భాగ్యనగరంలో కల్తీగాళ్ల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అపరిశుభ్రత వాతావరణంలో వంటలు చేస్తూ..ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. జుగుప్సాకరంగా కన్పించే దృశ్యాలు చూస్తే..కడుపులో పేగులు బయటపడాల్సిందే..కానీ అవేమీ చూడకుండా పాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఆరగిస్తే..అంతే సంగతులు..ఈ విషయమై అప్రమత్తమైన ఫుడ్ సేఫ్టీ అధికారులు నగరంలో నిరంతరం దాడులు నిర్వహిస్తున్నారు. అయినా ఆగడాలు ఆగకపోగా..మితిమీరుతున్నాయి..
తాజాగా.. జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్న ముఠాల ఆటకట్టించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ చార్మినార్ పరిధిలో కుళ్లిపోయిన ఆహార పదార్థాలు, నిషేధిత రంగులతో గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న భారీ ఇల్లీగల్ ఫాస్ట్ ఫుడ్ గోడౌన్పై పోలీసులు మెరుపు దాడి చేశారు.చార్మినార్ హుస్సేనియాలం పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచ్ మొహల్లా, న్యూ లాడ్ బజార్లో ఉన్న మెస్సర్స్ అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్ పై హెచ్-ఫాస్ట్ బృందం, ఫుడ్ సేఫ్టీ అధికారితో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. అక్కడ కనిపిస్తున్న దృశ్యాలు చూస్తే ఎవరైనా సరే ముక్కున వేలేసుకోవాల్సిందే. కనీసం FSSAI లైసెన్స్ కూడా లేకుండా, అత్యంత అపరిశుభ్రమైన, దుర్వాసన వచ్చే వాతావరణంలో ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేయడాన్ని గమనించారు.
ఈ దాడిలో నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. జనం ఆరోగ్యాన్ని గుల్ల చేసే ప్రమాదకరమైన కృత్రిమ రంగులు… ముఖ్యంగా MSK లయన్ గ్రీన్, రాస్ప్బెర్రీ రెడ్ వంటి కెమికల్స్ వాడుతూ చికెన్ వంటకాలు తయారు చేస్తున్నారు. అంతేకాదు, వాడిన నూనెనే పదే పదే వాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ తనిఖీల్లో దాదాపు 110 కిలోల కల్తీ ఫ్రైడ్ చికెన్, 90 లీటర్ల ప్రమాదకరమైన వంట నూనెతో పాటు కెమికల్ రంగులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
() నిజంగా.. ఇలాంటి కల్తీ ఆహారం తింటే కాలేయం పాడైపోవడమే కాదు… ఫుడ్ పాయిజనింగ్, క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. నగరంలో కల్తీ అన్నదానికి ‘జీరో టోలరెన్స్ పాలసీ ఉంటుందని, ఎక్కడైనా అనుమానాస్పద ఆహార కేంద్రాలు కనిపిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు.





Total views : 151104