అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. నక్కపల్లి మండలం దొడ్డిగల్లు జంక్షన్ నుంచి వేంపాడు టోల్ప్లాజా వరకు కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. అనంతరం భారతి కన్వెన్షన్లో జరిగిన విజయోత్సవ సభకు హాజరైన హోంమంత్రి, వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభివృద్ధి స్టాల్స్ను సందర్శించారు.ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. తాను ఒక సాధారణ ఉపాధ్యాయురాలిగా జీవితాన్ని ప్రారంభించి, ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా, అనంతరం మంత్రిగా ఎదిగానని చెప్పారు.ఎన్నికల వరకు మాత్రమే రాజకీయ పార్టీలు ఉంటాయని, ఎన్నికలు ముగిసిన తర్వాత అభివృద్ధి, సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని హోంమంత్రి స్పష్టం చేశారు. ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తానని, విమర్శలకు తాము భయపడబోమని పేర్కొన్నారు.






Total views : 151397