శ్రీకాకుళం జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. విద్యార్థుల తల్లి తండ్రుల నుంచి విద్యాసంస్థల నిలువు దోపిడీ చేస్తున్నాయి . నిబంధనలకు విరుద్ధంగా, కనీస అనుమతులు లేకుండా పాఠశాలలు నిర్వహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న ఉదంతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ‘బ్రిలియంట్’ , ‘జే వై’ విద్యాసంస్థల వ్యవహారం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా శ్రీకాకుళం నగరం, సోంపేట తో పాటు జిల్లాలోని ఇతర ప్రధాన మండల కేంద్రాల్లో నడుస్తున్న జే వై విద్యాసంస్థలకు పూర్తిస్థాయిలో అనుమతులు లేవని స్వయంగా జిల్లా విద్యాశాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అదే విధంగా గత కొన్నేళ్లుగా బ్రిలియంట్ విద్యాసంస్థలను నడుపుతున్న యాజమాన్యం ఇప్పుడు జే వై సంస్థలతో కలిసి నడుస్తున్నామంటూ బహిరంగంగా ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయి. ఈ సంస్థల తీరుపై ఇప్పటికే డీఈఓ కార్యాలయ సిబ్బంది పలుమార్లు నోటీసులు జారీ చేసినా, యాజమాన్యాల్లో మార్పు రాకపోవడం గమనార్హం.
కొత్తూరులోని బ్రిలియంట్ స్కూల్ వ్యవహారంపై సివిఆర్ న్యూస్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి. హైస్కూల్ నిర్వహణకు ఎటువంటి గుర్తింపు లేకపోయినా, ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులతో పరీక్షలు రాయించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ సంతోష్ వెల్లడించారు. తమ ఒక్క స్కూలే కాదని జిల్లాలో చాలా పాఠశాలలు గుర్తింపు లేకుండానే పదో తరగతి బోధన సాగిస్తున్నాయని “అధికారులు లంచాల కోసమే తమకి రికగ్నైజేషన్ ఇవ్వడం లేదని చెప్పడం విస్మయానికి గురిచేస్తుంది . అధికారుల అవినీతిని సాకుగా చూపిస్తూ, వేల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెడుతున్న వైనం చూస్తే ఎవరైనా విస్తుపోవాల్సిందే
అనుమతులు లేని పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించి, రేపు సర్టిఫికేట్ల విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయేమోనని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించి, నిబంధనలు అతిక్రమించిన విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లి తండ్రులు కోరుతున్నారు. లేనిపక్షంలో మరిన్ని విద్యాసంస్థలు ఇదే బాటలో నడిచి వేలాది మంది విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టే ప్రమాదం ఉందని మేధావులు హెచ్చరిస్తున్నారు.





Total views : 46202