తెలుగు రాష్ట్రాల ఆవిర్భావానికి 12 ఏళ్లు పూర్తికావడం ఓ చారిత్రక ఘట్టమని రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ, తెలుగు జాతి హృదయం ఎప్పటికీ ఒకటే. పరిపాలనా హద్దులు మారినప్పటికీ, మన సంస్కృతి, మన గౌరవం ఎప్పటికీ తగ్గదని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రతి తెలుగు కుటుంబానికి నాణ్యమైన వైద్యం, మెరుగైన జీవన ప్రమాణాలు అందేలా చేయడం లక్ష్యమన్నారు. హైదరాబాద్ మరింత అంతర్జాతీయ ఖ్యాతిని గడించాలనీ.. అమరావతి నూతన భారతానికి ప్రతీకగా ప్రపంచ స్థాయి రాజధానిగా అవతరించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
వికసిత్ భారత్-2047 సాధనలో తెలుగు రాష్ట్రాలు మార్గదర్శక శక్తులుగా ఎదగాలని పిలుపు ఇచ్చారు. తెలుగు జాతి ఐక్యత, కృషి, జ్ఞానం, సంకల్పమే మన భవిష్యత్తు విజయాలకు పునాది అన్నారు. తెలుగు గౌరవాన్ని, సంస్కృతిని, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదన్నారు.
Politics
రాజకీయాల్లో నేతలు కండువాలు మార్చడం అనే ట్రెండు… ఇప్పుడు కామన్ అయిపోయింది….! ఎట్ ది సేమ్ టైం ఫాలోయర్స్ కూడా నాయకులను బ్లైండ్ గా ఫాలో అయిపోతున్నారు…. దీంతో నేతలకు పార్టీలు కండరాలు మార్చటం మంచినీళ్లు ప్రాయంగా మారిపోయింది… నెల్లూరు జిల్లాలో ఆ నేత ఐదు సార్లు ఎమ్మెల్యే…, ఓసారి మంత్రిగా కూడా కొనసాగారు . ఆయన ప్రస్తుతం ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు…? ప్రత్యర్థి బలమైన క్యాష్ పార్టీ అనో ….లేక ప్రత్యర్థికి కౌంటర్ ఇవ్వలేక సైలెంట్ అవుతున్నాడా?…. టోటల్ గా సైలెంట్ వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి…? ఇంతకీ ఎవరా నేత ? ఈ స్టోరీ లో చూద్దాం
ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో నల్లపురెడ్డి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది . ముఖ్యంగా కోవూరు నియోజకవర్గంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక బలమైన రాజకీయ నేతగా ఎదిగారు . ఐదు సార్లు ప్రజాప్రతినిధిగా కోవూరు కు ప్రాతినిధ్యం వహించిన ఆయన, తన తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాస రెడ్డి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ నియోజకవర్గంలో గట్టి పట్టు సాధించారు. అయితే ఇటీవల కాలంలో ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో వేడెక్కుతోంది. ఒకప్పుడు ప్రజల మధ్య నిరంతరం కనిపించే నాయకుడిగా ఉన్న ఆయన, ఇప్పుడు పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం లేదని , స్థానిక సమస్యలపై పెద్దగా స్పందించడం లేదని కేడర్ వైసిపి అంటోంది . ఈ పరిణామం కోవూరు రాజకీయాల్లో కొత్త రాజకీయ అనిశ్చితిని తీసుకువచ్చిందా అనే ప్రశ్నలు వస్తున్నాయి . ప్రసన్న మౌనం వెనుక వ్యూహం ఉందా లేక రాజకీయాల్లో వెనక్కి తగ్గుతున్న సంకేతమా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇదే సమయంలో కోవూరు నియోజకవర్గ భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై కూడా చర్చలు జోరందుకున్నాయి. నియోజకవర్గం మహిళా రిజర్వేషన్గా మారే అవకాశం ఉందనే ప్రచారం జిల్లాలో రాజకీయ వేడి పెంచుతోంది. అదే నిజమైతే, నల్లపురెడ్డి కుటుంబ రాజకీయ వ్యూహంలో పెద్ద మార్పులు రావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి భవిష్యత్ రాజకీయ ప్రస్థానంపై ఈ పరిణామాలు ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు, ఆయన వెంకటగిరి వైపు షిఫ్ట్ అవుతారనే చర్చ కూడా వినిపిస్తోంది. నల్లపు రెడ్డి కుటుంబానికి అక్కడ కూడా గతంలో బలమైన రాజకీయ పునాదులు ఉన్నాయని రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. కొత్త తరం నాయకత్వం, మారుతున్న స్థానిక రాజకీయ సమీకరణాలు కోవూరు రాజకీయాలను కొత్త దిశగా మలుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రసన్న మళ్లీ యాక్టివ్ అవుతారా లేదా తాత్కాలిక మౌనానికే పరిమితం అవుతారా అన్నది ఇప్పుడు జిల్లాలో ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది. మున్ముందు ఏమి జరుగుతుందో చుడాలిమరి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ద్వారా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులకు ప్రభుత్వ సహకారంతో బ్యాంకుల ద్వారా మంజూరైన 2 కోట్ల 7 లక్షల 50 వేల రూపాయల రుణ చెక్కులను ఎమ్మెల్యే శ్రీగణేష్ లబ్ధిదారులకు అందజేశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి మహా సంకల్పానికి కంటోన్మెంట్ నుండి శ్రీకారం చుడుతున్నామని, ఈ రుణాలు అప్పులు కావు – ఆడబిడ్డల ఆత్మగౌరవానికి సీఎం ఇస్తున్న పెట్టుబడులన్నారు. వీటిని ఇంటి ఖర్చులకు కాకుండా వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించడానికి వినియోగించాలని, సహాయం తీసుకునే స్థాయి నుండి సహాయం చేసే స్థాయికి ఎదగాలన్నారు. పన్నులు కట్టే శక్తిగా మహిళలు ఎదగాలని ఇదే ముఖ్యమంత్రి విజన్ అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను వ్యాపారవేత్తలు గా తీర్చి దిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతోందన్నారు.. ప్రభుత్వం ఆడబిడ్డలకు అందిస్తున్న చీరెల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గణేశ్ ప్రారంభించారు. ఇది కేవలం చీర కాదు – తెలంగాణ ఆడబిడ్డలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న గౌరవానికి, ప్రేమకు నిదర్శనం అని ఎమ్మెల్యే అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రతి పథకం పారదర్శకంగా, ప్రతి రూపాయి లబ్ధిదారుడికి చేరుతోందన్నారు. కంటోన్మెంట్ నుండి కోటీశ్వరులైన మహిళలను తయారు చేసి సీఎం ముందు నిలబెడతామని ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు.
ఇవాళ కాకినాడ జిల్లా తుని మండలం చామవరం గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ అధికారులు విడుదల చేసారు . ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరతారు .ఉదయం 10:50 నిమిషాలకి చామవరం గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు .అక్కడ సీఎం చంద్రబాబుకి ముఖ్య నేతలు, అధికారులు స్వాగతం పలుకుతారు. హెలిప్యాడ్ వద్ద నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11 గంటలకు చామవరం దగ్గర ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్దకు చేరుకుంటారు .11 గంటల నుంచి 12.40 వరకు చంద్రబాబు ప్రజా వేదిక వద్ద ప్రజలతో మమేకమవుతారు, ప్రజా సమస్యలను తెలుసుకుంటారు . 2:00 గంటలకు చంద్రబాబు చామవరం గ్రామానికి వెళ్తారు. గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందిస్తారు . 2:40 నిమిషాలకు పార్టీ శ్రేణులతో సమావేశం అవుతారు . 4:15కి తిరిగి హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు .అక్కడ నుంచి ఉండవల్లిలోని ఆయన నివాసానికి వెళతారు.సీఎం పర్యటన సాఫీగా జరగడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేసారు .
అమరావతి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్, ఏడీసీ అధికారులు, సీఆర్డీఏ మరియు ఇతర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులు, అభివృద్ధి ప్రాజెక్టులు , భవిష్యత్ ప్రతిపాదనలపై విస్తృతంగా చర్చ జరిగింది. అమరావతి అభివృద్ధిని వేగవంతం చేయడం, మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ పురోగతి వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై సంబంధిత శాఖలకు దిశానిర్దేశం చేశారు. రాజధాని అభివృద్ధిని సమగ్ర ప్రణాళికతో ముందుకు తీసుకెళ్లాలని సీఎం సూచించారు.
తెలంగాణ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణాల్లో ఇకపై ప్రతిసారి ఒరిజినల్ ఐడీ కార్డులు చూపించాల్సిన అవసరం లేకుండా “మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు” జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.ప్రస్తుతం ఉచిత బస్సు ప్రయాణాల కోసం మహిళలు ప్రతి సారి ఆధార్ లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులు చూపించాల్సి వస్తుండగా… ఇకపై ఆ అవసరం తగ్గనుంది. “మహాలక్ష్మి స్మార్ట్ కార్డు” ద్వారా కేవలం కార్డు స్కాన్ చేస్తే సరిపోతుంది.
ఈ పథకాన్ని తొలుత ప్రయోగాత్మకంగా జిల్లాకు ఒక మండలంలో ప్రారంభించి.. అక్కడ ఎదురయ్యే సాంకేతిక సమస్యలను పరిశీలించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. అర్హులైన మహిళలు సమీప బస్ పాస్ కేంద్రాలు లేదా మీ సేవా కేంద్రాల్లో రూ.50 నామినల్ ఫీజుతో ఈ కార్డులను పొందవచ్చు.స్మార్ట్ కార్డులు అందుబాటులోకి వచ్చే వరకు ప్రస్తుతం అమల్లో ఉన్న విధంగానే ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డులతో ఉచిత ప్రయాణం కొనసాగుతుంది. ఈ విధానం వల్ల కండక్టర్ల తనిఖీ ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు మహిళలకు కూడా మరింత సౌకర్యం కలగనుంది.
తెలంగాణలో వ్యవసాయ రంగానికి ప్రత్యేకంగా సేవలందించేందుకు ఏర్పాటు చేసిన కొత్త “రైతు డిస్కం” జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధికారికంగా ప్రారంభం కానుంది. పూర్తిస్థాయి సిబ్బందితో ఈ సంస్థ సేవలు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. తాజాగా రైతు డిస్కంకు సంబంధించిన అధికారిక లోగోను కూడా విడుదల చేశారు. లోగోలో సౌర, జల, పవన విద్యుత్ చిహ్నాలతో పాటు వ్యవసాయ పంటల నేపథ్యాన్ని ప్రతిబింబించేలా రూపకల్పన చేశారు. ఈ సంస్థకు సీఎండీగా ముషారఫ్ ఫరూఖీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ఉత్తర, దక్షిణ డిస్కంల పరిధిలోని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్లను ప్రత్యేకంగా వేరు చేసి రైతు డిస్కం పరిధిలోకి తీసుకువచ్చారు. గత ఐదేళ్ల విద్యుత్ వినియోగ గణాంకాల ఆధారంగా కొత్త డిస్కంకు మొత్తం విద్యుత్ పంపిణీలో 42 శాతం వాటాను ప్రభుత్వం కేటాయించింది.వ్యవసాయ విద్యుత్ సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు రైతు డిస్కం ప్రత్యేక మొబైల్ యాప్ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా ట్రాన్స్ఫార్మర్ల ఖచ్చితమైన వివరాలు, వాటి స్థానాలను డిజిటల్ రూపంలో నమోదు చేస్తున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధికారులు సర్వే ప్రక్రియను వేగవంతం చేశారు.
రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా ‘సమగ్ర సంక్షేమ కార్డును రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏ పౌరుడికి ఏ శాఖ ద్వారా, ఏ పథకం కింద, ఎంత మేర లబ్ధి చేకూరుతోందో ఈ కార్డ్ ద్వారా స్పష్టంగా తెలిసేలా ఉండాలని సూచించారు. తక్షణమే అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, అన్ని శాఖల నుంచి లబ్ధిదారుల డేటాను సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎస్ రామకృష్ణారావు, సీఎం స్పెషల్ సెక్రటరీ బి.అజిత్ రెడ్డి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి తదితర ఉన్నతాధికారులతో సీఎం ఈ విషయాన్ని ప్రత్యేకంగా సమీక్షించారు. సమగ్ర సంక్షేమ కార్డ్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడి పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఒకేచోట అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ డేటాను అన్ని కోణాల్లో ఏఐ సహాయంతో విశ్లేషిస్తే సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుందన్నారు. నిజమైన అర్హులకు పథకాలు మరింత ఖచ్చితంగా చేరుతాయన్నారు. అదే సమయంలో అనర్హులను గుర్తించడం సులభమవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతి శాఖ వేర్వేరుగా కార్డులు ఇచ్చే పద్ధతికి బదులు, ఐటీ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర సంక్షేమ కార్డ్ ఉండాలని సీఎం సూచించారు. టెక్నాలజీపై పట్టున్న, చురుగ్గా పనిచేసే యువ ప్రభుత్వ అధికారులను ఈ ప్రక్రియకు వినియోగించాలని చెప్పారు.
కేరళ నుంచి గల్ఫ్కు వలస వెళ్లే ఉద్యోగులకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలతో పాటు, పాస్పోర్ట్లు, వీసాల జారీకి సంబంధించిన సమాచారం ఒకేచోట అందుబాటులో ఉంచితే, అనధికార ఏజెంట్ల ప్రమేయం తగ్గుతుందని సీఎం తెలిపారు. పేదలకు సంక్షేమ ఫలాలు ఖచ్చితంగా చేరేలా, ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం ప్రభావాన్ని అంచనా వేసేలా సమగ్ర సంక్షేమ కార్డ్ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు దిశగా మరో కీలక అడుగు పడింది. అస్సాం శాసనసభ ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు అధికారికంగా ఆమోదం తెలిపింది. దీంతో దేశంలో ఈ చట్టాన్ని ఆమోదించిన రాష్ట్రాల జాబితాలో ఉత్తరాఖండ్, గుజరాత్ల తర్వాత అస్సాం మూడో రాష్ట్రంగా నిలిచింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-44 ప్రకారం.. దేశంలోని పౌరులందరికీ ఒకే విధమైన పౌర చట్టాన్ని వర్తింపజేయాలనేది ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం. మతం, కులం, వర్గంతో సంబంధం లేకుండా వివాహం, విడాకులు, ఆస్తి వారసత్వం, దత్తత వంటి వ్యక్తిగత విషయాలలో రాష్ట్రంలోని ప్రజలందరికీ ఇకపై ఒకే చట్టం వర్తించనుంది. గతంలో ఉత్తరాఖండ్, గుజరాత్ రాష్ట్రాలు ఈ బిల్లును ఆమోదించగా, ఇప్పుడు అస్సాం కూడా ఆ బాటలోనే పయనిస్తూ దేశంలో చర్చకు తెరలేపింది.
టీడీపీ పసుపు పండుగ మహానాడు హైబ్రిడ్ విధానంలో అట్టహాసంగా కొనసాగుతుంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత చంద్రబాబు తెలుగుదేశం జెండా ఆవిష్కరించి, ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ , పొలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. 1875 క్లస్టర్ల నుండి వేలాదిమంది కార్యకర్తలు ఈసారి మహానాడును హైబ్రిడ్ విధానం ద్వారా వీక్షించారు. ముఖ్య నాయకుల స్పీచ్లను హైబ్రిడ్ విధానంలో 175 నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలు ఈసారి ఆన్లైన్లోనే విన్నారు. దానికి సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అన్ని ఏర్పాట్లు చేశారు.
స్థానిక ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశించారు. ఏ ఎన్నికలైనా గెలుపే ప్రధానమని స్పష్టంచేశారు. గెలుపే ధ్యేయంగా నేతలు, కార్యకర్తలు పని చేయాలని, ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూ ముందుకు సాగాలన్నారు. ఎవరూ ఇగోలకు వెళ్లొద్దని చంద్రబాబు హితవు పలికారు. మిత్ర పక్షాలతో సఖ్యతతోనూ.. సమన్వయంతో ముందుకు వెళ్దామని దిశానిర్దేశంచేశారు. 2024 ఎన్నికల్లో సాధించిన విజయం మళ్లీ రిపీట్ అయ్యేలా అందరం మమేకం అవుదామన్నారు. స్పెషల్ రివిజన్లో భాగంగా ఓట్ల నమోదు విషయంలో లీడర్లు, కేడర్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
తెలుగుదేశం బలం బలగం కేడర్ అన్న చంద్రబాబు.. ఏదైనా పార్టీ ఫస్ట్, కేడరే ముందని తెలిపారు. నాయకులను తయారు చేసే విశ్వవిద్యాలయం తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ఇక్కడ చదువుకున్న, శిక్షణ పొందిన నాయకులే అన్ని చోట్లా రాణిస్తున్నారని గుర్తుచేశారు. సోషల్ రీ ఇంజినీరింగ్ చేయటమే పార్టీ విధానమని తెలిపారు. అందరికీ అవకాశాలు కల్పించటమే పార్టీ లక్ష్యమని తెలిపారు. పార్టీ అధినేతగా.. పార్టీ కుటుంబసభ్యులైన కార్యకర్తల ఎంపవర్మెంట్ కోసం నిరంతరం పనిచేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
తెలుగుదేశం పార్టీలో ఇకపై మహిళలకు 33శాతం సీట్లు కేటాయిస్తామని కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. పార్లమెంట్లో బిల్లు పాసైనా… అవ్వకపోయినా పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33శాతం సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. బిగ్ అనౌన్స్మెంట్ అని ఉదయం పెట్టిన పోస్టుకు అనుగుణంగా తన ప్రసంగంలో మహిళలకు రిజర్వేషన్ అంశాన్ని నారా లోకేశ్ ప్రకటించారు. మహానాడు ఆఫ్లైన్ అయినా, హైబ్రిడ్ మోడల్ అయినా టీమ్ 11కి బ్యాటింగ్ తప్పదని మంత్రి నారా లోకేశ్ హెచ్చరించారు. వైఎస్ వివేకానందారెడ్డి హత్యపై మండిపడ్డారు. బాబాయిని గొడ్డలితో చంపింది నిజం కాదా? అని, అందుకే వాళ్లది గొడ్డలి పార్టీ అని లోకేశ్ విమర్శించారు. టెన్త్ క్లాస్ పేపర్ కొట్టేసిన చరిత్ర సైకోదని, తనది స్టాన్ఫోర్డ్ హిస్టరీ అని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. పార్లమెంటులో బిల్లు పాసైనా, అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ తరపున వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33శాతం సీట్లు కేటాయిస్తామన్నారు. ఈ మేరకు మహానాడులో తీర్మానం ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. ఇది తమ సంకల్పమని, తమ బాధ్యత, తమ కమిట్ మెంట్ అని వ్యాఖ్యానించారు. టైమ్, డేట్ ఫిక్స్ చేస్తే అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు సిద్ధమని మంత్రి లోకేశ్ సవాల్ విసిరారు.
టీడీపీ నాయకులు, కార్యకర్తలంతా ఐక్యతను చాటుకునే వేదిక మహానాడు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. మహానాడు ప్రారంభం సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు.. ఇప్పటి వరకూ పార్టీ ప్రయాణం, భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇతర అంశాలను ఈ వేదిక ద్వారా చర్చించుకుందామన్నారు. హైబ్రిడ్ విధానంలో మహానాడు 2026 ద్వారా లక్షల సంఖ్యలో నేతలు, కార్యకర్తలు అనుసంధానమై ఉన్నారని తెలిపారు. దేశంలో వివిధ రాజకీయ పార్టీలు వచ్చి కాలగర్భంలో కలిసి పోయాయని, టీడీపీ ఒక్కటే నిత్యచైతన్యంతో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలందరికీ అవకాశాలు కల్పిస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన 23 నెలల్లోనే అన్ని నామినేటెడ్ పదవులూ కార్యకర్తలకు ఇచ్చామని, భవిష్యత్తులోనూ ఇంకా వస్తాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేలా ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్-2047 రూపొందించారన్నారు.
అణచి వేసే ప్రయత్నం చేస్తే తెలుగుదేశం పార్టీలో యోధులు పుట్టుకొస్తారని గొడ్డలిపార్టీకి అర్థమై ఉంటుందని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి వ్యాఖ్యానించారు. గొడ్డలి పార్టీకి లోకేశ్ తన పాదయాత్రలో ట్రైలర్ చూపిస్తే.. ఆ తర్వాత ఎన్నికల్లో ప్రజలు సినిమా చూపించారన్నారు. ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నివేదికను బైరెడ్డి శబరి సమర్పించారు. రాజకీయ ప్రత్యర్థి జిత్తుల మారి నక్క.. కార్యకర్తల డేగ కన్నుతో నిఘా పెట్టాలి… నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. సంక్షేమంతోపాటు అభివృద్ధిలోనూ టీడీపీ ముందంజలో ఉందని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా నారా లోకేశ్ కృషి చేస్తున్నారన్నారు. అండమాన్లోనూ టీడీపీ జెండా రెపరెపలాడుతోందని ప్రశంసించారు.



Total views : 92044