా అనంతరం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
హైదరాబాద్ కూకట్పల్లిలోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక దాడి ఘటన వెలుగులోకి వచ్చింది. 7వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల మైనర్ బాలికకు చాక్లెట్లు ఆశ చూపించిన ఉత్తరప్రదేశ్కు చెందిన రెహన్ , ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది.బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేపీహెచ్బీ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.నిందితుడిపై పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు, అనంతరం అతడిని న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.




Total views : 221094