టీ20 అంతర్జాతీయ క్రికెట్లో సరికొత్త చరిత్ర లిఖితమైంది. బ్రెజిల్ మహిళల జట్టు కెప్టెన్ లారా కార్డోసో అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతో ప్రపంచ రికార్డు సృష్టించింది. బీసీఏ కలహారీ మహిళల టీ20ఐ టోర్నమెంట్ 2026లో భాగంగా లెసోతోతో జరిగిన మ్యాచ్లో ఆమె ఈ ఘనత సాధించింది. కార్డోసో కేవలం 3 ఓవర్లు బౌలింగ్ చేసి, 4 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 9 వికెట్లు పడగొట్టడం విశేషం.
ఈ అద్భుత ప్రదర్శనతో, పురుషులు, మహిళల టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్లో 9 వికెట్లు తీసిన తొలి క్రీడాకారిణిగా లారా కార్డోసో నిలిచింది. ఇంతకుముందు పురుషుల టీ20ల్లో సోనమ్ యేషే (8/7), మహిళల క్రికెట్లో రోమాలియా (7/0) పేరిట ఉన్న రికార్డులను ఆమె అధిగమించింది. తన రెండో ఓవర్లో హ్యాట్రిక్తో ప్రత్యర్థి పతనాన్ని శాసించిన కార్డోసో, ఆ తర్వాత ఓవర్లలోనూ వికెట్ల వేట కొనసాగించింది. ఆమె ధాటికి లెసోతో జట్టు కేవలం 6.2 ఓవర్లలో 13 పరుగులకే కుప్పకూలింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన బ్రెజిల్ జట్టు, రాబర్టా ఏవరీ (48), మోనిక్ మచాడో (69 నాటౌట్) రాణించడంతో 202 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లెసోతోను స్వల్ప స్కోరుకే కట్టడి చేసి 189 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నమెంట్లో బ్రెజిల్ జట్టు ఆద్యంతం అద్భుత ఫామ్లో కొనసాగుతోంది. గతంలో జాంబియాపై జరిగిన మ్యాచ్లోనూ 174 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్లో జాంబియాను 26 పరుగులకే ఆలౌట్ చేయడంలో మరియా రిబేరో 5 వికెట్లతో, కార్డోసో 3 వికెట్లతో కీలకపాత్ర పోషించారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణిస్తూ బ్రెజిల్ ఈ టోర్నీలో బలమైన శక్తిగా నిలుస్తోంది.
Sports
ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా టాటా ఐపీఎల్ 2026 సందడికి రంగం సిద్ధమైంది.
భాగ్యనగరంలో క్రికెట్ ఫీవర్ మొదలైంది. ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా టాటా ఐపీఎల్ 2026 సందడికి రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 5 నుంచి మే 22 వరకు జరిగే ఏడు కీలక మ్యాచ్ల కోసం భాగ్యనగరం ముస్తాబైంది. సుమారు 39 వేల మంది ప్రేక్షకులు తరలివస్తారని అంచనా వేస్తున్న వేళ.. పోలీసులు నగరంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇవాళ్ల మధ్యాహ్నం 12 గంటల నుంచే ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. వరంగల్ హైవే నుంచి వచ్చే భారీ వాహనాలను ఔటర్ రింగ్ రోడ్ మీదుగా మళ్లిస్తున్నారు. ఎల్బీ నగర్ నుంచి వచ్చే లారీలను నాగోల్ వైపు.. ఘట్కేసర్ వైపు నుంచి వచ్చే వాహనాలను బోడుప్పల్ వైపు దారి మళ్లిస్తూ రాచకొండ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
స్టేడియం లోపల, బయట కలిపి మొత్తం 2 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాలతో పాటు స్పెషల్ ఫోర్స్, బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి. 430 సీసీటీవీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ప్రతి మూలనూ నిశితంగా పరిశీలించనున్నారు. ముఖ్యంగా మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ నిరంతరం పహారా కాయనున్నాయి. మ్యాచ్ చూడటానికి వెళ్లే వారు నిబంధనలు పాటించాల్సిందే. ల్యాప్టాప్లు, కెమెరాలు, బ్యాగులు, వాటర్ బాటిళ్లు, బయటి ఆహార పదార్థాలను స్టేడియంలోకి అనుమతించబోమని పోలీసులు తేల్చి చెప్పారు. సిగరెట్లు, లైటర్లతో పాటు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని స్పష్టం చేశారు. కేవలం మొబైల్ ఫోన్లకు మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించారు.
పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టే ఉత్తమమని పోలీసులు సూచిస్తున్నారు. స్టేడియం సమీపంలో వాహనాల నిలుపుదలపై నిషేధం విధించిన నేపథ్యంలో.. ప్రేక్షకులు మెట్రో లేదా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని కోరుతున్నారు. మెట్రో రైళ్ల వేళలను కూడా మ్యాచ్ సమయానికి అనుగుణంగా పొడిగించేలా చర్యలు తీసుకుంటున్నారు.
టీమిండియా యువ ఆటగాడు, సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మకు IPL నుంచి షాక్ తగిలింది. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో నిబంధనలు ఉల్లంఘించినందుకు అతనిపై మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కూడా నమోదు చేశారు. అయితే, ఏ సందర్భంలో అనేది ఐపీఎల్ కమిటీ వెల్లడించలేదు. కానీ, తన క్యాచ్ విషయంలోనే అభిషేక్ అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. నిన్నటి మ్యాచ్లో ముజరబాని విసిరిన స్లో బంతిని భారీ షాట్ కోసం యత్నించాడు అభిషేక్. డీప్ స్క్వేర్ లెగ్ ఫీల్డర్ వరుణ్ చక్రవర్తి ఆ బంతిని పట్టుకున్నాడు. అయితే, ఆ క్యాచ్పై కాస్త అనుమానం ఉన్న ఫీల్డ్ అంపైర్లు దానిని థర్డ్ అంపైర్కు నివేదించారు. సమీక్షలో బంతిని వరుణ్ పట్టినట్లేనని భావించిన థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. దీనిపై అభిషేక్ తీవ్ర అసహనం వ్యక్తంచేశాడు. ఏవో కామెంట్లు చేసుకుంటూ వెళ్లడంతో మ్యాచ్ రిఫరీ అతడికి జరిమానా విధించాడు. అభిషేక్ శర్మ ఆర్టికల్ 2.3 కిందకు వచ్చే లెవల్ 1 నేరాన్ని అంగీకరించాడు. మ్యాచ్ రిఫరీ విధించిన దానిని స్వీకరించాడు. ఇక్కడ మ్యాచ్ రిఫరీ నిర్ణయమే ఫైనల్’’ అని ఐపీఎల్ స్పష్టం చేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ కేవలం 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 48 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాటింగ్తో అభిమానులను అలరించినప్పటికీ, మైదానంలో అతని ప్రవర్తన మాత్రం వివాదానికి దారితీసింది.
పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టింది. ఐపీఎల్ 2026లో భాగంగా జరిగిన నాలుగో మ్యాచ్ లో చివరి వరకు పోరాడి విక్టరీ కొట్టింది పంజాబ్ కింగ్స్. చండీగఢ్ వేదికగా పంజాబ్, గుజరాత్ మధ్య మ్యాచ్ జరగగా శ్రేయాస్ సేన అద్భుతంగా రాణించింది. ఈ నేపథ్యంలోనే గుజరాత్ పైన మూడు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ గెలుపొందింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్, 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు సాధించింది. అయితే ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పోరాడి మరి గెలిచింది పంజాబ్ కింగ్స్.
ఒకానొక సమయంలో 15 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్ అవుతుందని అందరు అనుకున్నారు. కానీ శ్రేయాస్ అయ్యర్ కు గాయమైన తర్వాత వికెట్ సమర్పించుకున్నాడు. అక్కడి నుంచి వరుసగా వికెట్ల పతనం మొదలైంది. దీంతో మ్యాచ్ మొత్తం గిల్ సేన చేతిలోకి వెళ్ళింది. ఈ క్రమంలోనే కాన్లీ 72 పరుగులతో పంజాబ్ కింగ్స్ ను ఆదుకున్నాడు. చివరి వరకు నిలబడి జట్టును గెలిపించాడు. ఈ క్రమంలోనే 19.1 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది పంజాబ్. దీంతో ఈ టోర్నమెంట్ లో తొలి విక్టరీ నమోదు చేసుకుంది.
ఐపీఎల్ 2026 సీజన్ రెండవ రోజు మ్యాచులో కోల్కతాపై ముంబై ఉత్కంఠ విజయం సాధించింది.
ఐపీఎల్ 2026 సీజన్ రెండవ రోజు మ్యాచులో కోల్కతాపై ముంబై ఉత్కంఠ విజయం సాధించింది. కాగా తొలుత టాస్ గెలిచి ముంబై బౌలింగ్ ఎంచుకోగా.. కేకేఆర్ బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో కోల్కతా 4 వికెట్లు కోల్పోయి 220 పరుగుల భారీ స్కోర్ చేసింది. అజింక్య రహానే (67), ఫిన్ అలెన్ (37), రఘువంశీ (51), రింకూ సింగ్ (33), గ్రీన్ (18) రాణించారు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు, హార్దిక్ ఒక వికెట్ తీశారు. అనంతరం 221 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన ముంబై 19.1 ఓవర్లలో 4 వికెట్స్ కోల్పోయి విజయాన్ని సొంతం చేసుకుంది. ముంబై బ్యాటర్లలో ర్యాన్ (81), రోహిత్ (78) తిలక్ (20) పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చారు. కోల్కతా బౌలర్లలో అనుకుల్, వైభవ్, కార్తీక్, సునిల్ తలా ఒక వికెట్ తీశారు. దీంతో ఈ సీజన్లో ముంబై బోణి తెరవగా.. కోల్కతా మొదటి మ్యాచులోనే ఓటమి చవి చూసింది.
ఐపీఎల్ 19వ సీజన్కు వేళైంది. అసలు సిసలు టీ20 మజాను అందించేందుకు పది జట్లు సై అంటున్నాయి. ఇవాళ బెంగళూరు-సన్రైజర్స్ మ్యాచ్తో లీగ్ ఆరంభం కాబోతోంది. పదేళ్ల ముందు ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన సన్రైజర్స్, రెండో కప్పు గెలవాలని పట్టుదలతో ఉండగా.. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ నిరుడు ఐపీఎల్ టైటిల్ కలను నెరవేర్చుకున్న ఆర్సీబీ, ట్రోఫీని నిలబెట్టుకోవాలని చూస్తోంది. రికార్డు స్థాయిలో అయిదు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన చెన్నై సూపర్కింగ్స్, ముంబయి ఇండియన్స్.. ఒకప్పటి ఆధిపత్యాన్ని చూపించాలని, తమ టైటిళ్ల ఖజానాకు మరో ట్రోఫీని జత చేయాలనే పట్టుదలతో ఉన్నాయి. రహానె నేతృత్వంలోని కోల్కతా గత ఏడాది పేలవ ప్రదర్శనను అధిగమించి, నాలుగో టైటిల్పై గురి పెట్టింది. కొత్త కెప్టెన్ రియాన్ పరాగ్ నాయకత్వంలో పుంజుకోవాలని రాజస్థాన్ రాయల్స్ చూస్తోంది. నిరుడు జట్టు రాతను మార్చి ఫైనల్కు చేర్చిన శ్రేయస్ అయ్యర్.. ఈసారి తమకు తొలి కప్పు అందిస్తాడని పంజాబ్ ఆశిస్తోంది. అక్షర్ సారథ్యంలోని దిల్లీ, పంత్ నాయకత్వంలోనిని లఖ్నవూ జట్లు కూడా ఐపీఎల్ ట్రోఫీ కలను నెరవేర్చుకోవాలన్న ఆశతో ఉన్నాయి. లీగ్లో అడుగు పెట్టిన తొలి ఏడాదే టైటిల్ నెగ్గి.. ఆ తర్వాత కూడా నిలకడగా రాణిస్తున్న గుజరాత్ టైటాన్స్.. శుభ్మన్ గిల్ సారథ్యంలో మరోసారి మెరుగైన ప్రదర్శన చేయాలని చూస్తోంది. గతేడాది ఆర్సీబీ విజయోత్సవాల్లో చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మరణించారు. ఈ నేపథ్యంలో వారికి సంతాప సూచకంగా ఈసారి ఐపీఎల్ ఆరంభోత్సవాన్ని నిర్వహించట్లేదు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ చేతులు మారింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ చేతులు మారింది. ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం ఈ జట్టును 1.78 బిలియన్ డాలర్లకు అంటే..సుమారు రూ. 16,725 కోట్లకు కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ఆదిత్య బిర్లా, టైమ్స్ గ్రూప్లతో పాటు బోల్ట్ వెంచర్స్, బ్లాక్స్టోన్ సంస్థలు ఈ కన్సార్టియంలో భాగస్వాములుగా ఉన్నాయి. ఆర్సీబీ ఫ్రాంచైజీలో 100 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ తో ఈ కన్సార్టియం ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ డీల్లో ఐపీఎల్ పురుషుల జట్టుతో పాటు, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మహిళల జట్టు కూడా ఉన్నాయి. కొత్త యాజమాన్యంలో భాగంగా ఆదిత్య బిర్లా గ్రూప్ డైరెక్టర్ ఆర్యమన్ విక్రమ్ బిర్లా చైర్మన్గా, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్కు చెందిన సత్యన్ గజ్వానీ వైస్ చైర్మన్గా వ్యవహరించనున్నారు. అయితే, ఈ కొనుగోలుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి , ఐపీఎల్, డబ్ల్యూపీఎల్ పాలకమండలుల నుంచి అధికారిక అనుమతులు లభించాల్సి ఉంది.కొన్ని నెలల క్రితం ఆర్సీబీ మాతృసంస్థ డయాజియో పీఎల్సీ ఈ ఫ్రాంచైజీని అమ్మకానికి పెట్టింది. కాగా, ఒకే సమయంలో ఐపీఎల్ (2025), డబ్ల్యూపీఎల్ (2026) టైటిళ్లను గెలుచుకున్న ఏకైక ఫ్రాంచైజీగా ఆర్సీబీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో విజయ్ మాల్యా ఈ ఫ్రాంచైజీని సొంతం చేసుకోగా, యునైటెడ్ స్పిరిట్స్ సంస్థను డయాజియో టేకోవర్ చేయడంతో ఆర్సీబీ యాజమాన్య హక్కులు బదిలీ అయ్యాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీమిండియా ఆల్ రౌండర్ తిలక్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీమిండియా ఆల్ రౌండర్ తిలక్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. టీ20 క్రికెట్ వరల్డ్ కప్-2026 ఘనవిజయం సాధించిన తర్వాత హైదరాబాద్కు చేరుకున్న తిలక్ వర్మ జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకుని ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీహరి, మహమ్మద్ అజారుద్దీన్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, టీ20 ప్రపంచకప్లో అద్భుతంగా రాణించారు. గ్రూప్ దశలో భాగంగా జరిగిన ఒక కీలక మ్యాచ్లో, టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు తిలక్ వర్మ నిలకడగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో తిలక్ వర్మకు కాంగ్రెస్ సర్కార్ నుంచి భారీ బహుమతి లభించనున్నట్లు క్రీడా వర్గాల్లో వార్తలు షికారు చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి టీ20 ప్రపంచకప్ విజయంలో భాగమైన తిలక్ వర్మ, సిరాజ్లను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించనున్నట్లు తెలుస్తోంది. సిరాజ్కు గతంలోనే భారీ రివార్డ్ ప్రకటించిన నేపథ్యంలో తిలక్ వర్మకు ఈ సారి భారీ నజరానాతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ విషయాలు అధికారికంగా వెల్లడి కాకపోయినా.. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్రికెట్ లవర్స్కు BCCI గుడ్ న్యూస్ చెప్పింది. IPL-2026 తొలి మ్యాచ్ వివరాలను అధికారికంగా ప్రకటించింది. మార్చి 28 నుంచి ఈ మెగా టోర్నీకి ప్రారంభం కానుంది. మొదట మార్చి 26వ తేదీన ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ప్రారంభమవుతుందని ప్రచారం జరిగింది. కానీ పలు రాష్ట్రాల్లో ఎన్నికల దృష్ట్యా షెడ్యూల్ విడుదల కాస్త ఆలస్యమైంది. అయితే ఎన్నడూ లేని విధంగా సరికొత్తంగా ఈ సీజన్కు తెరలేవనుంది. ఈసారి రెండు గ్రూప్ల్లో ఈ టోర్నీని నిర్వహించనున్నారు. ప్రస్తుతానికి 20 మ్యాచ్లకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు. ఏప్రిల్ 12 వరకు ఇవి కొనసాగనున్నాయి. మార్చ్ 28న ఈ సీజన్ తొలి మ్యాచ్ జరగనుండగా.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30 లకు RCB, హైదరాబాద్ సన్ రైజర్స్ జట్లు తలపడనున్నాయి. సెకండ్ మ్యాచ్ మార్చ్ 29వ తేదీన ముంబై వేదికగాKKR వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య రెండో మ్యాచ్ ఉంటుంది. మొదటి దశ షెడ్యూల్లో ఆడే 10 జట్లు, తలో నాలుగు మ్యాచ్లు ఆడబోతున్నాయి.
ధనాధన్ క్రికెట్ పండుగ ముగిసింది. కోట్లాది మంది భారతీయుల కల నెరవేరింది. నరేంద్ర మోడీ స్టేడియం సాక్షిగా టీమ్ఇండియా మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో న్యూజిలాండ్ను చిత్తు చేసిన సూర్యకుమార్ సేన, ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 ట్రోఫీని సగర్వంగా ముద్దాడింది. తద్వారా 2024లో సాధించిన టైటిల్ను నిలబెట్టుకుని, పొట్టి ఫార్మాట్లో తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 255 భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్, అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వగా, ఇషాన్ కిషన్ అర్థ శతకంతో చివర్లో హార్దిక్ పాండ్య, శివమ్ దూబే మెరుపులు మెరిపించారు. అనంతరం లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ను భారత బౌలర్లు కట్టడి చేశారు. జస్ప్రీత్ బుమ్రా తన పదునైన బంతులతో, అక్షర పటేల్ తన స్పిన్ మాయాజాలంతో కివీస్ నడ్డి విరవగా, కీలక సమయాల్లో వికెట్లు తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. 2024 తర్వాత వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ను గెలుచుకున్న జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది.
సూర్యకుమార్ యాదవ్ తన కెప్టెన్సీలో భారత్కు తొలి మేజర్ ఐసీసీ ట్రోఫీని అందించారు. ఫైనల్ మ్యాచ్లో యువ బ్యాటర్ అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ మెరుపు అర్ధశతకంతో ఆకట్టుకున్నారు.
ఈ విజయంపై దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. పలువురు ప్రముఖులు టీమ్ఇండియాకు అభినందనలు తెలిపారు. “ఇది భారత క్రికెట్ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం” అని క్రీడా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మరోసారి చరిత్రను తిరగరాసింది. గుజరాత్లోని అహ్మదాబాద్, నరేంద్ర మోడీ స్టేడియంలో లక్షలాది మంది అభిమానుల జయజయధ్వానాల మధ్య భారత్ ప్రపంచ క్రికెట్ శిఖరాన్ని అధిరోహించింది. ఆదివారం జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరులో న్యూజిలాండ్పై టీమిండియా ఘన విజయం సాధించి, విశ్వవిజేతగా నిలిచింది. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ భారత్కు దక్కడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. మొత్తంగా భారత్ మూడు టీ20 ప్రపంచకప్లు సాధించడం గమనార్హం.
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత ఓపెనర్ సంజూ శాంసన్ వీరోచిత ప్రదర్శన చేశారు. 46 బంతుల్లో 89 పరుగులు చేశారు. ఆ తర్వాత అభిషేక్, ఇషాన్ కిషన్ కూడా హాఫ్ సెంచరీలతో రాణించారు. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 256 పరుగుల భారీ స్కోరు సాధించింది. కివీస్ బౌలర్లలో నీషమ్ మూడు, రచిన్ రవీంద్ర, హెన్రీ ఒక వికెట్ తీశారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ తమ పదునైన బౌలింగ్తో ఆరంభంలోనే వికెట్లు తీశారు. ఒత్తిడిలో వరుసగా వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్, భారత బౌలింగ్ ధాటికి నిలవలేక ఓటమిని అంగీకరించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో సీఫెర్ట్ (52), కెప్టెన్ శాంట్నర్ (43) తప్ప ఎవరూ రాణించలేదు. మొత్తంగా 19 ఓవర్లలో 159 పరుగులు చేసి న్యూజిలాండ్ జట్టు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో బూమ్రా నాలుగు, అక్షర్ మూడు, వరుణ్, హార్దిక్, అభిషేక్ తలో వికెట్ తీశారు.
విజయం ఖరారైన క్షణంలో స్టేడియం మొత్తం బాణసంచా వెలుగులతో, ‘చక్ దే ఇండియా’ నినాదాలతో హోరెత్తిపోయింది. రోహిత్ శర్మ నుండి సారథ్య బాధ్యతలు స్నేహపూర్వకంగా అందుకున్న సూర్యకుమార్ యాదవ్, తన మొదటి మేజర్ టోర్నీలోనే జట్టును ఛాంపియన్గా నిలబెట్టి రికార్డు సృష్టించారు. “ఇది జట్టు సమిష్టి కృషి. ఆటగాళ్లకు ఇచ్చిన స్వేచ్ఛే ఈ రోజు మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టింది. ఈ కప్పు దేశ ప్రజలందరికీ అంకితం” అని గెలుపు అనంతరం భావోద్వేగంతో కెప్టెన్ సూర్య వ్యాఖ్యానించారు. ఈ విజయంతో భారత్ మూడోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకుని, పొట్టి ఫార్మాట్లో తమ ఆధిపత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది.
డిఫెండింగ్ ఛాంపియన్ టీమ్ఇండియా మూడోసారి ట్రోఫీని దక్కించుకొని చరిత్ర సృష్టించింది. మరే జట్టు కూడా మూడు టైటిళ్లను గెలుచుకోలేదు. ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ తర్వాత భారత్కు కప్ అందించిన సారథిగా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. ఆతిథ్య జట్టు స్వదేశంలో ట్రోఫీ గెలవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.



Total views : 38420