ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 21 మంది సజీవ దహనమయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 35 మందిని కాపాడారు. మాలవీయనగర్లోని లెమన్ గ్రీన్ రెస్టారెంట్లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు షార్ట్ సర్క్యూటే కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స కోసం రూ.50 వేలు అందజేస్తామన్నారు.
Crime
విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ డాన్స్ మాస్టర్ పండు తీవ్రంగా గాయపడ్డారు. భీమిలి మండలం తగరపువలసలో గ్రామదేవత ఉత్సవాల్లో పాల్గొని తిరుగు ప్రయాణంలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రహదారి పక్కన కారు ఆపి ముఖం కడుగుతున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కోళ్ల లోడుతో ఉన్న బొలెరో వాహనం పండును ఢీకొట్టి కారును కూడా గుద్దింది. ప్రమాదంలో పండుకు తీవ్ర గాయాలు కాగా, కారులోని ఇతరులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మైనర్ బాలిక అబార్షన్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. అమలాపురంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చట్టవిరుద్ధంగా జరిగిన ఈ అబార్షన్ ఉదంతంపై జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. జిల్లా కలెక్టర్ సంచలన ఆదేశాలతో.. అమలాపురం ‘ఉమెన్స్ కేర్ అండ్ జనరల్ హాస్పిటల్’లో అధికారుల ప్రత్యేక బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది.ఆర్డీవో మమ్మీ, డీఎంహెచ్వో దుర్గారావు, బాల హక్కుల కమిషన్ సభ్యురాలు నాగా మానస నేతృత్వంలోని ఉన్నతాధికారుల టీమ్ ఆసుపత్రిని జల్లెడ పడుతోంది. మైనర్ బాలికకు అబార్షన్ చేసిన వ్యవహారంలో హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ లంకె శిరీషను అధికారులు గదిలో వేసి సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. ఆసుపత్రి రికార్డులు, నిబంధనల ఉల్లంఘనలపై ఆరా తీస్తున్నారు.మరోవైపు ఈ ఘటనపై బాల హక్కుల కమిషన్ సభ్యురాలు నాగా మానస తీవ్రంగా స్పందించారు. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జనాభా పెరగాలని, పిల్లలను ఎక్కువ మందిని కనాలని పిలుపునిస్తుంటే.. ఇక్కడ మైనర్లకు అక్రమంగా అబార్షన్లు చేయడం అత్యంత దారుణమన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా సరే.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల అనంతరం నివేదికను కలెక్టర్కు సమర్పించనున్నారు.
33 ఏళ్ల క్రితం జరిగిన ఓ హత్యాయత్నం కేసులో సంచలన తీర్పు వెలువడింది. విచారణ సాగుతూ సాగుతూ మూడు దశాబ్దాలు దాటిన తర్వాత.. 84 ఏళ్ల వృద్ధుడిని కోర్టు దోషిగా తేల్చింది. ప్రస్తుతం సరిగా నడవలేని స్థితిలో ఉన్న ఆ వృద్ధుడికి కోర్టు ఎలాంటి శిక్ష విధిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీస్తోంది. 1992 నవంబర్ 10న వైశాలి జిల్లాలోని రాఘవ్పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. దీప్ రాయ్ కుటుంబ సభ్యులు అదాలత్ రాయ్ ఇంటి సమీపంలోని రోడ్డుపై గాజు పెంకులు వేయడంతో వివాదం చెలరేగింది. దీనిపై ప్రశ్నించిన అదాలత్ రాయ్, ఆయన భార్య రామ్శకీ దేవిపై దీప్ రాయ్ కుటుంబం దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 1993 మార్చిలో ఛార్జ్షీట్ దాఖలు చేయగా, 1999లో కోర్టు అభియోగాలు నమోదు చేసింది. అప్పటి నుంచి దాదాపు 30 ఏళ్లపాటు కేసు విచారణ కొనసాగింది. ఈ క్రమంలో నిందితుల్లో నలుగురు మరణించారు. కోర్టు మొత్తం పది మంది సాక్షులను విచారించింది.
అన్ని ఆధారాలను పరిశీలించిన అనంతరం కోర్టు తుది తీర్పును వెలువరించి, 84 ఏళ్ల దీప్ రాయ్ను దోషిగా నిర్ధారించింది. శిక్ష ఖరారు కోసం విచారణను జూన్ 2కి వాయిదా వేసింది. ప్రస్తుతం వృద్ధాప్యంతో ఇబ్బందులు పడుతున్న దీప్ రాయ్కు కోర్టు ఎలాంటి శిక్ష విధిస్తుందనే అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో కూడా ఈ కేసుపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ మూలాలున్న భారత సంతతి యువకుడు డేవ్ ఫిజీకి మే 29న జెస్నితో ఘనంగా వివాహం జరిగింది. పెళ్లి వేడుకలు ముగిసిన అనంతరం నూతన వధూవరులు హెలికాప్టర్లో అట్లాంటాకు బయల్దేరారు. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే హెలికాప్టర్ పర్వత ప్రాంతంలో కూలిపోయింది.ఈ ప్రమాదంలో ఎయిర్లైన్స్ పైలట్గా పనిచేస్తున్న డేవ్ ఫిజీతో పాటు హెలికాప్టర్ పైలట్ అక్కడికక్కడే మృతి చెందారు. వధువు జెస్ని శిథిలాల కింద చిక్కుకుపోయినప్పటికీ సహాయక బృందాలు ఆమెను సురక్షితంగా బయటకు తీశాయి.
వాతావరణం అనుకూలంగా లేదని, ప్రయాణం వాయిదా వేయాలని డేవ్ మొదట భావించినట్లు ఆయన తండ్రి జార్జ్ ఫిజీ వెల్లడించారు. అయితే తర్వాత ఎక్కువ ఎత్తులో ప్రయాణించాలని నిర్ణయించుకుని హెలికాప్టర్లో బయల్దేరినట్లు తెలిపారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టగా, ప్రాథమిక నివేదిక 30 రోజుల్లో విడుదల కానున్నట్లు వెల్లడించారు.
జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న థార్ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే గ్రామస్తులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఉన్న ఇద్దరు యువకులను సురక్షితంగా బయటకు తీసినా, అరుణ్ మాత్రం కారులోనే చిక్కుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు మూడు గంటలపాటు కష్టపడి బావిలో నుంచి కారును బయటకు తీశారు. అనంతరం కారులో చిక్కుకున్న అరుణ్ మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనతో మోరపెల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. దీంతో వెంటనే ఆటగాళ్లు, సహాయక సిబ్బంది బస్సులో నుంచి దిగిపోయారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా తొలుత పొగలు వచ్చాయి. వెంటనే ఆటగాళ్లు అలర్ట్ అయిపోయారు. బస్సు దిగిన తర్వాత మంటలు రేగాయి. కాసేపు రోడ్డుపైనే వేచి ఉన్న ప్లేయర్లు మరో బస్సులో తాము బస చేసిన హోటల్కు వెళ్లిపోయారు.
ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్కు ఓటమి ఎదురైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన తుది పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి కప్పును సొంతం చేసుకుంది. మ్యాచ్ అనంతరం గుజరాత్ ఆటగాళ్లు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఈశాన్య మయన్మార్ లో భారీ పేలుడు సంభవించింది. మైనింగ్ కోసం వినియోగించే పేలుడు పదార్థాలను నిల్వ ఉంచిన భవనంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగింది. ఈ భారీ పేలుడు కారణంగా 45 మందికి పైగా మరణించారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. అలాగే 75 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకూ 46 మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. ఈ అగ్ని ప్రమాదం కారణంగా స్థానికంగా 100 కుపైగా ఇళ్లు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.
చైనా సరిహద్దుకు దక్షిణంగా కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నామ్ కామ్ టౌన్ షిప్ లోని కౌంగ్ టూప్ గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ప్రాంతం ప్రస్తుతం మయన్మార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ అనే సాయుధ తిరుగుబాటు సమూహం ఆధీనంలో ఉంది.ప్రమాద సమయానికి ఈ భవనంలో పేలుడు పదార్థాలు ఉన్నప్పటికీ అసలు పేలుడు సంభవించడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామంలోని ఒక ఇటుక బట్టీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మట్టి లోడుతో వెళ్తున్న టిప్పర్ డంపింగ్ చేసే సమయంలో 11 కేవీ విద్యుత్ లైన్ను తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో టిప్పర్ పూర్తిగా దగ్ధమైంది. ఇటుక బట్టీలో పనిచేస్తున్న కార్మికులు వెంటనే మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.”.
నకిలీ జీఓలు, ఫోర్జరీ పత్రాలతో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని విక్రయించేందుకు యత్నించిన అంతర్రాష్ట్ర భూ దందా ముఠాను పోలీసులు ఛేదించారు. పోలీసులకు తహసీల్దార్ ఫిర్యాదు చేయడంతో భూదందా గుట్టు వెలుగులోకి వచ్చింది. గండిపేట పరిధిలోని సర్వే నెంబర్ 18లో గల ప్రభుత్వ పోరంబోకు భూమిపై నిమ్మల కుటుంబానికి చెందిన కొందరు వ్యక్తులు చట్టబద్ధమైన హక్కులు లేకపోయినా తమదేనంటూ క్లెయిమ్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో సదరు భూమి తమదేనంటూ వారు హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేశారు. అయితే, విచారణ అనంతరం అక్టోబర్ 2025లో వీరి పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.కోర్టులో చుక్కెదురైనప్పటికీ, నిందితులు వెనక్కి తగ్గకుండా ప్రభుత్వం ఈ భూమిని తమకు క్రమబద్ధీకరించిందంటూ ఏకంగా ఐదు నకిలీ జీఓలను (Fake GOs) సృష్టించారు. ఈ ఫేక్ జీఓలను వాట్సాప్, ఇతర సోషల్ మీడియా వేదికల్లో వైరల్ చేస్తూ ప్రచారం మొదలుపెట్టారు. దీనిపై సమాచారం అందుకున్న స్థానిక తహసీల్దార్ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ భారీ భూ మోసం వెలుగులోకి వచ్చింది.
()హైదరాబాద్లో గండిపేట భూకబ్జా యత్నం కేసు దర్యాప్తు వేగవంతమైంది. నకిలీ పత్రాలు, నకిలీ జీవోలను సృష్టించి ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న కీలక నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.నకిలీ పత్రాలు, నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు సృష్టించి భూమిపై హక్కులు పొందేందుకు ప్రయత్నించారన్న కోణంలో విచారణ కొనసాగుతోంది.ఈ వ్యవహారానికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
కేసులో ఇప్పటికే నిమ్మల రాజేష్, వేణుగోపాల్, సాయికిరణ్లను పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు.మరోవైపు కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్, సునీల్, రాధాకృష్ణ పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా, త్వరలోనే మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముందని తెలుస్తోంది.




Total views : 92030